శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
Showing posts with label గణితం. Show all posts
Showing posts with label గణితం. Show all posts

సరదా గణితం మీద ఓ ఈ రోజే ఓ అద్భుతమైన వెబ్ సైట్ దొరికింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ప్రాచీన భారత గణిత విశేషాల గురించి కూడా ఎన్నో సంగతులు ఉన్నాయి.

https://twitter.com/pickover


ఆ సైట్ నుండి మచ్చుకి...



1) 'పై' విలువని రెండు దశాంస స్థానాల వరకు రాసి అద్దం ముందు పెడితో అద్దంలో ఓ మహత్యం  జరుగుతుంది...:-)













'




2)  అలాగే ఆర్యభటుడు రాసిన ఓ శ్లోకంలో పై విలువని ఎలా లెక్కించాలో తెలుస్తుంది.





ఇంకా మరెన్నో ఆసక్తి కరమైన సంగతులు ఆ సైట్ లో కోకొల్లలు ఉన్నాయి. కొన్ని గంటలు సరదాగా అవన్నీ చుస్తూ గడిపేయొచ్చు.









గణిత ప్రియులకి తరగని ఆనందాన్నిచ్చే ఓ చక్కని వెబ్ సైట్ ప్రాజెక్ట్ ఆయిలర్.
https://projecteuler.net/
ఈ వెబ్ సైట్ లో వేలాది కరుకైన, చురుకైన సమస్యలు ఇవ్వబడ్డాయి. ఇవి సామాన్య గణిత టెక్స్ ట్ బుక్ లో ఉండే సమస్యల కన్నా బాగా కఠినమైనవి. ఈ లెక్కలని గణిత పద్ధతిలో అంటే సైద్ధాంతిక పద్ధతిలో పరిష్కరించొచ్చు. లేదంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లు రాసి కూడా పరిష్కరించొచ్చు. అయితే కంప్యూటర్ వాడినా కూడా వీటిని పరిష్కరించడం అంత తేలిక కాదు.

కాఠిన్యంలో ఈ లెక్కల్లో ఎంతో వైవిధ్యం వుంది. ఈ సైట్ లోని archives   కి వెళ్తే వరుసగా  ఓ పట్టిక రూపంలో లెక్కలు ఇవ్వబడి వుంటాయి. లెక్క వున్న పేజికి వెళ్తే అక్కడ ఆ లెక్క ఎప్పుడు ప్రచురించబడిందీ, దాని కాఠిన్యం స్థాయి ఎంత మొదలైన వివరాలు ఇవ్వబడతాయి. పైగా ఆ సమస్యని గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది పరిష్కరించారో కూడా ఇవ్వబడుతుంది. ఎక్కువ మంది పరిష్కరించిన లెక్కలు కాస్త తేలికైనవి అన్నమాట.

మచ్చుకి ఓ లెక్క (Problem # 9)
(ఈ లెక్కని రెండు లక్షల పైగా జనం సాధించారు కనుక భయం లేదన్నమాట J

ఇది పైథాగోరియన్ త్రయాలు (Pythagorean triplets) అనే అంశం మీద లెక్క. పైథాగోరియన్ త్రయాలు అంటే ఈ కింది సమీకరణని తృప్తి పరిచే పూర్ణ సంఖ్యలు.
a^2 + b^2 = c^2
ఉదాహరణకి
32 + 42 = 9 + 16 = 25 = 52.
అయితే a+b+c = 1000  అయ్యే ఒక పైథాగోరియన్ త్రయాన్ని కనుక్కోండి. అలాంటిది ఒక్కటే వుంది.
అప్పుడు  abc  విలువ ఎంత?



రామానుజన్ - కన్న వారు, ఉన్న ఊరు

Posted by V Srinivasa Chakravarthy Thursday, October 9, 2014 2 comments

 ఆ ఊరి పేరు కుంభకోణం. రామానుజన్ పుట్టిన నాటికి అతని తల్లిదండ్రులు ఆ ఊళ్లోనే ఉండేవారు.
ఈ ఊరు తమిళనాడులో తంజావూరు జిల్లాలో ఉంది. చెన్నై కి 273  కిమీల దూరంలో ఉంది. తమిళనాడు తీర్థ ప్రదేశాలకి పెట్టింది పేరు. అలాంటి తీర్థాలలో ఓ ముఖ్యమైన తీర్థనగరం కుంభకోణం. ఆ ఊరి పేరు వెనుక ఓ పురాణ కథ ఉంది. కుంభ కోణం అంటే కుండకి వుండే కొమ్ము లేదా ముక్కు. అయితే ఇది సామాన్యమైన కుండ కాదు, బ్రహ్మదేవుడి కుండ! ప్రళయం వచ్చినప్పుడు ఆ కుండ ప్రళయ జలాలలో కొట్టుకుపోయి ఈ ఊరి వద్దకి కొట్టుకు వచ్చిందట. కుండలోని అమృతం ఈ ఊళ్ళో ఉండే అసంఖ్యాకమైన కోవెల కొలనులలోకి ప్రవహించిందట.  ఈ ప్రసిద్ధమైన సంఘటనకి జ్ఞాపకార్థం పన్నెండేళ్లకి ఒకసారి ఈ ఊళ్లో ఇప్పటికీ ‘మహామఖం’ అనే ఉత్సహం జరుపుకుంటారు. పండుగ సమయంలో ఆ చిన్న ఊళ్లోకి కొన్ని లక్షల మంది తీర్థప్రజలు విచ్చేస్తారు. ఆ ఊళ్లోని ప్రతీ ఆలయంలోను వేలుపు దర్శనం చేసుకుని, ఎదురుగా ఉండే తటాకంలో మునక వేసి, జన్మ ధన్యమయ్యిందనుకుని తృప్తి పడతారు. కుంభకోణంలోని ఆలయాలు, సరస్సులు, తీర్థప్రజలు, ధార్మిక జీవన విధానం, సాంప్రదాయనిబద్ధమైన వాతావరణం – ఇవన్నీ ఎదుగుతున్న రామానుజుడి మనస్తత్వం మీద గాఢమైన ముద్ర వేశాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కుంభకోణానికి పవిత్రతని ఆపాదించేవి కేవలం కోవెల కొలనులే కాదు. అంతకన్నా పెద్ద జలాశయం ఒకటి వుంది. అదే ‘దక్షిణ గంగ’గా పేరు పొందిన కావేరీ నది. ఈ నది వెనకా ఓ కథ వుంది. కావేర ముని అనే ఓ ముని బ్రహ్మదేవుడి కూతుళ్ళలో ఒక బాలికని దత్తత తీసుకుని గారాబంగా పెంచుకున్నాడట. తండ్రి మీద ప్రేమతో ఆ కన్య నదిగా మారి ఆ ప్రాంతాన్ని శోభాయమానం చేసిందట. కావేరీ జలాల దోసిట్లో కుంభకోణం నగరం శోభిల్లుతుంటుంది. పశ్చిమాన ఐదొందల మైళ్ల దూరంలో, కర్ణాటక ప్రాంతంలో, కూర్గ్ పర్వతాలలో జన్మించిన  ఈ నది ఎన్నో ఆనకట్టలు దాటుకుంటూ కుంభకోణం నగరం పక్క నుండి ప్రవహిస్తుంది. మరో పక్క కావేరికి ఉపనది అయిన అరసలర్ నది ప్రవహిస్తుంది.

కావేరి కృప వల్ల తంజావూరు జిల్లా సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ నదీ  జలాల వల్ల సాగునీటి కోసం వర్షపు నీటి మీద ఆధారపడే అవసరం అంతగా ఉండదు. 1877  లో వరసగా రెండేళ్లు వర్షాలు సరిగ్గా పడక దక్షిణ భారతంలో కరువు విలయ తాండవం చేసింది. వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. కాని తంజావూరు జిల్లా లో మాత్రం కరువు యొక్క దుష్పలితాలు కనిపించకపోగా ఇరుగుపొరుగు జిల్లాలలో ధాన్యపు ధరలు ఆకాశాన్ని అంటటం వల్ల తంజావూరు జిల్లాకి  బోలెడంత ఆదాయం లభించింది.

సహజమైన సస్యసంపత్తి గల ప్రాంతం కావడంతో ఊరి ప్రజలు నిరంతరం ఆహార ఉత్పత్తి కోసం తలమునకలు కావలసిన పని లేకుండా పోయింది. ఆ కారణం చేత వృత్తి విద్యలకి, కులవృత్తికి మంచి పోషణ లభించింది. పంటపనులకే పరిమితం కాకుండా మానవ జీవన స్రవంతి మరెన్నో దిశలలో ప్రవహించింది. అందుకే ఊరు చిన్నదే అయినా ఆ ఊళ్లో గ్రామీణ సంస్కృతికి బదులు చక్కని  పట్టణ సంస్కృతి నెలకొంది. ఆ రోజుల్లో కుంభకోణానికి చెందిన లోహపు విగ్రహాలకి ప్రపంచ ప్రసిద్ధి ఉండేది. రాగి, వెండి, ఇత్తడి లోహాలతో చేసిన వేలుపుల విగ్రహాలకి యూరప్ విపణి ప్రపంచంలో మంచి గిరాకి ఉండేది.
లోహవిగ్రహాలే కాకుండా కుంభకోణానికి ప్రత్యేకమైన విషయం మరొకటి వుంది. కుంభకోణానికే కాదు, మొత్తం తంజావూరు ప్రాంతానికే ప్రత్యేకమైన విషయం పట్టు చీరలు. మిరుమిట్లు గొలిపే రంగులతో, వెండి బంగరు జరీ అంచులతో, వాటి మీద కన్ను పడగానే సొంతం చేసుకోవాలని అనుకోని ఇంతి లేదంటే అతిశయోక్తి కాదు.

రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యాంగారు ఓ చీరల అంగడిలో గుమాస్తాగా పని చేసేవాడు. ఆయన తండ్రి కుప్పుస్వామి అయ్యంగార్ ది కూడా అదే ఉద్యోగం. కనుక ఇది ఒక విధంగా వారికి వంశపారంపర్యంగా వచ్చిన వృత్తి. అంగడిలో జమాఖర్చులు చూసుకోవడం, అవసరమైతే చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి అక్కడ బాకీలు వసూలు చెయ్యడం మొదలైనవి ఆయన దైనిక కర్యక్రమాలు. చీరలలో వాడే బట్ట యొక్క నాణ్యత తెలుసుకోవడంలో ఈయనకి మంచి నైపుణ్యం ఉండేదట. ఇదే తన యజమానికి తనలో బాగా నచ్చిన విషయం.  ఇలాంటి గుమాస్తా ఉద్యోగాలు చేసేవారిలో కొంత మంది ఏళ్ళ తరబడి మరొకరి మోచేతి నీరు తాగడం ఇష్టం లేక సొంతంగా వ్యాపారం పెట్టుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాని శ్రీనివాస అయ్యంగారుది ఉన్నదాంతో సరిపెట్టుకునే తత్వం. అందుకే సొంత వ్యాపారాల జోలికి పోకుండా చీకు చింతా లేని సాఫీ జీవనాన్ని ఎంచుకున్నాడు. రోజు ఉదయానే ఎనిమిది గంటలకి సారంగ పాణి సన్నిధి వీధిలో ఉండే తన ఇంటి నుండి బయల్దేరి అంగడికి చేరుకోవడం. రోజంతా పద్దులు చూసుకోవడం. సాయంకాలం కాగానే టంచనుగా ఇంటికి చేరుకోవడం. ఇలాంటి యాంత్రికమైన దినచర్యతో సరిపెట్టుకున్నాడు.

సాంప్రదాయక భారతీయ కుటుంబాలలో తండ్రికి, పిల్లలకి మధ్య చనువు తక్కువ, దూరం ఎక్కువ.  చేరదీసినా, చెవి మెలిపెట్టినా తల్లి చెయ్యాల్సిందే. తండ్రి ఇంట్లోకి వస్తే పిల్లలు భయం భయంగా తప్పుకుని తిరగాల్సిందే. రామానుజన్ తండ్రి అలాంటి ఛండశాసనుడు కాకపోయినా, ఆయన ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండేవాడు. ఉద్యోగం చేసి జీతం ఇంటికి తేవడంతో ఆయన భాద్యత తీరి పోయింది అన్నట్టు ఉండేది. కనుక రామానుజన్ మీద ఆయన ప్రభావం తక్కువ అంటారు రామానుజన్ జీవితాన్ని పరిశీలించిన పండితులు.

(ఇంకా వుంది)





సుదీర్ఘమైన, సుదీప్తమైన గతం గల భారతానికి గణితం కొత్తేమీ కాదు.

మనకి తెలిసిన అత్యంత ప్రాచీన భారతీయ కృతులు వేదాలు.  వేదకాలం నుండి కూడా అంటే కనీసం నాలుగు వేల ఏళ్ల క్రితమే భారతంలో ఓ సజీవ గణిత సాంప్రదాయం ఉండేదని చారిత్రకులు చెప్తారు. యజుర్వేదంలోనే పెద్ద పెద్ద సంఖ్యలతో సులభంగా వ్యవహరించేందుకు గాను వాటికి ప్రత్యేకమైన పేర్లు ఇవ్వబడ్డాయని తెలుస్తోంది.
యజుర్వేద సంహితలోని ఓ శ్లోకంలో “శతం” (అంటే నూరు, 100), “సహస్రం” (వేయి), “అయుత” (పది వేలు), “నియుత” (లక్ష లేదా 1,00,000), “ప్రయుత” (10,00,000), “అర్బుద” (1,00,00,000), “న్యర్బుద” (10,00,00,000), “సముద్ర” (1,00,00,00,000), “మధ్య” (10,00,00,00,000), “అంత” (1011), “పరార్ధ” (1012) – మొదలైన మహా సంఖ్యల పేర్లు ప్రస్తావించడం జరిగింది.

అంత విస్తారమైన సంఖ్యా వ్యవస్థని స్థాపించిన వేదాలలో అంతే విస్తారమైన కాలమానం కూడా వర్ణించబడింది.  అతి క్లుప్తమైన వ్యవధుల దగ్గరి నుండి ఊహించరానంత దీర్ఘమైన యుగాల వరకు భారతీయ కాలమానం  విస్తరించి ఉంటుంది. ఉదాహరణకి మనం సామాన్య సంభాషణల్లో ‘తృటిలో జరిగిపోయింది’ అంటుంటాం. ఆ తృటి విలువ ఆధునిక కాలమానంలో సెకనులో 3290 వంతు. అంత కన్నా చిన్న వ్యవధి ‘పరమాణు’. దీని విలువ 16.8 మైక్రోసెకన్లు (1 మైక్రోసెకను = సెకనులో వెయ్యోవంతులో వెయ్యోవంతు).  ఇక వ్యవధుల్లో కెల్లా అతి దీర్ఘమైనది  మహాకల్పం. దీని విలువ 311.04 ట్రిలియన్ సంవత్సరాలు (1 ట్రిలియన్= 1 పక్కన పన్నెండు సున్నాలు)! అంటే మన ప్రచీన కాలమానం మైక్రోసెకన్ల వద్ద నుండి ట్రిలియన్ల సంవత్సరాల వరకు కాలాన్ని కొలిచింది.  భారతీయ కాలమానం యొక్క ఈ లక్షణం గురించి ప్రఖ్యాత ఖగోళశాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత కార్ల్ సాగన్ కూడా మెచ్చుకుంటాడు. ప్రాచీన సాంప్రదాయాలలో అంత సుదీర్ఘమైన కాలవ్యవధులతో వ్యవహరించిన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం కాక మరొకటి లేదంటాడు.

యజ్ఞం చేసే ఋషులు జ్యామితికి (geometry), త్రికోణమితికి (trigonometry) చెందిన ఎన్నో ఫలితాలు వాడేవారు. సుమారు మూడు వేల ఏళ్ల నాటి ‘సుల్బ సూత్రాల’లో వేదకాలంలో వాడే గణితానికి చెందిన ఎన్నో సంగతులు వర్ణించబడ్డాయి. ‘బౌధాయన సుల్బ సూత్రం’లో ఒక శ్లోకానికి తాత్పర్యం ఇలా వుంది -
“ఓ దీర్ఘచతురస్రం యొక్క పొడవు మీద, వెడల్పు మీద, చదరాలని నిలిపి, వాటి విస్తీర్ణతలని కలిపితే వచ్చే ఫలితం, ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం (diagonal) మీద నిలిపిన చదరం యొక్క విస్తీర్ణతతో సమానం.”
ఇది ఆధునిక పైథాగరస్ సిద్ధాంతం యొక్క ఆదిమ రూపంగా చెప్పుకోవచ్చు.
క్రీ.పూ. 800  కి చెందిన అదే కృతిలో కృతి రచయిత అయిన బౌధాయనుడు  2  కి వర్గమూలాన్ని (square root of 2) లెక్కించడానికి ఈ ఫలితాన్ని కూడా ఇస్తాడు –


ఈ విలువ అసలు విలువ అయిన 1.41421356 తో ఐదవ దశాంశ స్థానం వరకు సరిపోతోంది. అంటే ఆ నాటికే  కరణీయ సంఖ్యల (irrational numbers) గురించిన పరిజ్ఞానం ఉండేదన్నమాట.

క్రీ.పూ. 400 నుండి క్రీ.శ.200 వరకు గల కాలంలో జైన మతానికి చెందిన ఎందరో గొప్ప గణితవేత్తలు వేదకాలానికి చెందిన గణిత సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లారు. గణితంలో సున్నా (శూన్యం) అన్న భావనని మొట్టమొదట ఈ జైన గణితవేత్తలే ప్రవేశపెట్టారని అంటారు. సున్నాతో పాటు అనంతం (infinity)  అన్న భావనని కూడా ప్రవేశపెట్టి, అనంతతలో పలు రకాలని కూడ వర్ణించారు. ఈ దశకి చెందిన పింగళుడు అనే గణితవేత్తకి ఆధునిక ‘ద్విపద సిద్ధాంతం’ (binomial theorem) కి చెందిన ఎన్నో ఫలితాలు తెలుసట.

ప్రాచీన భారత గణిత చరిత్రలో ఆ తరువాత వచ్చిన దశని సాంప్రదాయక దశ  (classical period)  అంటారు.
క్రీ.శ. 400-1200  నడిమి కాలానికి చెందిన ఈ దశలో ఆర్యభటుడు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, (ఒకటవ మరియు రెండవ) భాస్కరాచార్యుడు  మొదలైన మహా గణితజ్ఞుల కృషి వల్ల భారతీయ గణితం గణనీయంగా ఎదిగింది. అంకగణితంలో ‘కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం’ అనే నాలుగు మౌలిక పద్ధతులని కచ్చితంగా నిర్వచించి క్రీ.శ. ఏడవ శతాబ్దంలో అంకగణితానికి పునాదులు వేశాడు బ్రహ్మగుప్తుడు. యూరప్ లో మధ్య యుగం (క్రీ.శ 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు) నడుస్తున్న రోజుల్లో ఈ విధానాలే ‘Modus Indorum’  (ఇటాలియన్ భాషలో ‘భారతీయ విధానాలు’) గా యూరప్ లో చలామణి అయ్యాయి. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దానికి మన దేశంలో బాగా అభివృద్ధి చెందిన దశాంశ వ్యవస్థ (decimal system)   ఉందని, మన దేశం నుండి అది యూరప్ తదితర ప్రాంతాలకి పాకిందని చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు.

సాంప్రదాయక దశ తరువాత భారతీయ గణితంలో  ముఖ్యమైన దశ కేరళ గణిత దశ (క్రీ.శ. 1300-1600).  కేరళకి చెందిన ఎందరో గణితవేత్తలు ఈ దశలో గొప్ప ప్రగతి సాధించారు. వీరిలో ఓ ప్రముఖ గణితవేత్త పేరు మాధవుడు . పదహారవ శతాబ్దం వరకు కూడా ఓ వెలుగు వెలిగిన కేరళకి చెందిన గణిత, ఖగోళవిజ్ఞాన సాంప్రదాయానికి ఇతడే మూలకర్త అని చెప్పుకుంటారు. కేరళ గణితవేత్తల ప్రత్యేకత అనంత శ్రేణులకి సంబంధించిన పరిజ్ఞానం. పరిమితమైన సంఖ్యలో రాశులని కలిపితే వచ్చే ఫలితం పరిమితంగానే ఉంటుంది. కాని అపరిమిత సంఖ్యలో రాశులని కలిపినా కొన్ని పరిస్థితుల్లో పరిమితమైన ఫలితం వస్తుందని గణితం చెప్తుంది. అది అర్థం చేసుకోడానికి కాల్క్యులస్ కి చెందిన పరిమితి (limit) మొదలైన భావనలు అవసరం అవుతాయి. ఉదాహరణకి త్రికోణమితికి చెందిన ప్రమేయాలని అనంత శ్రేణులుగా వ్యక్తం చేయడం ఎలాగో మాధవుడు తెలుసుకున్నాడు. అలాంటి ఫలితానికి ఓ తర్కాణం –


మాధవుడు సాధించిన గణిత ఫలితాలని పరిశీలించిన నిపుణులు, కాల్కులస్ ని మొదట కనిపెట్టింది న్యూటన్, లీబ్నిజ్ లు కారని, కేరణకి చెందిన మాధవుడని నిర్ణయించారు.

ఆ విధంగా నాలుగు వేల ఏళ్లకి పైగా సుదీర్ఘమైన, వైభవోపేతమైన చరిత్ర గల భారతీయ గణితం  మరి ఎందుచేతనో కేరళ దశ తరువాత స్తబ్దుగా ఉండిపోయింది. గణిత రంగంలోనే కాదు, అసలు వైజ్ఞానిక రంగంలోనే భారతీయుల గమనం ఈ దశలో మందగించడానికి  కారణం విదేశీయుల పాలన కావచ్చు. ‘స్థానిక అనాగరిక భారతీయులకి బ్రిటిష్ సంస్కృతి నేర్పాలనే’ ఉద్దేశంతో లార్డ్ మాకలే ప్రవేశపెట్టిన విద్యావిధానం కావచ్చు. 1931  లో బ్రిటిష్ వారితో ఓ సమావేశంలో మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు  – “మీ బ్రిటిష్ వాళ్లు మా విద్యావ్యవస్థని మొదలంటా నరికేశారు. అందుకే నేటి భారతంలో నూరేళ్ల క్రితం కన్నా ఎక్కువ నిరక్ష్రాస్యత ఉంది,” అంటూ తెల్ల దొరల మీద దుమ్మెత్తిపోశాడు.

 ‘సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి, భారతీయులది అసంస్కృతి, కుసంస్కృతి’ – శతాబ్దాల పాటు ఈ మాటని మంత్రంలా జపించిన మన తెల్ల పాలకుల మాట నమ్మాం. పదే పదే పలికితే అబద్ధం కూడా  నిజంలా వినిపిస్తుందంటారు. వారి మాయమాటల సమ్మోహనంలో పడి మన ఘనత మనం మర్చిపోయాం. అనాదిగా మనకి తెలిసిన చదువులు మరిచాం.

ఆ సమ్మోహనాన్ని వమ్ము చేసి, పూర్వం మన దేశంలో వెలిగిన అపూర్వమైన గణిత సాంప్రదాయాన్ని పునరజ్జీవింపజేయడానికి ఒక్కడు పుట్టాడు. అతడి పేరు శ్రీనివాస రామానుజన్.

*        *        *

“By Studying the Masters” - గణిత వ్యాసం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, December 18, 2012 3 comments

“By Studying the Masters”


రచన – “తార”



When asked how he developed his mathematical abilities so rapidly, Abel replied "by studying the masters, not their pupils."


(Niels Henrik Abel)



గతవారం ఒక ప్రఖ్యాత తెలుగు సైన్సు రచయిత, మూఢనమ్మకాలని తరిమెయ్యడానికి ఒక "విజ్ఞాన వేదిక" ఉన్న ఒకరి "వైజ్ఞానిక విధానం" అంటే ఏమిటి అని రాసిన ఒక వ్యాసం దురదృష్టవశాత్తూ చదవటం జరిగింది, మూఢనమ్మకాలని పారద్రోలుతాను అనే వ్యక్తే ఇంత మూఢంగా సైన్సు గురించి ప్రచారం చేస్తుంటే సామాన్య ప్రజలకి సైన్సు అంటే ఏమిటి అన్న దానిపై ఎంత అవగాహన ఉన్నదో అనిపించింది, విజ్ఞానశాస్త్ర పురోగతిలో చిన్నపిల్లల సైన్సు పుస్తకాల పాత్ర అద్వితీయం, చాలా మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చిన్నప్పుడు చదువుకున్న విజ్ఞానశాస్త్ర పుస్తకాల నుంచే స్పూర్తి పొందారు, కానీ దురదృష్టవశాత్తూ తెలుగులో అంతటి గొప్ప రచనలు ఐతే నాకు కనపడలేదు, 2008లో ఈ-మాటలో కొడవళ్ళ హనుమంతరావుగారి కంప్యూటీంగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు నేను చదివిన సైన్సు రచనల్లో అత్యుత్తమంగా అనిపించింది, సైన్సు పేరుతో చాలా మంది "మేధావుల" రచనలు వచ్చినా చాలా వరకు నవ్వుకునే విధంగా ఉంటున్నాయి, నా వంతుగా నాకు తెలిసినవి రాద్దామనుకున్నా, సరైన వేదిక కోసం ఇన్నాళ్ళు వేచి చూశాను, "శాస్త్ర విజ్ఞానం" అందుకు తగిన వేదిక అని భావిస్తూ నావంతుగా కొద్దిగా నాకు తెలిసిన విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటో వివరణ ఇచ్చే ప్రయత్నమే ఇది, పైన చెప్పినట్టు, కొందరు మాష్టర్స్ని పరిచయం చేస్తూ వారి సలహాలని మీతో చదివించే ప్రయత్నమే..



" మానవుడికి క్రమత్వం అంటే ఇష్టం ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తుంటాడు. ఇటువంటి అన్వేషణ వల్ల విజ్ఞానరంగంలో కూడా ఒకే క్రమాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తాడు. "



ఇది చదవగానే నాకొచ్చిన కొన్ని అనుమానాలు, అసలు క్రమత్వం, భిన్నత్వం, ఏకత్వం అంటే ఏమిటి? అసలు దాన్ని ఎవరు "డిఫైన్" చేశారు? నాకు ఒకటి క్రమపద్దతిలో ఉన్నది అనిపించినంత మాత్రాన, అందరికీ అదే క్రమత్వం అవుతుందా? వేరెవరో ఒకతి ఇదే "క్రమం, ఇదే భిన్నం," అని చెప్పినంత మాత్రాన నేను ఎందుకు వారితో ఏకీభవించాలి? అంటే శాస్త్రవేత్తలు చేసేది కేవలం Intellectual Gymnastics మాత్రమేనా? కేవలం రమణీయత కోసం ఇన్ని కోటాను కోట్ల ధనం వృధా చేస్తున్నారా? అసలు నిజంగా విజ్ఞాన శాస్త్రం చేసేది భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమేనా?



ఇది చాలా పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త మాటల్లో చూద్దాం, దానికంటే ముందుగా, వ్యాసంలోని ఇంకో పేరా చూద్దాం.



"ప్రారంభ ప్రాతిపదికలన్నీ రుజువు అవసరం లేనివిగా భావించబడు తున్నాయి. అవి రుజువు పరచనక్కరలేదంటే, వాటిని ఇంకో సూత్రం నుంచి రాబట్టే అవసరం లేదన్నమాట. మరో సూత్రం నుంచి గనక రాబట్టగలిగితే, అదే ఆరంభదశ అవుతుందన్న మాట. ఇలా అనంతంగా వెనక్కు పోకుండా ఉండాలంటే, ఎక్కడోచోట ఆరంభించడం తప్పనిసరి అవుతుంది. ఈ ఆరంభదశనే విజ్ఞానంలో ప్రతిపాదన అంటాం."



ఇది బహుశా ఒక ఐదారు వందల ఏళ్ళనాటి భావన అనుకుంటా, విజ్ఞాన శాస్త్రం "తార్కిక పరిధి" ఎప్పుడో దాటిపోయింది కానీ మన సైన్సు రచయితలకి ఇది ఊహకి అందని విషయం. ఆరంభం ఎక్కడో తెలిస్తే అన్వేషణ అంతం ఐపోయినట్టే, విజ్ఞాన శాస్త్రానికి అంతం, ఆరంభం రెండూ ఇప్పటివరకూ కనుగొనలేదు, ఆరంభాన్ని నిర్దేశించాలి అని చేసిన ప్రయత్నం, ఒక్క దాని అంతు ఐనా చూడాలి అన్న ఏకైక ప్రయత్నం రెండూ బెడిసికొట్టాయి.



ఎవరో తత్వవేత్త అభిప్రాయం తీసుకువచ్చి సైన్సు ఇలా ఉన్నది, శాస్త్రవేత్తలు ఇది ఇందుకు చేస్తున్నారు అని చెప్పడం చాలా అసహజంగా ఉన్నది, హెగెల్ ఎవరో నాకు తెలియదు, తెలుసుకొవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు, ఎబెల్ చెప్పినట్టు, నేను నా మాష్టర్స్ ఆలోచనలకే విలువ ఇస్తాను తత్వవేత్తలకి సైన్సులో ప్రాముఖ్యం లేదు.



మొదటి ప్రశ్నకి సమాధానం



"We should like to stress that these algebraic systems and the axioms which define them must have a certain naturalism about them. They must come from the experience of looking at many examples; they should be rich in meaningful results. One does not just sit down, list a few axioms, and then proceed to study the system so described. This, admittedly, is done by some, but most mathematicians would dismiss these attempts as poor mathematics. The systems chosen for study are chosen because particular cases of these structures have appeared time and time again, because someone finally noted that these special cases were indeed special instances of a general phenomenon, because one notices analogies between two disparate mathematical objects and so is led to a search for the root of these analogies." - I.N.Herstein.



పైదానికి వివరణ,రెండో ప్రశ్నకి సమాధానం సులువైనది కాదు, కనీసం నాలుగైదు టపాలైనా పడుతుంది, అది మెల్లగా చూద్దాం, దానికి ముందు, మనకి ఉన్న ఇంకొన్ని నమ్మకాలపై నా మాష్టర్స్ అభిప్రాయాలు చూద్దాం.



" టీచర్స్ కన్నా మా అబ్బాయికే ఎక్కువ తెలుసండి", ఇదీ చాలా మంది తల్లిదండ్రులు వాడేదే, టీచర్స్ కన్నా ఎక్కువ ఎలా తెలుసు? ఎలా తెలుసుకున్నాడు? ఏ పుస్తకాలు చదివాడు అన్న ప్రశ్నలు సాధరణంగా వారిని తిరిగి ఎవరూ అడగరేమో? ఇది అన్ని దేశాల్లోను ఉన్నదే, దీని గురించి Terrance Tao మాటల్లో



The popular image of the lone (and possibly slightly mad) genius – who ignores the literature and other conventional wisdom and manages by some inexplicable inspiration (enhanced, perhaps, with a liberal dash of suffering) to come up with a breathtakingly original solution to a problem that confounded all the experts – is a charming and romantic image, but also a wildly inaccurate one, at least in the world of modern mathematics. We do have spectacular, deep and remarkable results and insights in this subject, of course, but they are the hard-won and cumulative achievement of years, decades, or even centuries of steady work and progress of many good and great mathematicians; the advance from one stage of understanding to the next can be highly non-trivial, and sometimes rather unexpected, but still builds upon the foundation of earlier work rather than starting totally anew.





ఎవరో పాకిస్తాన్లో నీళ్ళతోనడిచే కారు తయారు చేశారు అనగానే నమ్మేస్తూ మన విధ్యా వ్యవస్థలో లోపాలు వెతకడం మొదలెడతాం, ఎవరో 14 ఏళ్ళ పిల్ల ఎదో సర్టిఫికేట్ తెచ్చి చూపించి "ఐన్స్టీన్ ని తప్పు అని నిరూపిస్తాను/ నిరూపించాను " అనగానే పేపర్ల నిండా అదే వార్త, అసలు ఐన్స్టీన్ అంటే అంత లోకువా, ఐన్స్టీన్, కొన్ని వందల ఇతర శాస్త్రవేత్తలు కొన్ని శతాబ్ధాల కృషి ఒక చిన్న పిల్ల (ఐన్స్టీన్ రిలెటివిటీ థీరీని చదవడానికి అవసరం ఐన ప్రీరిక్విసైట్స్ చదవడానికే ఆ అమ్మాయికి ఇంకో 15 ఏళ్ళు పడుతుంది అన్నది ఎంతమందికి తెలుసు?"





Actually, I find the reality of mathematical research today – in which progress is obtained naturally and cumulatively as a consequence of hard work, directed by intuition, literature, and a bit of luck – to be far more satisfying than the romantic image that I had as a student of mathematics being advanced primarily by the mystic inspirations of some rare breed of “geniuses”. This “cult of genius” in fact causes a number of problems, since nobody is able to produce these (very rare) inspirations on anything approaching a regular basis, and with reliably consistent correctness. (If someone affects to do so, I advise you to be very sceptical of their claims.) The pressure to try to behave in this impossible manner can cause some to become overly obsessed with “big problems” or “big theories”, others to lose any healthy scepticism in their own work or in their tools, and yet others still to become too discouraged to continue working in mathematics. Also, attributing success to innate talent (which is beyond one’s control) rather than effort, planning, and education (which are within one’s control) can lead to some other problems as well.

ఇదీ టెర్రి ఉవాచ, స్వయంగా బాల మేధవి ఐన టెర్రి "బాల మేధావులగురించి" చెప్పింది.

http://terrytao.wordpress.com/career-advice/does-one-have-to-be-a-genius-to-do-maths/



"థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు" ఇది తరచూ మనకి వినిపించేదే, థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు ఐనప్పుడు అసలు థియరీ చదవడం ఎందుకు? అసలు ఈ బడులు, మోతలు ఎందుకు?

"థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు" - అసలు మోడల్ ఎందుకు అన్నదానికి Macroeconomics by DFS ఇచ్చిన సమాధానం ఇక్కడా అన్వయించుకోవచ్చు "Models are simplified representations of the real world. A good model accurately explains the behaviors that are most important to us and omits details that are relatively unimportant. The notion that the earth revolves around the sun on an elliptical path and that the moon similarly revolves around the earth is an example of a model. The exact behavior of sun, earth and moon is much more complicated, but this model enables us to understand the phases of the moon. For this purpose, it is a good model. Even though the real orbits are not simple ellipses, the model "works". A particular model is a tool based on a set of assumptions that are reasonable in some real world problems."



ఇంకో విధంగా చెప్పాలి అంటే, స్కూల్ ఫిజిక్స్లో ఫ్రిక్షన్ అన్నది లేదు అన్న Assumption మీద అన్ని మోడల్స్, ప్రశ్నలు ఉంటాయి, కాని అది నిజజీవితంలో సాధ్యమా? కానీ అంత కాంప్లికేటెడ్ సినారియో డీల్ చెయ్యాలి అంటే అవసరమైన మెషినరీ ( మేథమేటికల్ నాలెడ్గ్) పదో తరగతిలో ఉండదు, అందుకే సులువైనవి, చిన్న చిన్న మోడల్స్ని పరిచయం చేస్తారు, మెల్లాగా అవసరమైన మెషినరీ, కాంప్లికేటెడ్ మోడల్స్ నేర్చుకునే అవకాశం అవసరం పై తరగతుల్లో వస్తుంది.



నేను పరిచయం చెయ్యాలనుకొన్ని మరో వ్యక్తి Alexander Grothendieck, ఇతని గురించి చెప్పాలి అంటే, Einstein's Theory of relativity is a simple corollary to Grothendieck's Spectral Sequence. {http://www41.homepage.villanova.edu/klaus.volpert/Research/paper1.pdf} మేథమేటిక్స్లోనే గనుక నోబెల్ ప్రైజ్ ఉంటే ఇతనికి ఒక అధమం పాతిక నోబెల్ ప్రైజులు వచ్చి ఉండేవి.



అతనెందుకు అంత గొప్పవాడు అంటే,

He was not interested in the solving of difficult or famous problems, especially if it had to be done "by force", but his goal was to achieve such a deep and complete understanding of the underlying structures that the solutions of such problems would fall out "on their own". By doing so he rewrote Mathematics.



విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ మానవుని ఇష్టానుసారం అమర్చుకుంటూ వచ్చింది కాదు, తనకి ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ, అధిగమించడానికి, లేదా సమస్యకి మూలం కనుగొనే చేసిన, చేస్తున్న ప్రయత్నం తప్ప Intellectual Gymnastics మాత్రం కాదు, అలా ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు (అదే సో కాల్డ్ క్రమ పద్దతి) చేసిన కృషి నిలబడిన ధాఖలాలు లేవు.



చివరగా Schwartzని Grothendieck గురించి అడిగినప్పుడు చెప్పింది "Young and Hardworking", అంతే తప్ప ఇతను ఒక మేధావి (జీనియస్) అని మాత్రం పరిచయం చెయ్యలేదు, దాదాపుగా సైంటిఫిక్ కమ్యూనిటిలో ఎక్కువగా వినిపించే పదాలు Hardworking, Extremely motivated తప్ప Born Genius కాదు, టెర్రి మాటల్లో చెప్పాలి అంటే, తనని తాను మల్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు, ఒలింపియాడ్లో ప్రైజులు వచ్చాక ముందుగా తెలుసుకున్నది, తన మొరటు పద్దతులు రీసెర్చ్కి ఎందుకూ పనికిరావు, "Attacking the Problem", అన్నది ఒలింపియాడ్స్ వరకే పరిమితం, రీసెర్చ్కు అది చాలా అసహజం, రీసెర్చ్, లేదా పెద్ద సమస్యని సాల్వ్ చెయ్యాలి అంటే ముందు కావలసింది తగినంత "మెషినరీ", తన ఏరియా మిగతా ఏరియాలతో ఎలా Interact అవుతున్నది అన్నది చాలా ముఖ్యం, తన ఆవిష్కరణల వెనుక దాదాపు ఒక దశాబ్ధం కృషి ఉన్నది, అలానే నిర్మొహమాటంగా తప్పులను అంగీకరించడం, ఇతరుల విమర్శను ఎల్లప్పుడూ స్వీకరించడం అన్నవి చాలా ముఖ్యం. మేధ, తెలివి వగైర వగైర అన్నవి కేవలం మన భ్రమ, సరైన జ్ఞానం లేనప్పుడూ ఎంత మేధస్సు ఉన్నా సాధింగలిగింది సూన్యం.



http://terrytao.wordpress.com/career-advice/work-hard/



Relying on intelligence alone to pull things off at the last minute may work for a while, but, generally speaking, at the graduate level or higher it doesn’t.

One needs to do a serious amount of reading and writing, and not just thinking, in order to get anywhere serious in mathematics; contrary to public opinion, mathematical breakthroughs are not powered solely (or even primarily) by “Eureka” moments of genius, but are in fact largely a product of hard work, directed of course by experience and intuition.



It would be very pleasant if one could just dream up the grand ideas and let some “lesser mortals” fill in the details, but, trust me, it doesn’t work like that at all in mathematics; past experience has shown that it is only worth paying one’s time and attention to papers in which a substantial amount of detail and other supporting evidence (or at least a “proof-of-concept”) has already been carefully gathered to support one’s “grand idea”. If the originator of the idea is unwilling to do this, chances are that no-one else will do so either.

In short, there is no royal road to mathematics; to get to the “post-rigorous” stage in which your intuition matches well with what one can establish rigorously, one has to first invest real effort in learning and relearning the field, learning the strengths and weaknesses of tools, learning what else is going on in mathematics, learning how to solve problems rigorously, and answering lots of dumb questions, and so forth. This all requires hard work.

(All the quotes of Terry are from his blog http://terrytao.wordpress.com)



ఒక్క మాటలో చెప్పాలి అంటే, సరైన చదువు, శాస్త్రబద్ధమైన ఆధారాలు, అవసరాలు లేనప్పుడు ఐడియా అన్నదానికి విలువ లేదు. ఎక్కువగా మనకి తప్పుగా కనిపించేవి మన అజ్ఞానాకి సూచికలు మాత్రమేనేమో.



వచ్చే భాగంలో తర్కం, తార్కిక పద్దతి, విజ్ఞాన శాస్త్రం మొత్తం తర్కం మీదనే ఆధారపడి ఉన్నది అన్న మన సైన్సు రచయితల (పురాతనమైన) అభిప్రాయం ఎంత తప్పో చూద్దాం.



(ఇంకా వుంది)

Sin(x) మీద ఓ ప్రాచీన కవిత

Posted by V Srinivasa Chakravarthy Tuesday, October 9, 2012 8 comments



‘కటపయ’ పద్ధతి ఉపయోగించి 31 దశాంశ స్థానల వరకు పై విలువని పద్య రూపంలో ప్రాచీన భారత గణితవేత్త ఆర్యభట్టు వ్యక్తం చెయ్యడం గురించి లోగడ ఓ పోస్ట్ లో చెప్పుకున్నాం.
http://scienceintelugu.blogspot.in/2009/09/31.html




  అలాంటి పద్ధతినే ఉపయోగించి ఆ గణితవేత్త sin(x) యొక్క విలువలని పద్య రూపంలో ఓ పట్టికగా ఇచ్చాడు. ఆ విశేషాలు ఈ వ్యాసంలో…



అక్షరాలతో పెద్ద పెద్ద సంఖ్యలని వ్యక్తం చేసే పద్ధతి-

ఆర్యభట్టు కనిపెట్టిన పద్ధతిలో ‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలు 1 నుండి 25 వరకు అంకెలకి సంకేతాలు. ఆ తరువాత వచ్చే ‘య, ర, ల, వ, శ, ష, స, హ’ అనే హల్లులు 30,40,50,60,70,80,90,100 అంకెలకి సంకేతాలు.

ఇక ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అచ్చులు దశాంశ స్థానాన్ని నిర్దేశిస్తాయి. అది ఈ విధంగా ఉంటుంది –

అ లేదా ఆ = 100^0 = 1

ఇ లేదా ఈ = 100^1 = 100

ఉ లేదా ఊ = 100^2 =10,000

ఋ లేదా ౠ = 100^3

ఌ లేదా ౡ = 100^4

ఎ, లేదా ఏ = 100^5

ఐ = 100^6

ఒ, లేదా ఓ = 100^7

ఔ = 100^8



ఇలాంటి ప్రతీకాత్మక పద్ధతితో చాల పెద్ద పెద్ద సంఖ్యలని కూడా ఎంతో క్లుప్తంగ వ్యక్తం చెయ్యొచ్చు.

కొన్ని ఉదాహరణలు –

హల్లు ‘క’ = 1, అచ్చు ‘ఇ’ = X 100. కనుక ‘క, ఇ ల కలయిక వల్ల ఏర్పడ్డ ‘కి’ = 1 X 100 = 100.

హల్లు ‘గ’ = ౩, అచ్చు ‘ఉ’ = X 10^4 = 10,000. కనుక ‘గ, ఉ’ ల కలయిక వల్ల ఏర్పడ్డ ‘గు’ = 3X 10,000 = 30,000.

అంటే ‘హల్లు’, ‘అచ్చు’ కలిసినప్పుడు రెండిటి విలువలని గుణించాలన్నమాట.

కాని రెండు హల్లులు వరుసగా వచ్చినప్పుడు రెండిటి విలువలని కలపాలి. రెండు హల్లుల తరువాత అచ్చు వచ్చినప్పుడు హల్లుల విలువలని కలిపి అచ్చు విలువతో గుణించాలి.

కొన్ని ఉదాహరణలు –

గ = 3, న = 20, ఉ = 10,000. కనుక

గ్ను = (3 + 20) X 10,000 = 23,000

ఆ విధంగా ఒక్క అక్షరంతో అంత పెద్ద సంఖ్యని వ్యక్తం చెయ్యడానికి వీలయ్యింది.

మరో ఉదాహరణ,

ఖ్యుఘృ = (ఖ + య + ఉ + ఘ్ + ఋ) = (2 + 30)X10,000 + 4 X 100X100X100 = 4,320,000

రెండక్షరాల పదంతో ఏడు అంకెల సంఖ్యని వ్యక్తం చెయ్యడానికి వీలయ్యింది. ప్రాచీన భారత కాలమానం ప్రకారం ఈ సంఖ్య ఒక మహాయుగంలో మొత్తం సంవత్సరాల సంఖ్య.

ఈ రకమైన సంఖ్యా పద్ధతిని ఉపయోగించి ఆర్యభట్టు sin(x) ప్రమేయానికి పట్టికలు ఇచ్చాడు.



పదాలతో సైన్ పట్టిక -

Sin(x) ప్రమేయాన్ని జ్యామితి బద్ధంగా ఈ కింద చూపించిన లంబకోణం త్రిభుజంలో సూచించొచ్చు. త్రిభుజంలో లంబ కోణానికి ఎదురుగా ఉన్న భుజం (కర్ణం) విలువ 1 అనుకుంటే, x అనే కోణానికి ఎదురుగా ఉండే భుజం యొక్క పొడవే sin(x) విలువ.

లంబ కోణ త్రిబుజం పరంగా కాకుండా వృత్తం పరంగా కూడా sin(x) ని వ్యక్తం చెయ్యొచ్చు.

కింద కనిపిస్తున్న చిత్రంలో వృత్తం యొక్క చుట్టుకొలత లోని ఒక భాగాన్ని ‘చాపం’ (arc) అంటారు. చాపం యొక్క రెండు కొసలని కలిపే సరళ రేఖని ‘జ్యా’ (chord) అంటారు. ఈ జ్యాలో సగభాగానికి (half-chord) కి sin(x) ప్రమేయానికి సంబంధం వుంది. వృత్తం యొక్క వ్యాసార్థం (radius) 1 అనుకుంటే ‘అర్థ జ్యా’ విలువే sin(x) అవుతుంది. X పెరుగుతుంటే ఈ ‘అర్థ జ్యా’ విలువ క్రమంగ ఎలా పెరుగుతుందో ఆర్యభట్టు ఓ పట్టిక రూపంలో వ్యక్తం చేశాడు.



పొడవుని కొలవడానికి units (ఏకాంకాలు) కావాలు. మీటర్లో, సెంటీమీటర్లో వాడడానికి బదులుగా ఆర్యభట్టు కోణాలనే వాడాడు. అది ఇలా చేశాడు.

వృత్త కేంద్రం చుట్టూ మొత్తం కోణం 360 డిగ్రీలు అని మనకి తెలుసు.

1 degree = 60 minutes కనుక

360 degrees = 360 X 60 = 21600 minutes.

ఒక విధంగా ఇది వృత్తం యొక్క చుట్టుకొలత అనుకోవచ్చు. చుట్టుకొలతకి వ్యాసార్థానికి మధ్య సంబంధం ఇది,

R = circumference/2pi

కనుక

R = 21600/(2pi) = 3438 minutes (సుమారు)

అంటే x అనే కోణానికి సంబంధించిన ‘అర్థ-జ్యా’ విలువ = R sin(x)

0 నుండి 90 డిగ్రీల వరకు కోణాన్ని 24 భాగాలు చేస్తాడు ఆర్యభట్టు.

90/24 =3.75 degrees కనుక, ఆ కోణాలు వరుసగా 0, 3.75, 7.5, 11.25 … ఇలా ఉంటాయి.

వీటి sin() విలువలు వరుసగా sin(0), sin(3.75), ఇలా ఇవ్వకుండా, పక్కపక్కనే వచ్చే sin(x) విలువల మధ భేదాలని మాత్రమే ఇస్తాడు. ఉదాహరణకి

R*(Sin(3.75) – sin(0))

R*(Sin(7.5) – sin(3.75))

R*(sin(11.25) – sin(7.5))

ఆధునిక కాల్కులేటర్ ఉపయోగించి పై రాశులని గణిస్తే,

R*(Sin(3.75) – sin(0))=224.85

R*(Sin(7.5) – sin(3.75))=223.89

R*(sin(11.25) – sin(7.5))= 221.97

ఆర్యభట్టు ఇచ్చిన విలువలు పై ఆధునిక విలువలతో బాగా సరిపోతున్నాయి. అయితే ఈ విలువలని ఆర్యభట్టు పైన చెప్పుకున్నట్టుగా అక్షరాలతో వ్యక్తం చేసి ఓ పద్య రూపంలో ప్రదర్శించడం విశేషం.



కన్నడ లిపిలో రాయబడ్డ ఈ వ్రాతపత్రిలో పదాలు –

మఖి (=225), భఖి (=224), ఫఖి (222), ధఖి (219)– ణఖి –ఞఖి – ఙఖి – హస్ఝ – స్కకి – కిష్గ – శ్ఘకి – కిఘ్వ – ఘ్లకి - కిగ్ర – హక్య – ధకి – కిచ – స్గ – ఝశ – ణ్వ – క్ల – ప్ట – ఫ – ఫ - చ



పైన ‘మఖి’ విలువ 225, ఇందాక గణించిన R*(Sin(3.75) – sin(0))=224.85 తో చక్కగా సరిపోతోంది.

అలాగే ‘భఖి’ విలువ 224, R*(Sin(7.5) – sin(3.75))=223.89 తో సరిపోతోంది.



ఈ విధంగా ఆర్యభట్టు sin(x) ప్రమేయాన్ని ఓ పట్టిక రూపంలో ఇచ్చాడు. ఆ రోజుల్లో జ్ఞానాన్ని ముఖతః నేర్చుకుని కంఠస్థం చేసేవారు కనుక, అంకెలని ఇలా పదాలుగాను పద్యాలుగాను వ్యక్తం చేసుకునేవారు.

ఆర్యభట్టు కనిపెట్టిన క్రీ.శ. 499 నాటి ఈ సైన్ పట్టిక గణిత చరిత్రలోనే మొట్టమొదటి సైన్ పట్టిక అని గణిత శాస్త్ర చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు.



References:

1. R Narasimha, Sines in terse verse, Nature 414:851, 2001.

2. http://en.wikipedia.org/wiki/%C4%80ryabha%E1%B9%ADa's_sine_table












ఆర్కిమిడీస్ కనిపెట్టిన స్టోమకియాన్ (stomachion) అనే గణిత క్రీడ గురించి రెండు వ్రాతపత్రులు శిధిలావస్థలో దొరికాయి. వాటిలో ఒకటి అరబిక్ అనువాదం. పదవశతాబ్దానికి చెందిన రెండవ వ్రాతపత్రి గ్రీకులో రాయబడినది. ఇది 1899 లో కాస్టాంటినోపుల్ నగరంలో దొరికింది. అసలు ఆర్కిమిడీస్ ఈ ఆటని కనిపెట్టాడా లేక అందులోని జ్యామితి (geometry) సంబంధమైన అంశాలని గణితపరంగా విశ్లేషించాడా అన్న విషయం మీద స్పష్టత లేదు. ప్రాచీన రచనలలో మరి కొన్ని చోట్ల కూడా ఈ ఆట గురించిన ప్రస్తావన ఉంది. ఒక లాటిన్ కృతిలో దీని గురించి ‘లోక్యులస్ ఆర్కిమీడియస్’ (loculus Archimedius అంటే ఆర్కిమిడీస్ పెట్టె) అని ప్రస్తావించబడింది. στόμαχος (stomakos) అంటే గ్రీకులో ‘కడుపు’ (stomach) అని అర్థం. మరి ఈ ఆటకి స్టొమకియాన్ అని ఎందుకు పేరు పెట్టారో ఎవరికీ తెలీదు.

ఈ ఆటలో 14 చదునైన దంతపు ముక్కలు ఉంటాయి. ప్రతి ముక్క ఒక బహుభుజి (polygon) ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారాలని కూర్చి ఒక చదరాన్ని తయారు చెయ్యొచ్చు. అయితే ఇవే ఆకారాలని కొత్త కొత్త రకాలుగా కూర్చి సరదాగా వివిధ వస్తువుల రూపాలని తయారు చెయ్యాలి. కింద చిత్రంలో వీటిని కూర్చి ఓ ఏనుగు బొమ్మని తయారుచేసే పద్దతి కనిపిస్తోంది.







`

స్టొమకియాన్ ఆటలో ఆడే బహుభుజుల నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. 12 X 12 పరిమాణం ఉన్న చదరపు గడిని తీసుకోవాలి. గడిలో కనిపించే గీతల అంతరఖండన (intersection) బిందువులని ‘గడి బిందువులు’ (lattice points) అంటారు. గడిలో కనిపించే ప్రతి చిన్న చదరం యొక్క వైశాల్యం ఒక యూనిట్ అనుకుంటే, పెద్ద చదరం యొక్క వైశాల్యం 144 అవుతుంది. గడిలో గుర్తులు పెట్టబడ్డ ఎర్రని బిందువులని చిత్రంలో చూపించినట్టు కలపాలి. ఈ గీతల వల్ల గడి 14 ముక్కలుగా విభజింపబడుతుంది.










3 ముఖాలు గల బహుభుజులు (త్రిభుజాలు) =11
4 ముఖాలు గల బహుభుజులు (చతుర్భుజాలు) = 2
5 ముఖాలు గల బహుభుజులు (పంచభుజాలు) = 1









ప్రతి బహుభుజి యొక్క వైశాల్యం పూర్ణ సంఖ్య కావడం విశేషం. ఎందుకంటే ఇవి ప్రత్యేకమైన బహుభుజులు. చదరపు గడి మీద బిందువులని కలపగా ఏర్పడ్డవి. అలాంటి బహుభుజులని గడి బహుభుజులు (lattice polygons) అంటారు. గడి బహుభుజుల వైశాల్యాన్ని తెలిపే ఓ చక్కని సూత్రం ఉంది. దాని పేరు ‘పిక్ సిద్ధాంతం’ (Pick’s theorem). ఆ సిద్ధాంతం సహాయంతో స్టొమకియాన్ ఆటలోని బహుభుజుల వైశాల్యం పూర్ణ సంఖ్య ఎందుకు అయ్యిందో అర్థం అవుతుంది.


పిక్ సిద్ధాంతం
ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఆస్ట్రియాకి చెందిన జార్జ్ అలెగ్సాండర్ పిక్ (1859-1942).
ఈ సిద్ధాంతం ప్రకారం ఒక గడిబహుభుజి యొక్క వైశాల్యాన్ని తెలిపే సూత్రం ఈ విధంగా ఉంటుంది –
వైశాల్యం = A + B/2 – 1
A - ఇది బహుభుజి లోపలి భాగంలో ఉండే గడి బిందువుల సంఖ్య
B – ఇది బహుభుజి సరిహద్దు మీద ఉండే గడి బిందువుల సంఖ్య
ఉదాహరణకి కింద కనిపించే గడిబహుభుజిలో A = 31, B = 15, కనుక బహుభుజి వైశాల్యం
= 31 + 15/2 – 1 = 37.5 అవుతుంది.

ఇంత సంక్లిష్టమైన బహుభుజి యొక్క వైశాల్యానికి ఇంత సులభమైన సూత్రం ఉండడం ఆశ్చర్యం. ఇదే పిక్ సిద్ధాంతంలోని గొప్పదనం.
ఈ సూత్రంలో B సరి సంఖ్య అయితే వైశాల్యం ఎప్పుడూ పూర్ణ సంఖ్య అవుతుంది. స్టొమకియాన్ ఆటలో ప్రతీ బహుభుజికి సరిహద్దు మీద ఉండే గడి బిందువుల సంఖ్య సరి సంఖ్య అయ్యుండేలా జాగ్రత్తపడ్డాడు ఆ ఆట యొక్క సృష్టికర్త.

Reference:
http://www.math.nyu.edu/~crorres/Archimedes/Stomachion/intro.html


శ్రీనివాస రామానుజన్ ఇంగ్లండ్ లో ఉండే రోజుల్లో పి.సి. మహలనోబిస్ అనే మరో ప్రఖ్యాత భారతీయ గణితవేత్తతో పాటు కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు. మహలనోబిస్ కి ఒక రోజు స్ట్రాండ్ అనే ఇంగ్లీష్ పత్రికలో ఒక గణిత సమస్య కనిపించింది. వెంటనే తెచ్చి రామానుజన్ కి చదివి వినిపించాడు. ఆ సమయంలో రామానుజన్ వంటగదిలో కూరలు వేయిస్తున్నాడు. మహలనోబిస్ వర్ణించిన సమస్యని జాగ్రత్తగా విన్నాడు. రామానుజన్ కి అత్యంత జటిలమైన లెక్కలు కూడా మనసులోనే చెయ్యగలిగే అలవాటు ఉండేది. ఆ సమస్య ఇలా ఉంటుంది.

సమస్య – ఒక వీధిలో వరుసగా 1, 2, 3, … n, అని అంకెల గుర్తులు ఉన్న ఇళ్లు ఉన్నాయి. ఈ వరుసలో ఒక ప్రత్యేకమైన ఇల్లు వుంది. దాని స్థానం x. ఆ ఇంటికి కుడి పక్క ఉన్న ఇళ్ళ మీది అంకెల మొత్తం ఎంతో, ఎడమ పక్క ఉండే ఇళ్ళ మీది అంకెల మొత్తం కూడా అంతే. ఇప్పుడు n విలువ 50కి, 500 కి మధ్య ఉందని అనుకుంటే , n, x, ల విలువలు ఎంత?

ఆ సమస్యకి రామానుజన్ ఠక్కున సమాధానం చెప్పాడు. ఆ పరిష్కారంలో ఒక విశేషం వుంది. ‘అవిచ్ఛిన్న భిన్నాల’ని (continued fractions) ఉపయోగించి ఈ సమస్యని పరిష్కరించాడు. అంతే కాక, ఈ ఒక్క సమస్యనే కాక, ఈ వర్గానికి చెందిన మరెన్నో సమస్యలని కూడా అదే దెబ్బతో పరిష్కరించాడు. “అలా ఎలా చెయ్యగలిగావ?”ని అడిగాడు ఆ దెబ్బకి ఇంకా తేరుకోని మహలనోబిస్. “ఏం లేదు. సమస్యని వినగానే దాని పరిష్కారం ఒక అవిచ్ఛిన్న భిన్నమే అయ్యుంటుందని అనిపించింది. ఇంతకీ ఏంటా అవిచ్ఛిన్న భిన్నం అని ఓ సారి ప్రశ్నించుకున్నాను. వెంటనే సమాధానం మనసులో స్ఫురించింది,” అని బదులు చెప్పాడు రామానుజన్.
పైన చెప్పుకున్న సమస్యకి పరిష్కారాన్ని ఇలా ప్రారంభించొచ్చు. x వ స్థానంలో ఉన్న ఇంటికి ఒక పక్క ఉన్న ఇళ్ళ అంకెల మొత్తం ఇలా వ్యక్తం చెయ్యొచ్చు.
1 + 2 + 3 … (x-1) = x(x-1)/2
(ఇక్కడ, 1 + 2 + …+m = m(m+1)/2 అన్న సూత్రాన్ని ఉపయోగిస్తున్నాం.)
అలాగే x వ స్థానంలో ఉన్న ఇంటికి అవతలి పక్క ఉన్న ఇళ్ళ అంకెల మొత్తం ఇలా వ్యక్తం చెయ్యొచ్చు.
(x+1) + (x+2) + (x+3)+ … +n = n(n+1)/2 – (x)(x+1)/2
కనుక,
x(x-1)/2 = n(n+1)/2 – (x)(x+1)/2
పైన సమీకరణంలోని పదాలకి కాస్త అటు ఇటు చేస్తే,
(2n + 1)2 – 2 (2x) 2 = 1
దీన్ని మరింత సామాన్య రూపంలో ఇలా రాసుకోవచ్చు,
u^2 – 2v^2 = 1
దీన్ని బ్రహ్మగుప్త-భాస్కర సమీకరణం అంటారు. దీన్నే ‘పెల్’ (Pell) సమీకరణం అని కూడా అంటారు.
ఈ సమీకరణానికి ఒక ప్రత్యేకత ఉంది. దీని పరిష్కారం తెలిస్తే, సమీకరణాన్ని ఇలా రాసుకోవచ్చు.
(u^2 –1)/v^2 = 2,
లేదా
కనుక u, v విలువలు తెలిస్తే విలువని ఉజ్జాయింపుగా, ఒక భిన్నం రూపంలో, వ్యక్తం చెయ్యడానికి వీలుంటుంది. ఈ సమీకరణానికి మరింత సార్వత్రిక రూపం వుంది. అది,
u^2 – N v^2 = 1
దీనికి పరిష్కారం తెలిస్తే,
ని కూడా భిన్నంగా, ఉజ్జాయింపుగా వ్యక్తం చెయ్యడానికి వీలవుతుంది.
ఈ సమీకరణం గురించి ప్రాచీన భారత గణితవేత్తలకి బాగా తెలుసు.
ఉదాహరణకి ఈ సమీకరణానికి పరిష్కారాలు u = 17, v = 12, మరియు u = 577, v = 408 అని బౌధాయనుడికి తెలుసు. ఈ బౌధాయనుడు క్రీ.పూ. 800 ప్రాంతాల్లో జీవించాడు. ఇతడు ‘బౌధాయన సుల్బసూత్రాలు’ అనే గణిత గ్రంథానికి రచయిత.
ఇదే సమస్యని బ్రహ్మగుప్తుడు అసంఖ్యాకమైన సాధనలు వచ్చేట్టుగా పరిష్కరించాడు.
అందుకోసం ముందుగా ఒక ‘అభిన్నం’ ని (identity) నిరూపించాడు. బ్రహ్మగుప్తుడి అభిన్నంగా పిలవబడే ఈ అభిన్నం ఇలా ఉంటుంది.
(a^2 + n b^2) (c^2 + n d^2) = (ac – nbd)^2 + n (ad + bc)^2
పై అభిన్నాన్ని నిరూపించడం అంత కష్టం కాదు. కాని ఈ అభిన్నానికి మరో రూపాంతరాన్ని కుడా ఇస్తాడు బ్రహ్మగుప్తుడు.
(x1^2 – N y1^2)( x2^2 – N y2^2) = (x1* x2 – N* y1* y2)^2 – N (x1*y2 + x2*y1)^2

దీన్ని వాడుకుని ఇందాక చెప్పుకున్న బ్రహ్మగుప్త-భాస్కర-పెల్ సమీకరణాన్ని పరిష్కరించడం అద్భుతంగా ఉంటుంది.
దీన్ని బట్టి (x1,y1), (x2,y2) అనేవి u2 – Nv2 = 1 కి సాధనలు అయితే, ((x1* x2 – N* y1* y2), (x1*y2 + x2*y1)) లు కూడా సాధనలు అవుతాయని తేలుతుంది. ఈ సూత్రాన్ని మళ్లీ మళ్లీ వాడుకుంటే బ్రహ్మగుప్త-భాస్కర-పెల్ సమీకరణానికి అసంఖ్యాకమైన సాధనలు లెక్కించొచ్చు.

మొదట చెప్పుకున్న సమస్య గురించి విన్నాడో లేదో రామానుజన్ కి దాని పరిష్కారం మనసులో స్ఫురించింది. బ్రహ్మగుప్తుడు సాధించిన పద్ధతిలో కాక, వేరే విధంగా, అవిచ్ఛిన్న భిన్నాలని (continued fractions) ఉపయోగించి సమస్యని గొప్ప చాతుర్యంతో పరిష్కరించాడు. అవిచ్ఛిన్న భిన్నం అంటే అనంతంగా సాగే భిన్నం. ఉదాహరణకి,





sqrt(2) కి అవిచ్ఛిన్న భిన్నం ఇలా ఉంటుందని ఊహించాడు రామానుజన్,

sqrt(2) = 1 + 1/(2+1/(2+1/(2+1/...



ఇలాంటి భిన్నాన్ని అనంతం వరకు లెక్కించడం అసంభవం కనుక దాన్ని ఏదో ఒక స్థాయిలో తెగ్గోస్తారు. అలా తెగ్గోయగా వచ్చిన విలువని convergent అంటారు. స్థాయి పెంచుకుంటూ పోతే వరుసగా ఎన్నో convergent లు వస్తాయి. ఉదాహరణకి,
మొదటి convergent, = 1/1
రెండవ convergent = 1 + 1/2 = 3/2
మూడవ convergent, = 1+ 1/(2 + 1/2) = 7/5

నాలుగవ convergent, = 1+ 1/(2+1/(2+1/2)) = 17/12


పైన ఇవ్వబడ్డ convergent లు అన్నీ భిన్నాల రూపంలో ఉన్నాయి. అవే బ్రహ్మగుప్త-భాస్కర-పెల్ సమీకరణానికి పరిష్కారాలు అవుతాయని రామానుజన్ గుర్తించాడు!
ఉదాహరణకి (1,1) (3,2), (7,5), (17,12) మొదలైనవి,
u^2 – 2v^2 = 1
u^2 – 2v^2 = -1
అనే రెండు సమీకరణాలని మారి మారి తృప్తిపరుస్తాయి!
బ్రహ్మగుప్తుడి పద్ధతి లాగానే ఈ విధంగా కూడా బ్రహ్మగుప్త-భాస్కర-పెల్ సమీకరణానికి అసంఖ్యాకమైన సాధనలు లెక్కించొచ్చు.






R. Ramanujam, The man who was loved by formulas, Jantar Mantar, Nov-Dec, 2011.

'నిచ్చెన మీద పిల్లి' సమస్య

Posted by V Srinivasa Chakravarthy Monday, February 6, 2012 0 comments






సోవియెట్ ప్రచురణ సంస్థ మీర్ పబ్లిషర్స్ మన దేశంలో విజ్ఞాన ప్రచారంలో ఎంతో సేవ చేశాయి. ఆ పుస్తకాలు ప్రస్తుతం మనకి, ముఖ్యంగా ప్రస్తుత యువ తరానికి లభ్యం కాకపోవడం విచారకరం.
మీర్ పబ్లిషర్స్ యొక్క గణిత ప్రచురణల్లో నేను చిన్నప్పుడు చదువువున్న పుస్తకం, బాగా గుర్తుండిపోయిన పుస్తకం ఒకటుంది. దాని పేరు “Lines and curves: A practical Geometry Handbook.” సరళ రేఖల గురించి, రకరకాల వక్రాల గురించి ఆసక్తికరమైన కథలతో, అందమైన బొమ్మలతో ఆ పుస్తకం లెక్కల పుస్తకంలా కాక, ఓ fairy tale లా ఉంటుంది. అది చదివితే ఎవరైన geometry అంటే పీకల్దాకా ప్రేమలో పడతారు.

ఓ పుస్తకంలో ఇవ్వబడ్డ అలాంటి ఓ చిన్న లెక్కల ‘కథ.’

ఓ నిచ్చెన మీద ఓ పిల్లి ప్రశాంతంగా కూర్చుందట పాపం. ఇంతలో మరి – ఆ పిల్లి ఏం చేసిందో ఏమో గాని – గోడకి ఆన్చిన నిచ్చెన నెమ్మదిగా జారడం మొదలెట్టింది. పిల్లి నిచ్చెనకి సరిగ్గా మధ్యన కూర్చుని వుంది. అలా పడుతున్న పిల్లి యొక్క చలన రేఖ ఎలా ఉంటుంది? (పడిపోతున్న పిల్లికూనని ఠక్కున గంతేసి ఆదుకోక దాని మీద లెక్కలు అల్లడం ఏంటండీ? ఈ గణితవేత్తలకి గుండె లేదు!)

నిచ్చెన గోడని తాకిన బిందువు A అని, నేలని తాకిన బిందువు B అని అనుకుందాం. నిచ్చెన పొడవు d అనుకుందాం. పిల్లి ఉన్న బిందువు P అనుకుందాం. ఈ సమస్యని రకరకాలుగా పరిష్కరించొచ్చు.

A వద్ద అడ్డుగాను, B వద్ద నిలువుగాను గీతలు గీసి OACB అనే దీర్ఘచతురస్రాన్ని ఏర్పాటు చెయ్యాలి. దీని కర్ణాలు (diagonals) రెండూ ఒక దాన్నొకటి మధ్యగా ఛేదించుకుంటాయి కనుక OP=PC=AP=PB అవుతుంది. P నిచ్చెనలో మధ్య బిందువు కనుక AP=PB=d/2 =OP అవుతుంది. అంటే పిల్లి ఎక్కడ ఉన్నా OP విలువ ఎప్పుడూ d/2 అవుతుంది అన్నమాట. అంటే పిల్లి వృత్తాకరపు రేఖలో కింద పడుతుంది.
ఇపుడు ఇదే సమస్యని పిల్లి దృష్టి నుండి చూస్తూ (మరి దాని ఫీలింగ్స్ ని కూడా కాస్త పట్టించుకోవాలిగా మరి!) పరిష్కరిద్దాం. పిల్లి దృష్టి నుండి చూస్తే నిచ్చెన కదలకుండా స్థిరంగా ఉంటుంది. గోడ, నేల కదులుతుంటాయి! ఆ కదలికని కింద బొమ్మలో చూడొచ్చు.

గోడ, నేల ఎప్పుడూ ఒక దానికొకటి లంబంగా ఉంటాయి. పిల్లి దృష్టిలో గోడ నేల కలిసే బిందువు (O) కదులుతుంటుంది (O1, O2 …). O ఎక్కడ ఉన్నా /AOB = 90 డిగ్రీలే అవుతుంది. కనుక AB రేఖ వ్యాసంగా గల ఓ వృత్తం మీద O ఒక బిందువు అవుతుంది. అంటే OP = AB/2 = d/2, అవుతుంది. మళ్లీ P అనే బిందువు O నుండి d/2 దూరంలో కదులుతోందని తేలింది.

ఇదే సమస్యని త్రికోణమితి (trigonometry) ఉపయోగించి కూడా చాలా సులభంగా చెయ్యొచ్చు. త్రికోణమితి పద్ధతిలో చేస్తే దీనికి సంబంధించిన మరింత జటిలమైన మరో సమస్యని కూడా పరిష్కరించొచ్చు.
ఈ కింది బొమ్మలో చూపించినట్టు, కోణం /ABO విలువ h అనుకుందాం.
అప్పుడు
x= d/2 cos(h); y = d/2 sin(h)
అని సులభంగా తెలుస్తుంది.
రెంటిట్నీ కలిపితే,
x^2 + y^2 = (d/2)^ 2
అని తెలుస్తుంది. ఇది వృత్తాన్ని వర్ణించే సమీకరణం అని మనకి తెలుసు.

ఇప్పుడు మరి కాస్త జటిలమైన ప్రశ్న. పిల్లి నిచ్చెనకి మధ్యలో కాకుండా ఒక పక్కకి ఉంటే దాని చలన రేఖ ఎలా ఉంటుంది. ఈ సారి కూడా వృత్తాకరంలోనే ఉంటుందా?
ఈ సమస్యని త్రికోణమితితో అయితే చాలా సులభంగా పరిష్కరించొచ్చు.
కింది బొమ్మలో AP = a, BP = b, అనుకుందాం. (a,b లు సమానం కావు గాని a+b=d అని తెలుసు).
ఈ సారి P యొక్క నిరూపకాలు,
X = a cos(h), y = b sin(h) అవుతుంది కనుక,
(x/a)^2 + (y/b) ^2 = 1
అని తెలుస్తుంది. ఇది ఓ దీర్ఘ వృత్తాన్ని (ellipse) వర్ణించే సమీకరణం.
ఈ సూత్రాన్ని ఉపయోగించి లియొనార్డో డా వించీ దీర్ఘవృత్తాలని గీయడానికి ఓ చక్కని పరికరాన్నికనిపెట్టాడు. దాన్ని ఈ కొంది బొమ్మలో చూడొచ్చు.

పిల్లి కూన పడిందన్న మాటేగాని పడుతూ పడుతూ ఎన్ని పాఠాలు నేర్పింది!

Reference:
Victor Gutenmacher, NB Vasilyev, Lines and Curves, Mir Publishers.

కాల్యులస్ ని కనిపెట్టింది న్యూటన్ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. అయితే ఇంచుమించు అదే కాలంలో న్యూటన్ సమకాలీనుడు అయిన లీబ్నిజ్ కూడా కాల్యులస్ ని కనిపెట్టాడని, ఇద్దరిలో మొదట కనిపెట్టిన ఘనత ఎవరికి దక్కాలన్న విషయం మీద ఇద్దరికీ మధ్య చాలా వివాదం చెలరేగిందని గణిత చరిత్ర బట్టి మనకి తెలుస్తుంది.

అయితే ఆ ఇద్దరికీ ఆ అవకాశం ఇవ్వకుండా ఆ ఘనత అంతా వారిద్దరికన్నా ఇంచుమించు రెండు వందల ఏళ్ల ముందు పుట్టిన మాధవుడు అనే కేరళకి చెందిన గణిత వేత్తకి చెందుతుందన్న విషయానికి గత ఒకటి రెండు దశాబ్దాలుగా ప్రాచుర్యం పెరిగింది.

కేరళలో కొచ్చిన్ కి సమీపంలో ఉండే సంగమగ్రామం (దీన్ని ప్రస్తుతం ‘ఇరింజలకుడా’ అంటారు) అనే ఊళ్ళో, సాంప్రదాయబద్దమైన నంబూదిరి బ్రాహ్మణ కుటుంబంలో, పుట్టాడు మాధవుడు. అతడు పుట్టింది 1345 లో కావచ్చని, మరణించినది 1425 కావచ్చని చారిత్రకులు నమ్ముతున్నారు.

పదహారవ శతాబ్దం వరకు కూడా ఓ వెలుగు వెలిగిన కేరళకి చెందిన గణిత, ఖగోళవిజ్ఞాన సాంప్రదాయానికి ఇతడే మూలకర్త అని చెప్పుకుంటారు. ఇతడి శిష్యులలో ఎంతో మంది గొప్ప గణితవేత్తలుగా పేరు పొందారు. వారిలో నీలకంఠుడు, జ్యేష్ఠదేవుడు ముఖ్యులు. జ్యేష్ఠదేవుడు వ్రాసిన ‘యుక్తిభాష’ అన్న పుస్తకంలో మాధవుడు రూపొందించిన కాల్కులస్ సిద్ధాంతం విపులంగా వర్ణించబడింది.
కాల్కులస్ లో ‘పరిమితి’ (limit) అన్న భావన చాలా కీలకమైనది. అసంఖ్యాకమైన క్రియలకి లోనైన ఒక రాశి ఒక పరిమితిని సమీపించడం కాల్కులస్ లో ఓ విశేషం. అందుకు నిదర్శనంగా మాధవుడు ఎన్నో శ్రేణులని కనిపెట్టాడు.

ఉదాహరణకి sin(x) కి అతడు కనిపెట్టిన శ్రేణి ఈ విధంగా ఉంటుంది.
Sin(x) = x – x^3/3! + x^5/5! –
దీన్ని మొట్టమొదట కనిపెట్టింది న్యూటన్ అని భావించడం వల్ల దీన్ని ఎంతో కాలం ‘న్యూటన్’ శ్రేణి అని పిలవడం జరిగింది. కాని మాధవుడి గణిత ఆవిష్కరణల గురించి తెలిశాక దీన్ని ‘మాధవ-న్యూటన్ శ్రేణి’ అని పిలవడం మొదలెట్టారు.

అలాగే arctan(x) కి ఈ విధమైన శ్రేణిని కనిపెట్టిన ఘనత జేమ్స్ గ్రెగరీ (1638-1675) అనే గణితవేత్తకి చెందినట్టు మామూలుగా చెప్పుకుంటారు. కాని ప్రస్తుతం దీన్ని ‘మాధవ-గ్రెగరీ శ్రేణి’ అంటున్నారు.
Arctan(x) = x – x^3/3 + x^5/5 – x^7/7 …

పై సూత్రంలో x=1, అని ప్రతిక్షేపిస్తే, (pi/4) = arctan(1) కనుక, pi కి ఓ చక్కని సూత్రం బయటపడుతుంది.
Pi/4 = 1 - 1/3 + 1/5 – 1/7 + …

ఎన్నో చక్కని గణితసూత్రాలని కనిపెట్టిన ఘనుడిగా ఈ సూత్రాన్ని కనిపెట్టిన ఘనత కూడా ఆయిలర్ (Euler) కే దక్కింది. కాని దీన్ని ప్రస్తుతం ‘మాధవ-ఆయిలర్ సూత్రం’ అంటున్నారు.

మాధవుడి శిష్యులలో ఒకడైన పరమేశ్వరుడు కాల్కులస్ కి చెందిన mean value theorem ని కనిపెట్టాడు. ప్రస్తుత గణితంలో ఈ సిద్ధాంతాన్ని కోషీ (Cauchy) కనిపెట్టినట్టు చెప్పుకుంటారు.

ఈ ఆవిష్కరణల దృష్ట్యా సాంప్రదాయక (వాస్తవ సంఖ్యల) గణితవిశ్లేషణకి మూలకర్త మాధవుడే నని తేల్చవలసి ఉంటుంది. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ జి. జోసెఫ్ అనే రచయిత ఇలా అంటున్నాడు – “సంగమగ్రామానికి చెందిన మాధవుడే గణితవిశ్లేషణకి (classical mathematical analysis) మూలకర్త అని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో ఆయన ఆవిష్కరణలని గమనిస్తే అతడు అసాధారణమైన లోదృష్టి గల మేధావి అనిపిస్తోంది.”

మాధవుడి గొప్పదనాన్ని గురించి మొట్టమొదటి ప్రస్తావన 1835 లో Transactions of Royal Asiatic Societyలో చార్లెస్ విష్ రాసిన ఓ పత్రంలో కనిపిస్తుంది. కాని ఆ సమయంలో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

మాధవుడి ఆవిష్కరణల విషయంలో గణితవేత్తలు చూపించిన నిర్లక్ష్యానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
మాధవుడి సిద్ధాంతాలు శుద్ధ గణిత రచనలలో కాక జ్యోతిష శాస్త్రానికి చెందిన రచనలలో ఖగోళ విషయాలకి సంబంధించిన గణనాలలో నిక్షిప్తమై వున్నాయి. కనుక శుద్ధ గణిత వేత్తలకి అవి సులభంగా కొరుకుడు పడలేదు. అంతే కాక మాధవుడి రచనలు మలయాళంలో ఉన్నాయి. కనుక అంతర్జాతీయ గణిత సమాజానికి అవి అందుబాటులో లేకపోయాయి. 1970 లకి ముందు సరైన అనువాదాలు కూడా ఉండేవి కావు. 1960 లలో ఆర్.సి. గుప్తా, సిటి రాజగోపాల్, ఎమ్. ఎస్. గోపాలాచారి మొదలైన భారతీయ గణితవేత్తలు మాధవుడి విజయాల గురించి లోకానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే వారి పత్రాలు భారతీయ పత్రికలలో మాత్రమే అచ్చవడంతో వాటికి కూడా తగిన ప్రాచుర్యం లభించలేదు.

నెమ్మది మీద అయినా నిజం చివరికి బయటపడింది. కాల్కులస్ లాంటి ముఖ్యమైన గణిత రంగాన్ని మొదట కనుక్కున్న ఘనత ఒక భారతీయుడికి దక్కడం మనకెంతో గర్వకారణం.


వ్యాస మూలం -
http://www.scribd.com/doc/11509608/Madhava-The-Founder-of-Math-Analysis-Calculus-

మరింత సమాచారం కోసం –
G Joseph, The Crest of the Peacock, Princeton Univ Press. 1991.
Victor J Katz, A history of mathematics, Addison_Wesley, 1992.

ప్రయాణించే సేల్స్‌మాన్ సమస్య

Posted by V Srinivasa Chakravarthy Wednesday, August 17, 2011 1 comments


ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం http://www.andhrabhoomi.net/intelligent/prayaniche-296


పార్వతమ్మగారి అమ్మాయి పెళ్లి పిలుపుల సమస్య

పార్వతమ్మకి ఓ పెద్ద ఇక్కట్టు నెత్తిన పడింది. టీ.సీ.యస్. లో పని చేస్తున్న వాళ్ళ అమ్మాయి రేఖకి పెళ్లి కుదిరింది. రెండు రోజుల్లో పెళ్ళి, మూడో రోజు రిసెప్షన్. కనుక ఈ రోజు పెళ్లి పిలుపులు, రేపు షాపింగ్! భర్త పరంధామయ్య యూనివర్సిటీలో ఫిలాసఫీ  ప్రొఫెసరు. ఇంట్లో ఏం జరుగుతోందో ఏమీ పట్టించుకోడు. అన్నీ ఈవిడే నెత్తిన వేసుకుని చెయ్యాలి. ఒక్క రోజులో ఇంచుమించు యాభై మంది ఇళ్ళకి వెళ్లి శుభలేఖలు పంచాలి. అంతా ఒక్క చోట ఉంటే బావుణ్ణు.  షంసా బాద్ నుండి  ఆల్వాల్ దాకా,  కుక్కట్ పల్లి నుండి  ఉప్పల్ దాకా కుప్పలుతెప్పలుగా ఉన్నారు బంధువులు. ముందు మెహదీపట్నం తో మొదలు పెట్టి, జూబిలీ హిల్స్  మీదుగా సనత్ నగర్ కి వెళ్లి, అక్కణ్ణుంచి  బాలానగర్ కి వెళ్లడమా? లేక ముందు బహదూర్ గుడా కి వెళ్లి, దార్లో లక్ష్మీ గూడాకి కూడా  వెళ్లి, షంసాబాద్ కి వెళ్లడమా? ఏది మేలైన పద్ధతి? ఈ ఇళ్ళన్నీ చుట్టి సాయంకాలానికి ఇంటికి చేరాలంటే అతి దగ్గరి దారి ఏంటి? ఆలోచిస్తుంటే తల వేడెక్కిపోతోంది. “నా వల్ల కాదు రేఖా! మీ నాన్నగారేమో ఏవీ పట్టించుకోరు. నీ పెళ్లిపిలుపులేవో నువ్వే చూసుకో” అంటూ కూతురికి ఫోన్ చేసి చెప్పేసింది. కాని రేఖకి ఆ రోజు లీవ్ దొరకలేదు. ఎలాగోలా ఓపిక చేసుకుని ఆ పని అమ్మే చెయ్యాలి. తల్లితో ప్రాధేయపడుతున్నట్టుగా అంది. “అయ్యో అమ్మా! ఈ సమస్య నాకు వదిలేయ్. నువ్వు చెప్తున్నది సామాన్యమైన సమస్య కాదు. అదో ముఖ్యమైన గణిత సమస్య. కంప్యూటర్ సైన్స్ సమస్య. ఒక్క అరగంట టైమివ్వు. ఏం చెయ్యాలో చెప్తాను,” అంటూ గూగుల్ మ్యాప్ ల నుండి ఏవేవో కొలతలు తీసుకుని, ఆ సమాచారం అంతా ఏదో సాఫ్ట్ వేర్ లోకి ఫీడ్ చేసి అరగంటలో పరిష్కారం కనుక్కుని తల్లికి  ఫోన్ చేసి చెప్పింది. ఆమె చెప్పిన క్రమంలోనే బంధుమిత్రుల ఇళ్ళన్నీ సందర్శించి సాయంత్రంలోపు పని పూర్తి చేసింది పార్వతమ్మ.

పార్వతమ్మ ఎదుర్కున్న సమస్య సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ లో ముఖ్యమైన సమస్య. దీన్నే ట్రావెలింగ్ సేల్స్ మాన్ ప్రాబ్లమ్ (ప్రయాణించే సేల్స్ మాన్ సమస్య) అంటారు. ఇందులో ఓ సేల్స్ మన్ కొన్ని ఊళ్లు చుట్టి రావాలి. ఒకే ఊరికి రెండు సార్లు వెళ్ళకూడదు. అన్ని ఊళ్లూ తిరగాలి. మొత్తం చుట్టి రావడానికి పట్టే ఖర్చు కనీసమాత్రంగా ఉండాలి. ఈ సమస్య కనిపించినంత సులభం కాదు. ముఖ్యంగా ఊళ్ల సంఖ్య పెరుగుతుంటే సమస్య మరింత జటిలం అవుతుంది. ఎందుకంటే ఈ సమస్యని పరిష్కరించాలంటే ఎన్నో మార్గాలని పరిశీలించాలి. ప్రతీ మార్గానికి పట్టే ఖర్చు అంచనా వెయ్యాలి. ఊళ్ళ సంఖ్య పెరుగుతుంటే మార్గాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
 
ఉదాహరణకి 5 ఊళ్లు ఉన్నాయనుకుందాం. ఐదింట్లో ఏదో ఒక దాని నుండి బయలుదేరొచ్చు. అక్కణ్నుంచి మిగతా 4 ఊళ్లలో ఏదో ఒక దాన్ని సందర్శించొచ్చు. ఆ 4 ఊళ్లలో ఒక్కొక్క దాని నుండి మూడేసి ఊళ్లు సందర్శించొచ్చు. అలా లెక్క  వేస్తూ పోతే మొత్తం 5 X 4 X 3 X 2 X 1 = 120  మార్గాలని, అంటే మార్గాంతరాలని పరిగణించాల్సి ఉంటుంది. ఇంకా సామాన్యంగా n ఊళ్లు ఉన్న సమస్యలో మొత్తం n! మార్గాంతరాలు ఉంటాయి. n విలువ పెరుగుతుంటే ఈ n! విలువ చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇక పార్వతమ్మ గారి సమస్యలో యాభై ఇళ్ళు ఉన్నాయి కనుక 50! విలువ రమారమి 3X 1064 అవుతుంది. ఒక్కొక్క మార్గాంతరాన్ని పరిశీలించడానికి సెకనులో వెయ్యోవంతు కాలం పట్టినా మొత్తం అన్ని మార్గాంతరాలని పరిశీలించడానికి, మన ఆయుర్దాయం మాట అటుంచితే, ఈ విశ్వం ఆయుర్దాయమే సరిపోకపోవచ్చు.

ఈ ట్రావెలింగ్ సేల్స్ మన్ సమస్యని మొట్టమొదట నిర్వచించినవాడు ఐర్లాండ్ కి చెందిన హామిల్టన్ అనే గొప్ప గణితవేత్త. ఇరవయ్యవ శాతాబ్దపు మొదటి దశల్లో కార్ల్ మెంగర్ అనే గణితవేత్త దీన్ని పరిశీలించాడు. ఉన్న ఊరి నుండి కేవలం అతి దగ్గరి ఊరికి ప్రయాణిస్తూ పోయినంత మాత్రాన కనిష్ఠ మార్గం దొరుకుతుందని భరోసా లేదని ఇతడు నిరూపించాడు. 1950, 1960 లలో డాంట్ జిగ్, ఫుల్కర్సన్, జాన్సన్ వంటి వారు దీన్ని పరిశీలించి, ‘లీనియర్ ప్రోగ్రామింగ్’ అనే రంగంలో దీనినొక ప్రత్యేక సమస్యగా గుర్తించి, 49 ఊళ్ళున్న ఓ ప్రత్యేక సమస్యని కచ్చితంగా పరిష్కరించారు. తదనంతరం 1972 లో రిచర్డ్ కార్ప్ అనే గణితవేత్త ఈ సమస్యని ‘ఎన్.పి-కంప్లీట్’ అనే కోవకి చెందిన అతి కఠినమైన సమస్యల్లో ఒకటిగా గుర్తించాడు. దాంతో ఈ సమస్య ఎందుకంత కఠినమైనదో అర్థమయ్యింది.
ఈ ప్రయాణించే సేల్స్ మన్ సమస్య అతి కఠినమైనదే అయినా, కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీన్ని కచ్చితంగా పరిష్కరించడానికి వీలయ్యింది. పైగా సూపర్  కంప్యూటర్ల వినియోగం పెరిగాక పెద్ద సంఖ్యలో ఊళ్లున్న సమస్యల్ని కూడా ఛేదించడానికి వీలయ్యింది.  1970, 1980 లలో గ్రోట్షెల్, పాడ్బర్గ్ తదితరులు 2,392 ఊళ్ళున్న సమస్యని పరిష్కరించారు. 2005 లో కుక్ అనే గణితవేత్త 33,810 ఊళ్లున్న సమస్యని పరిష్కరించాడు. ఆ పరిష్కారాన్ని గణించడానికి 15.7 సంవత్సరాల సీ.పీ.యు. సమయం అవసరమయ్యింది! 

ప్రయాణించే సేల్స్ మన్ సమస్య కేవలం ఒక ప్రత్యేక సమస్య కాదు. ఒక ప్రత్యేక కోవకి చెందిన సమస్యలకి అదొక చిహ్నం మాత్రమే. కనుక ఈ ప్రత్యేక సమస్యని పరిష్కరిస్తే, ఆ కోవకి చెందిన సమస్యలన్నీ పరిష్కరించినట్టే. కాల్ టాక్సీల  కార్యక్రమాలకి ఈ ప్రయాణించే సేల్స్ మన్ సమస్యతో సంబంధం ఉంది. వి.ఎల్. ఎస్. ఐ. చిప్ ల డిజైన్ లో కూడా ఈ పరిష్కారం ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లలోను, కంప్యూటర్ నెట్వర్క్ లలో కూడా దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క గణిత సమస్య యొక్క పరిష్కారానికి దైనిక జీవితంలో ఎన్నో ఉపయోగాలు ఉండొచ్చునని చెప్పడానికి ఈ ప్రయాణించే సేల్స్ మన్ సమస్య ఓ చక్కని తార్కాణం.

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts