తీరని చీలికలతో సంక్షుభితంగా ఉండే 0 వ రకం నాగరికతలో, ఆ చీలికలు నెమ్మదిగా చెరిగిపోతూ వివిధ జాతుల మధ్య సహకారం, సహవర్తనం వృద్ధి చెందుతున్నదంటే, ఆ నాగరికత మెల్లగా 1 వ రకం నాగరికత దిశగా వికాసం చెందుతోందన్నమాట. అయితే అలాంటి పరిణామం జీవన కాంక్ష గల ఏ నాగరికతలోనైనా ఏదో ఒక దశలో రావలసిందే. ఎందుకంటే వైవిధ్యం జీవన సహజం అయినా, తీరని విభేదం, తెగని విభజన జీవన వృద్ధికి వ్యతిరేకం. విభజన వల్ల వచ్చే దుష్పరిణామాలకి తట్టుకోలేక, వాటికి విరుగుడుగా మానవ జాతి ఏదో విధంగా సమైక్యం కావడానికి ప్రయత్నిస్తుంది. ఒక విధమైన వ్యావహారిక సామరస్యం కోసమైనా విశ్వ ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమైక్యతని, సహవర్తనాన్ని పెంచే పలు విధానాలని రూపొందిస్తుంది.
ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితి ఇందుకు ఓ చక్కని ఉదాహరణం. ఈ విధంగా అంతర్జాతీయ సదస్సులతో ఆగిపోకుండా, రాజ్యాలు కలిసి బహుళ రాజ్య కూటములుగా ఏర్పడడం ఈ ఒరవడిలో తదుపరి మెట్టు. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ యూరొపియన్ యూనియన్ అలాంటి పరిణామానికి ఉదాహరణ. ఈ ఒరవడి ఇలాగే సాగితే బహుశ ఒకటి రెండు శతాబ్దాల తరువాత నిజంగా ఓ దరావ్యాప్తమైన మానవ మహాసామ్రాజ్యం ఏర్పడుతుందని ఆశించవచ్చు. 1 వ రకం నాగరికత యొక్క ఆవిర్భావానికి ఇది ప్రథమ సంకేతం.
ఆ విధంగా ఒకటవ రకం నాగరికత దిశగా పరిణమిస్తున్న నాగరికతలో రాజకీయ వ్యవస్థ అంతకంతకు ఏకీకృతం అవుతుంటే, సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలో కూడా మౌలికమైన మార్పులు వస్తాయి. మరో శతాబ్ద కాలంలో ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనిషి సాధించబోయే విజయాల ముందు మన వర్తమాన ఫలితాలు అత్యల్పంగా అనిపిస్తాయి. ప్రస్తుత ప్రపంచంలో దుర్భర పేదరికంలో కటకట పడుతున్న ప్రాంతాలు ఆ దశలో పారిశ్రామిక అభివృద్ధి చేత సుసంపన్నం కావచ్చు. ధరావ్యాప్తమైన సామ్రాజ్యం అంటే ఇక వివిధ దేశాలు, సంస్కృతులు ఉండవని కాదు. దేశాలు, రాష్ట్రాలు, మొదలైన విభాగాలన్నీ ఎప్పట్లాగే ఉన్నా అన్నీ పృథ్వీ వ్యాప్తమైన ఒక రాజకీయ, ఆర్థిక, న్యాయ వ్యవస్థకి ఒడంబడి ఉంటాయి.
1 వ రకం నాగరికత ఆహారోత్పత్తిలో, భూగర్భం నుండి, సముద్ర గర్భం నుండి ఖనిజాల వెలికితీతలో, జలనిధుల వినియోగంలో, శక్తి ఉత్పాదకతలో, గతంలో మానవత చేరని గొప్ప ఎత్తులని చేరుకుంటుంది. అది సాధ్యం కావడానికి ఓ ముఖ్య కారణం పృథ్వీ వ్యాప్తంగా నెలకొన్ని రాజకీయ స్థిరత్వమే. ఆ స్థిరత్వాన్ని ఆసరాగా చేసుకుని వాతావరణాన్ని కూడా అనువుగా నియంత్రించడానికి సాధ్యమవుతుంది. ఉదాహరణకి ఒక దేశం అధికంగా హరితగృహ వాయువులని, ఒజోన్ పొరకి హానికరమైన వాయువులని వెలువరించడం వల్ల వాతావరణంలో వచ్చే దుష్పరిమాణాలు ఇతర దేశాల మీద కూడా కనిపిస్తాయి. కాని అన్ని దేశాలు ఒక సామాన్య రాజకీయ వ్యవస్థకి, నియమావళికి కట్టుబడి ఉన్నప్పుడు అలాంటి విశృంఖలత్వాన్ని నివారించడానికి వీలవుతుంది.
మనిషికి ప్రకృతి భవిష్యత్తులో ప్రసాదించబోయే అమూల్య నిధులకి వెలగా, ప్రకృతి మానవాళిని సమైక్యత అనే మూల్యాన్ని చెల్లించమంటోంది!

సుసంపన్నమై, అలా అద్భుతంగా ఏకీకృతమైన మానవ సమాజం యొక్క శక్తి వినియోగం కూడా అతిశయంగా ఉంటుంది. అసలు ఒక నాగరికత ఎంత శక్తిని ఉత్పన్నం చెయ్యగలదు, విశ్వంలో ఎంత మేరకు విస్తరించి ఉంటుంది అన్న అంశాలని ఆధారంగా చేసుకునే కర్డషేవ్ (image on the left) తన నాగరికతల వర్గీకరణని ప్రతిపాదించాడు. ఆ వర్గీకరణ ప్రకారం:
- ఒక గ్రహం మీద లభ్యమయ్యే మొత్తం శక్తిని వినియోగించగల నాగరికత 1 వ రకం నాగరికత
- ఆ గ్రహానికి సమీపంలో ఉన్న తార నుండి వచ్చే మొత్తం శక్తిని వినియోగించుకోగల నాగరికత 2 వ రకం నాగరికత.
- మొత్తం గెలాక్సీ లోని శక్తి వనరులని వాడుకుంటూ, గెలాక్సీ అంతా వ్యాపించిన సామ్రాజ్యాన్ని స్థాపించగల నాగరికత 3 వ రకం నాగరికత.
ఒక నాగరికత యొక్క శక్తి వినియోగాన్ని సూచించడానికి కార్ల్ సాగన్ ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు:
K = (log10(W) - 6)/10
ఇక్కడ W అంటే ఆ గ్రహం వాడే Power విలువ అన్నమాట.
రమారమి 10^13 వాట్ల శక్తి వినియోగం గల మన ప్రస్తుత నాగరికత యొక్క K విలువ 0.7.
ఈ విలువ 1.0 అయినప్పుడు మనం 1 వ రకం నాగరికత స్థాయికి ఎదుగుతాం. పై సూత్రంలో సంవర్గమానం (logarithm) ఉండడం వల్ల ఈ విలువ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. 2030 కాలానికి కూడా ఈ విలువ కేవలం 0.73 మత్రమే అవుతుందని అంచనా.
మరి అంత స్థాయిలో శక్తిని ఉత్పన్నం చెయ్యాలంటే కేవలం చమురు, బొగ్గు మొదలైన సాంప్రదాయక శక్తి వనరులని వినియోగిస్తే సరిపోదు. అంత మోతాదులో శక్తిని ఉత్పన్నం చెయ్యడానికి మూడు మార్గాలు సూచించబడ్డాయి:
1. కేంద్రక సంయోగం (Nuclear fusion) ద్వారా శక్తి ఉత్పత్తి. 1 వ రకం నాగరికతలు సెకనుకి 5 kg ల పదార్థాన్ని శక్తి కింద రూపాంతరం చెయ్యగలగాలి. అంటే సెకనుకి 1000 kg ల హైడ్రోజెన్ ని హీలియంగా మార్చాలి. అంటే ఏడాదికి 3 X 10^10 kg అన్నమాట. ఒక ఘన కిమీ నీటిలో 10^11 kg ల హైడ్రోజెన్ ఉంటుంది. భూమి మీది సముద్రాలలో 1.3 X 10^9 ఘన కిమీల నీరు ఉంది. కనుక ఈ వనరుని
వాడుకుంటూ చాలా కాలమే శక్తి ఉత్పత్తి చేసుకోవచ్చు. 2. సౌరశక్తి: ప్రస్తుతం భూమి మీదకి ప్రసారమయ్యే మొత్తం సౌర కిరణాల శక్తిలో చాలా చిన్న భాగం మాత్రమే మనం విద్యుచ్ఛక్తిగా మర్చుకుని వాడుకుంటున్నాం. భూమి మీద పడే మొత్తం సౌరశక్తిని గ్రహించాలంటే భూమి ఉపరితలం మొత్తాన్ని solar panels తో కప్పడానికి మించి వేరే మార్గం కనిపించదు. కాని అంతరిక్షంలో భూమి చుట్టూ స్థిర కక్ష్యలో తిరిగే solar satellites నుండి శక్తిని గ్రహించడానికి వీలవుతుంది. కాని అలాంటి సాధనాలు ప్రస్తుతం లేవు.
3. ఇక మూడవ శక్తి వనరు "ప్రతి-పదార్థం" (antimatter). పదార్థానికి, ప్రతి-పదార్థానికి మధ్య సంపర్కం కలిగినప్పుడు రెండూ లయమై బ్రహ్మాండమైన శక్తి పుడుతుంది. ఉదాహరణకి ఒక కిలో పదార్థం, ఒక కిలో ప్రతి-పదార్థంతో చర్య జరిపినప్పుడు 1.8 X 10^17 Joules శక్తి ఉత్పన్నం అవుతుంది. అంటే 47 మెగాటన్నుల TNT పేలగా పుట్టినంత శక్తి అన్నమాట! అయితే కిలోల లెక్కన ప్రతి-పదార్థాన్ని ఉత్పత్తి చెయ్యగల సాంకేతిక నైపుణ్యం మనకి లేదు.
పై మూడు మార్గాలలోను శక్తిని పుట్టించాలంటే ఎంతో సాంకేతిక పురోగతిని సాధించాలి. ఒకటి రెండు దశాబ్దాలలో అది సాధ్యమైతే, గొంగళి పురుగు సీతాకోక చిలుక అయినట్టు, మనం 1 వ రకం నాగరికతగా రూపాంతరం చెందుతామన్నమాట...
(సశేషం…)
1 వ రకం నాగరికత - ఇది గ్రహవ్యాప్త నాగరికత
2 వ రకం నాగరికత - ఇది దాని సౌరమండలానికే పరిమితమైన నాగరికత
3 వ రకం నాగరికత - ఇది తారల దారులు తెలిసిన నాగరికత
ఈ మూడూ కూడా భావి నాగరికతలలో రకాలు అనుకుంటే మన ప్రస్తుత నాగరికత ఇంకా 0 వ రకం నాగరికతే నని చెప్పుకోవాలి. ఈ 0 రకం నాగరికత లక్షణాలేంటి?
ఈ రకం నాగరికత యొక్క మొట్టమొదటి లక్షణం తీరని విభజనలతో కూడుకున్న సమాజం. మనకు తెలిసినంత మేరకు మానవ చరిత్రని తిరగేస్తే మానవ సమాజాలని వేరు చేసే నానారకాల లోతైన విభజన రేఖలే కనిపిస్తాయి. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జాతి, దేశం, భాష, మతం, ఐశ్వర్యం, వాతావరణ పరిస్థితులు ఇలా ఎన్నో కారణాలు మనుషులు ఒకరినొకరు దూరంగా ఉండేలా చేస్తూ వచ్చాయి. కాల ప్రవాహంలో కొన్ని రేఖలు చెరిగిపోతుంటాయి, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. కొన్ని మాత్రం తీరని, చెరగని సరిహద్దు రేఖలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఆ కారణం చేత రాజకీయ అస్థిరత, యుద్ధం మొదలైనవి ఉంటూనే ఉంటాయి. ఈ నల్లని అవశేషాలు ఉన్న నాగరికత ఇంకా 1 వ రకం నాగరికత స్థాయికి ఎదగలేదన్నమాట.
మానవ జాతులలో వైవిధ్యం ప్రకృతి సహజం. కాని ఆ వైవిధ్యం విభజనకి దారితీయడం, ఆ విభజన జాతుల అస్తిత్వాన్నే ప్రశ్నించేటంత తీవ్ర రూపాన్ని దాల్చడం - ఇవి 0వ రకం నాగరికతకి చిహ్నాలు.
ఈ కోవకి చెందిన నాగరికతకి మరో లక్షణం ప్రకృతికి నిబద్ధమైన జీవనాన్ని గడపడం. అంటే ప్రకృతి చేసే ఏర్పాట్లకి ఒడంబడి సాగే జీవనం అన్నమాట. ప్రకృతి సహజ వనరులు పుష్కలంగా ఉన్న చోట నాగరికతలు వెల్లివిరుస్తాయి. జల వనరుల కోసం నదీతీరాల వద్ద, రవాణా సదుపాయాల కొసం సముద్ర తీరం వద్ద, లేదా ఖనిజాలు ఉన్న చోట, వృక్ష సంపత్తి ఉన్న చోట - ఇలా ప్రకృతి చేసిన ఏర్పాట్ల అనుసారం భూమి మీద జనాభా విస్తరించి ఉండడం కనిపిస్తుంది. ఉదాహరణకి అంత విశాల భూభాగం ఉన్న చైనా లో కూడా జనాభా అధికశాతం తూర్పులోను, దక్షిణ-తూర్పు లోను ఉన్న తీర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండడం కనిపిస్తుంది. తూర్పు యూరప్ లో కన్నా సుదీర్ఘమైన తీరరేఖ గల పశ్చిమ యూరప్ లో జన సాంద్రత హెచ్చుగా కనిపిస్తుంది. అమెరికాలో పశ్చిమ, తూర్పు, ఉత్తర-తూర్పు తీర ప్రాంతాలలోను, ఆ ప్రాంతాలకి దగ్గరలోను అధికంగా జనావాసం కనిపిస్తుంది. 1 వ రకం నాగరికతలో ఈ ఒరవడులు ఎలా మారిపోతాయో ముందు ముందు చూద్దాం.
0 వ నాగరికతలో మరో ముఖ్య లక్షణం దాని శక్తి వనరుల వినియోగానికి సంబంధించినది. 1 వ రకం నాగరికతతో పోల్చితే మన ప్రస్తుత 0 వ నాగరికతలో శక్తి వినియోగం అత్యల్పంగా ఉంటుంది. ఉదాహరణకి రాత్రి పూట భూమి యొక్క చీకటి ముఖాన్ని అంతరిక్షం నుండి సందర్శిస్తే చెదురుమొదురుగా మాత్రమే జనావాసానికి చిహ్నాలైన విద్యుత్ దీపాల మినుకు మినుకు కాంతులు కనిపిస్తాయి. కాని 1 వ రకం నాగరికత ఉన్న గ్రహం యొక్క చీకటి ముఖం మొత్తం సహస్ర దీపాలంకృత వివాహ మండపంలా అవిచ్ఛిన్న ప్రభతో వెలిగిపోతూ ఉంటుంది.
0 వ దశ నుండి 1 వ దశకి ఎదుగుతున్న నాగరికతలో శక్తి వినియోగం గణనీయంగా పెరుగుతుంది. జనావాసం కూడా భూమి మీద మరింత సమంగా విస్తరించడం మొదలెడుతుంది. వనరులు ఉన్నచోటికి మనుషులు తరలడం కాకుండా, మనుషులు ఉన్న చోటికి సాంకేతిక సామర్థ్యంతో వనరులని తరలించడం జరుగుతుంది. ఈ ఒరవడులు ఇప్పటికే మన నాగరికతలో కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
(ఇలాంటి లక్షణాలు గల గ్రహం ఒకటి ఐసాక్ అసిమోవ్ రాసిన ’Foundation series' నవలలలో కనిపిస్తుంది. Trantor అన్న పేరు గల ఈ గ్రహం, మొత్తం గెలాక్సీ అంతా విస్తరించిన ఒక మహాసామ్రాజ్యానికి ఎనిమిది వేల సంవత్సరాల పాటు రాజధానిగా ఉండేది. ఆ గ్రహం మీద జీవితం ఎలా వ్యవస్థీకరించబడి ఉందో అసిమోవ్ మాటల్లోనే విందాం:
"ట్రాంటర్ ఉపరితలం అంతా లోహపు పూత వేసినట్టు ఉంటుంది. దాని ఎడారులలోను, సస్య భూములలోను ఒకే విధంగా జనావాసం ఉంటుంది. అధికార భవనాల కారడవులు, కంప్యూటరీకృత జీవన స్రవంతి, విశాలమైన ఆహారనిలువలు, బృహత్తరమైన యంత్రవిడిభాగాల గోడవున్లు... ఈ గ్రహం మీద కొండలన్నీ చదును చెయ్యబడ్డాయి. లోయలు, అగాధాలు అన్నీ పూడ్చివేయబడ్డాయి. అంతే లేని ఈ ఊరి సొరంగ మార్గాలు ఖండపు అరల (continental shelves) అడుగున కూడా చొచ్చుకుపోతుంటాయి. నాగరక ప్రభావం దాని సముద్ర గర్భంలోకి కూడా విస్తరించింది. సముద్రాలు జలచరాలని పెంచే తొట్టెలుగా మార్చివేయబడ్డాయి. ఆ గ్రహం మీద వాడబడే ఖనిజాలకి, ఆహారానికి ఈ సముద్రాలే స్థానిక, చాలీచాలని వనరులు...) ("Foundation's Edge" by Isaac Asimov, pg 91).

కాని 0 వ దశకి చెందిన నాగరికత 1 వ దశ నాగరికతగా సునాయాసంగా, సుస్థిరంగా మారిపోతుందని నమ్మకం ఏమీ లేదు. ఆ పరివర్తన చెందగోరే నాగరికత కొన్ని కఠిన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. శైశవ దశ నుండి ఎదిగే ఏ నాగరికత అయినా, మనలాగానే ఏదో ఒకనాడు రెండు విషయాలని కనుక్కుంటుంది. వాటిలో మొదటిది ఆవర్తక పట్టికలో (periodic table) 92 వ మూలకం తో మొదలుకుని మరింత భారమైన, రేడియోధార్మిక మూలకాల ఆవిష్కరణ. రెండవది రసాయనిక పరిశ్రమ. యురేనియం ఆవిష్కరణతో పరమాణు బాంబుల తయారీ సాధ్యపడింది. అందుకు పర్యవసానంగా మానవాళి సామూహిక ఆత్మవినాశనావకాశం అనే ప్రేతం ప్రత్యక్షమయ్యింది. మానవజాతి అస్తిత్వాన్నే అది సవాలు చేస్తోంది.
ఇక రెండవదైన రాసాయనిక పరిశ్రమల సంస్థాపన వల్ల నానా రకాల విషపదార్థాలు వాతవరణంలోకి ప్రవేశించి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మనుషులకి ఊపిరి కావలసిన వాతావరణం, బతుకు పీక నులిమి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ భయాలు ఇలా ఉండగా, 0 వ నాగరికతలో ముఖ్య లక్షణమైన విభజనకి పర్యవసానమైన ’పరపీడన పరాయణత్వం’, యుద్ధం మొదలైన విధ్వంసాత్మక శక్తులు మానవ జాతులని కబళించే ప్రమాదం ఉంది.
ఈ దుర్గమమైన అవరోధాలని దాటగలిగితే, తీరని విభేదాలని తేల్చుకోగలిగితే 0 వ రకం నాగరికత ఎదిగి 1 వ రకం నాగరికతగా పరిణమించే అవకాశం ఉంది. లేకుంటే దాని గతిరేఖ అక్కడితో అంతరించిపోతుంది. ఏకకణ జీవి దశ నుండి ఒక గ్రహం మీద ఆవిర్భవించి, కోటానుకోట్ల సుదీర్ఘపరిణామం తరువాత 0 వ నాగరిక దశకి చేరుకున్న జాతి ఆ గ్రహం మట్టిలోనే కలిసిపోయే అవకాశం ఉంది.
200 బిలియన్ల (200,000,000,000) తారలు ఉన్న మన పాలపుంత గెలాక్సీలో అర్థశతాబ్దం నుండి వెతుకుతున్నా ఎక్కడా నాగరిక జాతుల జాడ కనిపించదేం? అని శాస్త్రవేత్తలు తరచు ఆశ్చర్యం వెలిబుచ్చుతుంటారు. దానికి కారణం 0 వ రకం నాగరికత 1 వ రకం నాగరికతగా రూపాంతరం కావడంలో విఫలం కావడమే కావచ్చు. 0 వ దశలోనే అంతరించిపోవడమే కావచ్చు. (నాగరిక జీవులు ఉన్నా వారి జాడ మనకి తెలియకపోడానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాలు మరోసారి చర్చించుకుందాం.)
ఎన్నో ప్రమాదకరమైన జీవ పరిణామ దశలని దాటి మన ప్రస్తుత 0 వ రకం నాగరిక దశ వరకు వచ్చాం. మన మానవ జాతి చిరకాలం నిలవాలంటే, ప్రస్తుత స్థితి నుండి 1 వ దశ నాగరికతకి ఎదగడంలో పొంచిన ఉన్న ప్రమాదాలని అర్థం చేసుకుని, విజయవంతంగా ఆ పరివర్తనని పరిపూర్ణం చేసుకుంటామని, అందరం కలిసికట్టుగా ఆ భవి దశలోకి ప్రవేశించగలమని ఆశిద్దాం.
(1 వ రకం నాగరికత లక్షణాల గురించి వచ్చే పోస్ట్ లో...)
వైభవోపేతమైన గతం ఉందని కాబోలు మన దృష్టి తరచు భవిష్యత్తు మీద కన్నా గతం మీద ఎక్కువగా నిలుస్తుంది.
మరి కనీసం రెండు వేల ఏళ్ల గతం ఉన్నా, ఎంచుచేతనో పాశ్చాత్యుల మనసు గతం కన్నా తరచు భవిష్యత్తు మీదకే పోతుంటుంది. భవిష్యత్తు గురించి పథకాలు వెయ్యడం, విస్తృత ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలు కోసం పాటు పడడం వారి సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన విషయం. పాశ్చాత్యులలో ఆ లక్షణానికి ఓ చక్కని తార్కాణం మార్స్ మీద వలస పోయే విషయం గురించి పాశ్చాత్యలోకంలో జరిగిన చర్చ, సన్నాహం. మార్స్ మీద కొన్ని వేల ఏళ్ల పాటు జరుగవలసిన ధరాసంస్కరణ గురించి సాగిన ఊహాగానం తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అంతకు ముందు కొన్ని పోస్ట్ లలో చూశాం.
ఈ తూర్పు, పడమరల ఆలోచన విధానాలలో తేడాల విషయం పక్కన పెడితే, శాస్త్రవేత్తల మనసులు కూడా తరచు భవిష్యత్తు మీదకు పోతుంటాయి. మానవ జీవనానికి ఆసరాగా ఉండే సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించడం, ఏటేటా ఆ యంత్రాంగాన్ని అంతకంతకు పరిపూర్ణం గావించడం లక్ష్యంగా గల శాస్త్రవేత్త/ఇంజినీరు మనసు మరి భవిష్యత్తు మీదకి పోతోందంటే ఆశ్చర్యం లేదు.
మార్స్ గురించిన ఊహాగానమే మేధస్సు వెర్రితలలు వేయడంలా చాలా మందికి అనిపించవచ్చు. అలాంటిది మరింత సుదూరమైన భవిష్యత్తులో మానవ జాతి ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? భూమి మీదే మనుగడ సాగిస్తుందా? తారాంతర యానంలో దక్షత సంపాదించి నక్షత్రాలలో నివాసం ఏర్పరచుకుంటుందా? కేవలం సౌర, రసాయన, విద్యుత్, పరమాణు శక్తులే కాక ఇతర వినూత్న శక్తి రూపాలని కనుక్కుని వాటి వినియోగంలో ఆరితేరుతుందా? నేటి నుండి నూరేళ్ల తరువాత,, వేయేళ్ల తరువాత, పది వేలు, లక్ష.... ఏళ్ల తరువాత మన స్థితి ఏమిటి? ... ఇలాంటి లోతైన, జటిలమైన ప్రశ్నల గురించి ఎంతో ఆలోచన జరిగింది.
రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక లక్ష సంవత్సరాల తరువాత మానవాళి భవిష్యత్తు గురించిన ఆలోచనే హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కాని మనిషి మనసుకి వర్తమానపు ఇరుకు గోడలు ఇబ్బంది కలిగిస్తాయి కాబోలు. అందుకే నేడు అనే బందీఖానా నుండి తప్పించుకోవాలని పెనుగులాడతాడు. భవిష్యత్తు మీద విజయం కోసం ఉద్యమిస్తాడు. కాలానికే అతీతంగా ఎదగాలని ఆత్రుతపడతాడు. ఓ కొత్త బంగారు లోకంలో కొలువుండాలని కలగంటాడు.
మనవాళి యొక్క, లేదా మానవ సదృశ నాగరికతల యొక్క వికాస క్రమం ఎలా ఉంటుందో, వాటి భవితవ్యం ఎలా ఉంటుందో ఆలోచించిన వైజ్ఞానికులు ఆ వికాస క్రమాన్ని కొన్ని దశలుగా వర్గీకరించారు. ఆ క్రమంలో మనం ఇంకా మొదటి దశలోకి కూడా ప్రవేశించలేదట! అవును మరి. మన విశ్వం వయసు 15 బిలియన్ సంవత్సరాలు. మనం ఉన్న పాలపుంత గెలాక్సీలొనే 200 బిలియన్ తారకలు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో మన కన్నా కొన్ని మిలియన్ల సంవత్సరాలు ముందున్న అధునాతన నాగరికతలు ఉండి ఉండాలి. అంత సుదీర్ఘ వికాస క్రమాన్ని నికొలాయ్ కర్డషేవ్ అనే రష్యన్ ఖగోళ శాస్త్రవేత్త నాలుగు వర్గాలుగా విభజించాడు. ఆ దశలు ఏంటో, ఆ పరిణామం తీరేంటో వరుసగా కొన్ని పోస్ట్ లలో చర్చించుకుందాం.
(సశేషం...)
ఆ విధంగా స్లిఫర్ కి సాధ్యం కాని పనిని, హబుల్ తన 100-ఇంచిల దూరదర్శినితో సాధించాలని పూనుకున్నాడు. దూరదర్శిని శక్తివంతమైనదే అయినా ఆ రోజుల్లో అంతరిక్షంలో అంతంత దూరాలు చూసిన వీరుడు లేడు. అప్పటికే హబుల్ కి అంతరిక్షంలో విపరీతమైన దూరాలు కొలవడంలో గొప్ప పేరుంది. అయితే తను చేపట్టిన పని సాధించడానికి కౌశలమే కాక, గొప్ప సహనం కూడా కావాలి. చెప్పలేనంత ప్రయాసతో కూడుకున్న పని అది. అదంతా తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని హబుల్ కి తెలుసు. ఈ ప్రయాసలో తనకి కుడిభుజంలా ఉండే వాణ్ణి వెతుక్కోవాలి. మౌంట్ విల్సన్ వేధశాలలో హుమాసన్ కి అప్పటికే మంచి పేరు ఉంది. తన పనికి హుమాసన్ నే ఎంచుకున్నాడు హబుల్.
అయితే హుమాసన్ ని ఎంచుకోడానికి మరో కారణం కూడా ఉంది. హుమాసన్ పెద్దగా చదువుకోలేదు. హబుల్ లాగా తనకి పి.హెడ్.డి. పట్టం లేదు. ఖగోళ పరిశీలనలో ఓ మేటి శాస్త్రవేత్తకి ఉండాల్సిన కౌశలం ఉన్నా, పెద్దగా డిగ్రీలు లేని వాడు. తన వల్ల ఏదైనా గొప్ప ఆవిష్కరణ జరిగినా దాని ఘనత హబుల్ దే అనుకుంటారు గాని, హుమాసన్ గొప్పదనం అని ఎవరూ అనుకోరు. ఇది కూడా హబుల్ హుమాసన్ ని ఎన్నుకోవడానికి మరో కారణం!
హబుల్, హుమాసన్ లు ఇద్దరూ వేరు వేరుగా తమ పరిశీలనలలో నిమగ్నం అయ్యారు. ఈ ప్రయత్నంలో క్రమం ఇలా ఉంటుంది. స్లిఫర్ పరిశీలించిన గెలాక్సీల కన్నా దూరంలో ఉన్న గెలాక్సీల నుండి వచ్చే కాంతిలో అరుణభ్రంశం కొలవాలి. దాని వల్ల వాటి గమన దిశ (మన దిశగా వస్తోందా, దూరంగా తరలిపోతోందా), వేగం తెలుస్తాయి. కాని వాటి దూరాన్ని తెలుసుకోడానికి ప్రకాశం మీద ఆధారపడ్డ ’సెఫెయిడ్ చంచల తార పద్ధతి’ మొదలైన సాంప్రదాయక పద్ధతులని వాడాలి. ఆ విధంగా దూరాన్ని,వేగాన్ని కొలిచి, వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో చూడాలి.

1929 కల్లా 46 గెలాక్సీలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. దూర, వేగాల మధ్య అనుకున్న దాని కన్నా చాలా సరళమైన సంబంధం ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దూరం, వేగం మధ్య ఓ స్థిరమైన నిష్పత్తి ఉన్నట్టు కనిపించింది. అంటే వేగం (v) కి, దూరం (d) మధ్య అనులోమానుపాత సంబంధం ఉందన్నమాట. ఆ నిష్పత్తిని తెలిపే గుణకాన్ని హబుల్ పేరు మీద H అక్షరంతో వ్యవహరిస్తారు.
V = H X d
H km/sec/MPc
MPc = Mega Parsec = 1,000,000 Parsecs
1 Parsec = 3.26 కాంతిసంవత్సరాలు
మొట్టమొదటి అంచనాల బట్టి దీని విలువ 558 అనుకున్నారు. ఆ తరువాత సాండేజ్ తదితరులు చేసిన పరిశీలనల బట్టి మరింత నిర్దుష్టమైన అంచనాలు వీలయ్యాయి. 2009 లో చేసిన గణనాల బట్టి హబుల్ స్థిరాంకం విలువ 74.2 +/- 3.6 km/sec/MPc.
గెలాక్సీల వేగానికి, వాటి మధ్య దూరానికి మధ్య సంబంధాన్ని తెలిపే ఈ గుణకాన్ని కనుక్కోవడంలో హుమాసన్ పాత్రకి గుర్తింపుగా కొన్ని సార్లు ఈ గుణకాన్ని హబుల్-హుమాసన్ గుణకం అని కూడా అంటారు.
ఒక శాస్త్రవేత్త కావడానికి స్ఫూర్తి ఒక్కొక్కరి విషయంలో ఒకొక్కరకంగా ఉంటుంది. ఒకరికి నోబెల్ బహుమతి సాధించాలన్న ఆకాంక్ష స్ఫూర్తినివ్వచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే భద్రత, పింఛను మొదలైనవి మరొకరికి “స్ఫూర్తి” కావచ్చు. కాని లౌకికమైన లాభాలేవీ లేకపోయినా కేవలం తెలుసుకోవాలన్న పసిపిల్లవాడి కుతూహలమే నిజమైన శాస్త్రవేత్తకి ఊపిరి. ఆ కుతూహులం, ఆ అభినివేశం లేని శాస్త్రవేత్త వృత్తి, ప్రేమలేని కాపురంలా కళావిహీనంగా ఉంటుంది.
ఏ డిగ్రీ లేకపోయినా ఉత్తమ శాస్త్రవేత్తకి ఉండాల్సిన లక్షణాలన్నీ హుమాసన్ కి ఉన్నాయి. సంపూర్ణమైన అంకిత భావం, అపారమైన సహనం, విసుగు లేకుండా సమస్య తెగినదాకా శ్రమించే గుణం... శాస్త్ర వృత్తిని ఒక వ్యాపార అవకాశంగా ఎప్పుడూ చూడలేదు హుమాసన్. సజావుగా సాగుతున్న పళ్లతోట వ్యాపారాన్ని వొదిలిపెట్టి వేధశాలలో పని వాడిగా చేరాడు. శాస్త్రరంగంలో తను సాధించిన విజయాలకి గుర్తింపుగా బిరుదులు, బహుమతులు వస్తాయన్న ఆశ కూడా లేదు. అందుకేనేమే... హబుల్ కి నోబెల్ బహుమతి లభించింది. హుమాసన్ కి ఆ పరిశీలనలలో పాలుపంచుకున్న ఆనందం మాత్రం మిగిలింది.
శాస్త్రవేత్తలు అనగానే న్యూటన్, ఐన్స్టయిన్ వంటి వారే ప్రస్ఫుటంగా గుర్తొస్తారు. కాని నిజానికి సమాజానికి బాగా తెలిసిన శాస్త్రవేత్తలు బహుకొద్ది మంది. సమాజానికి తెలీకుండా మౌనంగా నేపథ్యంలో అధ్బుతంగా శ్రమించిన అజ్ఞాత వీరులు వేలకివేలు. ఆ కోవకి చెందిన ఓ నిజమైన శాస్త్రవేత్త హుమాసన్.
References:
1. John and Mary Gribbin, Men who measured the universe.
2. http://en.wikipedia.org/wiki/Milton_L._Humason
3. http://en.wikipedia.org/wiki/Edwin_Hubble

లొవెల్ వేధశాలలోని 24-ఇంచిల దూరదర్శీనితో తన పరిశీలనలు మొదలుపెట్టాడు స్లిఫర్. ఈ దూరదర్శని చిన్నదే అయినా. దీనితో పాటు ఒక వర్ణపట దర్శిని (spectrograph) జతచేసి ఉంది. తారల నుండి వచ్చే కాంతిలో ఏఏ రంగు కాంతులు ఉన్నాయో ఈ పరికరం చెప్తుంది. తారల నుండి వెలువడే కాంతి రంగు ఎన్నో కారణాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి ఆ తారలోని అంశాల, అంటే మూలకాల మీద ఆధారపడుతుంది. తార ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది. మామూలుగా కుర్రతారలు బాగా వేడెక్కి ఉంటాయి! వాటి నుంచి వచ్చే కాంతిలో నీలి వర్ణపు పాలు ఎక్కువ ఉంటుంది. ముసలు తారల ఉష్ణోగ్రత కాస్తంత తక్కు
వగా ఉంటుంది. వాటి కాంతిలో ఎర్రదనం ఎక్కువగా ఉంటుంది.తార కదిలే వేగం మీద, దిశ మీద కూడా దాని నుండి వచ్చే కాంతి రంగు ఆధారపడుతుంది. దీనినే డాప్లర్ ఫ్రభావం (Doppler effect) అంటారు. కాంతి విషయంలోనే కాక, శబ్దం విషయంలో కూడా ఈ ప్రభావాన్ని గమనించొచ్చు. రైలుబండి కూత అది మన నుండి దూరంగా తరలిపోతున్నప్పటి కన్నా, మన దిశగా వస్తున్నప్పుడు మరి కొంచెం కీచుగా ఉంటుంది. అంటే దాని పౌనపున్యం (frequency) ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఒక తార మన నుండి దూరంగా వేగంగా కదులుతుంటే దాని నుండి వెలువడే కాంతులు కొద్దిగా ఎర్రబారుతాయి. అంటే దాని నుండి వచ్చే కిరణాల పౌన:పున్యాలు ఎరుపు దిశగా మారుతాయి అన్నమాట. దీనినే అరుణ భ్రంశం (red shift) అంటారు. అలాగే ఆ తార మన దిశగా దూసుకొస్తుంటే దాని కాంతులు కొద్దిగా నీలి ఛాయని సంతరించుకుంటాయి. దీనినే నీలి భ్రంశం (blue shift) అంటారు.
1912 లో ఆండ్రోమెడా నెబ్యులా నుండి వచ్చే కాంతుల వర్ణపటాన్ని పరిశీలించాడు వెస్లో స్లిఫర్. అక్కడి నుండి వచ్చే కాంతుల వర్ణపటంలో నీలిభ్రంశం కనిపించింది. దాన్ని బట్టి లెక్కలు వెయ్యగా ఆండ్రోమెడా నెబ్యులా మన దిశగా 300 km per sec వేగంతో దూసుకువస్తోందని తెలిసింది. 1914 కల్లా 15 నెబ్యులాల నుండి వచ్చే కాంతులని పరిశీలించాడు. వాటిలో ఆండ్రోమెడా తప్ప తక్కిన అన్నిట్లోనూ అరుణభ్రంశమే కనిపించింది. 1925 నాటికి పూర్తి చేసిన 41 అధ్యయనాలలో 39 సందర్భాలలో అరుణ భ్రంశమే కనిపించింది. అంటే తను చూసిన వాటిలో అధికశాతం మన నుండి దూరంగా జరిగిపోతున్నాయన్నమాట.
ఖగోళవస్తువులు కొన్ని ఇటు, కొన్ని అటు కదలడం సబబుగా ఉంటుంది గాని, అధికశాతం వస్తువులు మన నుండి ఎవరో తరుముతున్నట్టుగా దూరంగా తరలిపోవడంలో భావం ఏమిటో అర్థం కాలేదు స్లిఫర్ కి. పోనీ ఇంకా దూరంలో ఉన్న విశ్వభాగాలని పరిశీలిద్దామంటే తన 24-ఇంచిల దూరదర్శినితో అది వీలుపడలేదు.
ఆ విధంగా స్లిఫర్ మధ్యలో విడిచిపెట్టిన సమస్యని హబుల్ చేపట్టాడు. ఆ చిక్కు ముడిని విప్పగలిగాడు. అయితే హుమాసన్ సహాయం లేకుండా ఆ సమస్యని కేవలం తన స్వశక్తితో సాధించలేకపోయేవాడని ఆ తరువాత జరిగిన వృత్తాంతం బట్టి మనకి అర్థమవుతుంది.
(సశేషం...)

కేవలం వాయు, ధూళి మేఘం అయిన ఆండ్రోమెడా నెబ్యులాకి ఏంటంత ప్రాముఖ్యత?
హుమాసన్, షాప్లీ తదితరులు ఆండ్రోమెడా నెబ్యులా మీద దృష్టి సారించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ నెబ్యులా అర్థమైతే ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభకాలంలో విశ్వం గురించిన మన అవగాన సరైనదో కాదో తేల్చుకునే అవకాశం ఉంటుంది.
(Picture: Milton Humason)
ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభ కాలంలో విశ్వం గురించి చాలా సంకుచితమైన అవగాహన ఉండేది. మన పాలపుంత గెలాక్సీయే విశ్వానికి కేంద్రం అనుకునేవారు. మన గెలాక్సీకి బయట కూడా గెలాక్సీలు ఉన్నా అవి మన గెలాక్సీ చుట్టూ పరిభ్రమించే చిన్న చిన్న ఉపగెలాక్సీలు మాత్రమే అనుకునేవారు. ఆవల ఉన్నది కేవలం అనంతమైన ఖాళీ అంతరిక్షమే. హార్లోషాప్లీ అనే అమెరికన్ ఖగోళశాస్త్రవేత్త వేసిన అంచనాల ప్రకారం పాలపుంత వ్యాసం 300,000 కాంతిసంవత్సరాలు అని తేలింది. (కాని ఆ అంచనా అతిశయమైనదని, అసలు విలువ 100,000 కాంతిసంవత్సరాలని తరువాత తెలిసింది.)
మన గెలాక్సీలో అక్కడక్కడ కనిపించే వాయు ధూళి మేఘాలే ఈ నెబ్యులాలు. కేవలం వాయుధూళి మేఘాలు, తారలలా స్వయం ప్రకాశం లేనివి, ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయంటే, అవి మనకి చాలా దగ్గర్లో ఉండి ఉండాలన్నమాట. కనుక ఎలా చూసినా పాలపుంతకి బయట పెద్దగా ఏమీ లేదనే అనుకునేవారు.
అలాంటి నెబ్యులాలలో ముఖ్యమైన ఆండ్రోమెడా నెబ్యులా మీదకు ఎడ్విన్ హబుల్ అనే మేటి శాస్త్రవేత్త దృష్టి పడింది. ఇరవయ్యవ శతాబ్దపు ఖగోళ విజ్ఞాన ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నవాడు హబుల్. 1923 లో మౌంట్ విల్సన్ వేధశాలలో ఉన్న అధునాతన 100-ఇంచిల దూరదర్శిని సహాయంతో తన ప్రయత్నం మొదలుపెట్టాడు. నెలలు తిరిగేలోగా కొన్ని ఆశ్చర్యకరమైన పరిశీలనలు చేశాడు. ఆండ్రోమేడా అంచులో, దుమ్ము ధూళి కనిపించకపోగా, ప్రకాశవంతమైన తారలు కనిపించాయి! అవీ సామాన్యమైన తారలు కాదు. అత్యంతప్రకాశవంతమైన ’నోవా’ తారలు.
ఈ నోవాలు విస్ఫోటం చెందుతున్న దశలో ఉన్న తారలు. ఆ దశలో వాటి ప్రకాశం మన సూర్యుడి ప్రకాశం కన్నా లక్ష రెట్ల వరకు ఎక్కువ ప్రకాశం ఉండొచ్చు. కొన్ని సార్లు వీటిని పట్టపగలు కూడ కనిపెట్టొచ్చు. ఈ నోవాలతో మనిషికి కొన్ని సహస్రాబ్దాల పరిచయం ఉంది. అచంచలంగా ఉంటుందని భావించే తారామండలంలో ఉన్నట్లుండి కనిపించే ఈ నోవాలు కొత్తగా (నవ్యంగా) పుట్టిన తారలు అని భావించిన ప్రాచీనులు వీటిని ’నోవా’ లని పిలవసాగారు.
ధూళి మేఘం అనుకున్న నెబ్యులాలో ప్రకాశవంతమైన తారలు కనిపించడం హబుల్ కి అమితాశ్చర్యం కలిగించింది. తను పొరబడడం లేదని నిర్ధారించుకోడానికి, గతంలో ఆ నెబ్యులాలని పరిశీలించిన షాప్లీ, హుమాసన్ మొదలైన వారు తీసిన ఫోటోలు తెప్పించి చూశాడు. తను నోవాలు అనుకున్న తారలు కొన్ని నిజంగానే నోవాలే అయినా, వాటిలో కొన్ని తారలు ’చంచల తారలు’ అని తెలుసుకున్నాడు. ఈ ’చంచల తారల ప్రకాశం, మిణుగురు పురుగుల కాంతిలా, లయబద్ధంగా మారుతూ ఉంటుంది. అందుకే వాటికా పేరు. ఈ తారలకి చాలా ప్రత్యేకత ఉంది. వీటి ప్రకాశం మారే ఆవృత్తికి, వాటి ప్రకాశం యొక్క తీక్షణతకి మధ్య ఓ నిర్దిష్టమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని ఉపయోగించి వాటి నిజ ప్రకాశాన్ని (actual brightness) కనుక్కోవచ్చు. ఇక్కణ్ణుంచి చూస్తున్నప్పుడు అవి కనిపించే తీరు బట్టి వాటి దృశ్య ప్రకాశం (apparent brightness) కనుక్కోవచ్చు. ఈ రెండు రకాల ప్రకాశాన్ని పోల్చి తద్వారా తారల దూరాలు కనుక్కోవచ్చు. ఈ విధంగా తారల ప్రకాశాన్ని బట్టి దూరాన్ని కనుక్కునే పద్ధతనే ’సెఫెయిడ్ చంచల తార’ పద్ధతి అంటారు.

ఈ పద్ధతిని ఉపయోగించి హబుల్ ఆండ్రోమెడా నెబ్యులాలోని చంచల తారల దూరాలని కొలవగా వచ్చిన ఫలితాలు చూసి నిర్ఘాంతపోయాడు! ఆ తారల దూరం 10 లక్షల కాంతి సంవత్సరాలు! (ఆధునిక కొలతల ప్రకారం ఆ దూరం 25 లక్షల కాంతి సంవత్సరాలకి పెరిగింది.) కనుక కేవలం లక్ష కాంతి సంవత్సరాలు వ్యాసం గల మన పాలపుంతలో ఆ నెబ్యులా నిశ్చయంగా భాగం కాదు. అదెక్కడో దూరంలో, పాలపుంతకి బాహ్యంగా ఉంది. తదనంతరం జరిగిన పరిశీలనల బట్టి ఆండ్రోమెడా నెబ్యులా కేవలం ధూళి మేఘం కాదని, పాలపుంతని తలదన్నేటంత పెద్ద బృహద్ గెలాక్సీ అన్న సత్యం నెమ్మదిగా బయటపడింది.
ఆ విధంగా విశ్వాన్ని గురించి, విశ్వంలో మన స్థానాన్ని గురించి మనకున్న అవగాహనలో ఓ ముఖ్యమైన లోపాన్ని హబుల్ చేసిన పరిశీలనలు సవరించాయి. కాని ఆ ఆవిష్కరణలో హుమాసన్ చేసిన పరిశీలనలకి కూడా పాత్ర ఉందన్న సంగతి మరచిపోకూడదు.
హబుల్ పరిశోధనలు ఆండ్రోమెడా గెలాక్సీలోని చంచల తారల ఆవిష్కరణతో ఆగిపోలేదు. మరో కొత్త కోణం నుండి తన పరిశీలనలు చెయ్యాలని అనుకున్నాడు. గతంలో మరో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త చేసిన అత్యంత ఆసక్తికరమైన కృషే అందుకు స్ఫూర్తి...
(సశేషం...)
హ్యూగో బెనియోఫ్ అనే రీసెర్చ్ స్కాలర్ తన సెలవుదినాలలో మౌంట్ విల్సన్ వేధశాలలో పని చెయ్యడానికి వచ్చాడు. దూరదర్శినితో ఎలా ఫోటోలు తియ్యాలో హుమాసన్ కి నేర్పించాడు. హుమాసన్ లో ఓ గొప్ప లక్షణం అతని అపారమైన సహనం. ఆ ఓర్పు మరి మొండి ఘటాలైన మ్యూల్ జంతువులతో వ్యవహరించడం వల్ల వచ్చిందేమో తెలీదు. లేక సైన్స్ అంటే ఆసక్తి ఉండడం వల్ల సహజంగా వచ్చింది కావచ్చు. సెలవు ముగిశాక బెనియోఫ్ వెళ్లిపోయాడు. హుమాసన్ మాత్రం ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కొనసాగించాడు.
హుమాసన్ ప్రతిభ ఆ వేధశాలలో పనిచేసే సీనియర్ ఖగోళశాస్త్రవేత్త అయిన హార్లో షాప్లీ కంట పడింది. ’ఖగోళ విజ్ఞాన ప్రపంచంలో అంత గొప్ప పరిశీలనాశక్తి కల వారు అరుదు,’ అని హుమాసన్ ని షాప్లీ మెచ్చుకున్నాడు ఒకసారి. మ్యూల్ బళ్ల డ్రైవర్ గా, పళ్లతోటలని చూసుకునే తోటమాలిగా పని చేసిన ఈ సామాన్యుడు ఖగోళ విజ్ఞానంలో అంత పెద్దవాడి మెప్పు పొందడం, అత్యద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. ఆ విధంగా 1920 లో హుమాసన్ ఆ వేధశాలలోని వైజ్ఞానిక బృందంలో జూనియర్ సభ్యుడిగా నియమించబడ్డాడు. ఇప్పుడు తన ప్రతిభ నిజంగా, సాధికారికంగా నిరూపించుకునే అవకాశం వచ్చింది.
1920 -1921 ప్రాంతాల్లో షాప్లీ హుమాసన్ ని పిలిచి ఖగోళం లోని ఓ సుదూరమైన, అంతవరకు పెద్దగా అర్థంగాని ’ఆండ్రోమెడా నెబ్యులా’ అనే వస్తువుని ఫోటోలు తియ్యమని కోరాడు. వేధశాలలో ఉన్న 100 ఇంచిల దూరదర్శినితో పనిలోకి దిగాడు హుమాసన్. ఆ రోజుల్లో ఈ ఆండ్రోమెడా నెబ్యులా మన పాలపుంత గెలాక్సీలో ఉన్న ఓ వాయుమేఘం అనుకునేవారు. వాయుమేఘం భూమి నుండి కనిపిస్తోందంటే మరీ అంత దూరంలో లేదన్నమాట. హుమాసన్ ఆ మేఘాన్ని అత్యంత శ్రద్ధతో ఫోటోలు తీశాడు. కాని అందరూ అనుకున్నట్టు కాక ఆ మేఘంలో చిన్న చిన్న మెరుస్తున్న చుక్కలు కనిపించాయి. అవి నక్షత్రాలలా ఉన్నాయి. పైగా కొన్ని ఫోటోలలో కనిపిస్తే కొన్నిట్లో కనిపించకుండా ఉన్నాయి. అంటే ప్రకాశంలో ఆటుపోట్లు గల తారలు అన్నమాట. ఇలాంటి తారలని ’చంచల తారలు’ (variable stars) అంటారు. తన పరిశీలనల ఫలితాలని షాప్లీకి తీసుకెళ్లి చూపించాడు హుమాసన్. ఫలితాలని షాప్లీ నమ్మలేదు. ఆండ్రోమెడా నెబ్యులా లాంటి ధూళిమేఘంలో చంచల తారలు ఉండే అవకాశమే లేదని కొట్టిపారేశాడు. హుమాసన్ చేతిలోంచి ఫోటో ప్లేట్లని తీసుకుని ఓ కర్చీఫ్ తో హుమాసన్ పెట్టిన గుర్తులని తుడిపేశాడు. ఆ విధంగా ఇరవయ్యవ శతాబ్దపు ఖగోళ విజ్ఞానంలో ఓ మహాసత్యానికి చెందిన మొట్టమొదటి ఆధారాలు అధికార దర్పం చేతిలో తుడిచిపెట్టుకుపోయాయి.
ఆ సత్యం బయట పడడానికి హుమాసన్ మరి కొంత కాలం ఆగవలసి వచ్చింది.
(సశేషం...)
శాస్త్రవేత్త కావాలంటే పట్టాలు, పి.హెచ్.డి. లు అక్కర్లేదు. ఎందుకటే శాస్త్రీయత అనేది మనసుకి సంబంధించినది, ఒక విధమైన మానసిక దృక్పథానికి సంబంధించినది. ఏ పట్టాలూ లేకపోయినా సైన్సు అంటే అపారమైన ప్రేమ కలిగి, పని పట్ల వెలితిలేని అంకితభావం కలిగిన కొందరు మేటి ఏకలవ్య శాస్త్రవేత్తలు ఉన్నారు. పదో క్లాసు కూడా పాసు కాని అలాంటి ఓ ఏకలవ్య శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రంలో ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశల్లో ఓ అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించాడు. అతడి పేరు మిల్టన్ హుమాసన్.
1905 ఆధునిక విజ్ఞానం ఓ పెద్ద మలుపు తిరిగిన సంవత్సరం. ఐన్స్టయిన్ తన సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రచురించిన సంవత్సరం. ఆ ఏడాది మిల్టన్ హుమాసన్ జీవితం కూడా ఓ ముఖ్యమైన మలుపు తిరిగింది. పద్నాలుగేళ్ల మిల్టన్ ఆ వేసవిలో కాలిఫోర్నియాలో, లాస్ ఏంజిలిస్ కి కాస్త ఉత్తరాన ఉన్న పాసడేనా కి చేరువలో ఉన్న మవుంట్ విల్సన్ మీద సమ్మర్ క్యాంపుకి వెళ్ళాడు. చల్లని పచ్చిక మీద పడుకుని చీకటి ఆకాశంలో మినుకు మినుకు మంటున్న తారలని తనివి తీరా చూసుకుంటూ వేసవి నెలలు గడిపేశాడు. తిరిగి ఇంటికి, బడికి వెళ్లాలని అనిపించలేదు. కాని వెళ్లక తప్పింది కాదు. ఆ పర్వతం, ఆ పరిసరాలు బాగా నచ్చేశాయి. ఇంటికి వెళ్లాక వాళ్ల అమ్మ, నాన్నలతో ఆ విషయమే నసుగుతూ చెప్పాడు. వాళ్లది పెద్దగా ఉన్న కుటుంబం కాదు. పైగా మిల్టన్ కూడా బడి చదువులలో రాణించే రకం కాదని వారికి తెలుసు. మౌంట్ విల్సన్ దరిదాపుల్లో ఏదైనా ఉద్యోగం వెతుక్కుని ఓ ఏడాది పాటు పని చెయ్యడానికి తల్లిదండ్రలు ఒప్పుకున్నారు. మౌంట్ విల్సన్ హోటెల్ లో ఓ పని కుర్రాడిగా చేరాడు మిల్టన్. ఏడాది కాలం పాటు అలా కష్టపడ్డాక కాలేజి మీదకి పిల్లవాడి మనసు మళ్లొచ్చని తల్లిదండ్రులకి ఒక ఆశ. కాని అలాంటిదేం జరక్కపోగా మౌంట్ విల్సన్ మీద మిల్టన్ ప్రేమ మరింత హెచ్చయ్యింది.
దానికి కారణం ఆ రోజుల్లో ఆ పర్వతం మీద వస్తున్న కొన్ని మర్పులే. 1905 కాలంలో ప్రపంచంలో అతి పెద్ద దూరదర్శిని (telescope) ఉన్న వేధశాల (observatory) నిర్మాణం మౌంట్ విల్సన్ మీదే జరుగుతోంది. ఆ నిర్మాణ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వాడు జార్జ్ హేల్ అనే ఖగోళశాస్త్రవేత్త. ఈ పెద్దమనిషి 24 వయసులోనే 1892 లో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఖగోళశాస్త్ర ప్రొఫెసర్ గా చేరాడు. బాగా ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. కొడుకు పరిశోధనలకి పనికొస్తుందని ధనికుడైన తండ్రి 60 ఇంచిల (1.5 m) వ్యాసం అద్దం ఉన్న పరావర్తన దూరదర్శిని (reflecting telescope) కొనిచ్చాడు. దాన్ని ప్రతిష్ఠంచడానికి ఇప్పుడో వేధశాల కావాలి అంతే! వాషింగ్ టన్ లో కార్నెగీ సంస్థ ఇచ్చిన $150,000 విరాళంతో 1904 లో వేధశాల నిర్మాణం మొదలయ్యింది.
1905 కి నిర్మాణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇరుకైన మట్టి రోడ్ల మీద, మ్యూల్ అనే జంతువులు లాగుతున్న బళ్ల మీదకి, విలువైన సాంకేతిక సామగ్రిని ఎక్కించి కొండ మీదకి తరలిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కుర్రాడైన మిల్టన్ కి చాలా ఆసక్తికరంగా అనిపించింది. తన హోటెల్ ఉద్యోగం వొదిలిపెట్టి మ్యూల్ బళ్లు తోలే డ్రైవర్ గా చేరాడు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే ఓ మేస్త్రి కూతుర్ని ప్రేమించి పెళ్లాడాడు.
కాలిఫోర్నియాలోనే ఓ చక్కని ద్రాక్ష తోట కొనుక్కుని నూతన దంపతులు హాయిగా స్థిరపడ్డారు. జీవితం సాఫీగా నడిచిపోతున్నా ఒక పక్క మౌంట్ విల్సన్ వేధశాల మిల్టన్ మనసుని పీకుతోంది. అలా ఉండగా ఆ వేధశాలలో ప్యూను ఉద్యోగం ఖాళీగా ఉందన్న వార్త వచ్చింది. ఆ వార్త తెచ్చింది ఎవరో కాదు – మిల్టన్ మామగారే! బంగారం లాంటి ద్రాక్ష తోటని అమ్మేసి, చీకూ చింతాలేని జీవితాన్ని కాదనుకుని, మౌంట్ విల్సన్ వేధశాలలో పనివాడుగా చేరాడు మిల్టన్ హుమాసన్. మొదట్లో కాఫీ చెయ్యడం, వేధశాలని శుభ్రం చెయ్యడం లాంటి చిన్న చితక పనులు చేసేవాడు. సాంకేతిక విషయాల పట్ల స్వతహాగా ఆసక్తి గల వాడు కనుక క్రమంగా దూరదర్శిని సరైన దిశలో తిరిగి ఉందో లేదో చూసుకోవడం, ఫోటాగ్రాఫిక్ ప్లేట్లు కడగడంలో సహాయపడడం లాంటి సాంకేతిక అంశం గల పనులలోకి ప్రవేశించగలిగాడు. ఇన్ని చేస్తే తీరా తన నెలసరి జీతం $80 మాత్రమే! జీవితంలో వచ్చిన ఈ హఠాత్ మార్పుకి భార్య అతణ్ణి క్షమించిందో లేదో సమాచారం లేదు!
మిల్టన్ అక్కడ పని చెయ్యడం మొదలెట్టిన కొత్తల్లో అంతరిక్షాన్ని ఫోటోలు తీసే పనిని ఖగోళశాస్త్రవేత్తలే చేసేవారు. ఈ పనిలో చాలా శ్రమ, సహనం అవసరం అవుతుంది. దూరదర్శిని మీదకి వంగి గంటల తరబడి ఓపిగ్గా లక్ష్యం కోసం కనిపెట్టుకుని ఉండాలి. తారావళులని ఫోటోలు తియ్యడం అంటే ఊరికే ఓ సారి ’క్లిక్’ మనిపిస్తే సరిపోదు. లక్ష్యం దిక్కుగా దూరదర్శినిని గురి పెట్టి గంటల తరబడి అలాగే పిల్మ్ ని ’ఎక్స్ పోజ్’ చెయ్యాలి. కొన్ని సార్లు అలా 40
గంటల వరకు కూడా ’ఎక్స్ పోజ్’ చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఫోటో ఒక్క రాత్రిలో పూర్తి కాదన్నమాట. వరుసగా పలు రాత్రులు ఫోటో తీసే కార్యక్రమాన్ని కొనసాగించాలి. మరుసటి రాత్రి దూరదర్శినిని మళ్లీ అదే లక్ష్యం వైపు గురి పెట్టి ఫోటో తియ్యాలి. ఈ వ్యవహారం అంతా మరి రాత్రే జరగాలి కనుక రాత్రులు కొంచెం దీర్ఘంగా ఉండే చలికాలంలో ఈ పరిశీలనలు మరింత ఎక్కువగా జరుగుతాయి. ఎముకలు కొరికే చలికి ఓర్చుకుని పరిశీలకుడు ప్రయాస పడాలి. దూరదర్శిని ఉన్న ’డోమ్’ లోపలి భాగాన్ని కృత్రిమంగా వేడి చెయ్యడం పెద్ద కష్టం కాదు. కాని దాని వల్ల గాలిలో వెచ్చని సంవహన తరంగాలు బయలుదేరి దూరదర్శిని గ్రహిస్తున్న చిత్రం విరూపం చెందుతుంది. కనుక చలికి ఓర్చుకుని పని చెయ్యాలి. ఈ ప్రయాస అంతా హుమాసన్ కి మహా ఆసక్తికరంగా అనిపించేది. అవన్నీ స్వయంగా చేసే అవకాశం వస్తే బావుంటుందని అనుకునే వాడు. ఆ అవకాశం త్వరలోనే వచ్చింది.
(సశేషం...)
(డా. రవిశంకర్ ప్రసంగంలో తరువాతి భాగం)
“అలాంటి శిక్షణతో పిల్లలు క్రమంగా ప్రయోగాలు చెయ్యడం నేర్చుకున్నారు. కాని ఇంకా ఒక సమస్య మిగిలిపోయింది. చేసిన ప్రయోగం ఎందుకు పని చేస్తోందో తమ సొంత మాటల్లో చెప్పమంటే చెప్పలేకపోయేవారు. ప్రయోగాలని ఎలా ప్రదర్శించాలో, ప్రదర్శించేటప్పుడు ఏం చెప్పాలో టీచర్లకి, మరి కొందరు వొలంటీర్లకి తర్ఫీదు ఇచ్చాం. కాని వీళ్లతోనూ అదే ఇబ్బంది! ప్రయోగం చేసేటప్పుడు ఏం చెప్పాలో బట్టీ పట్టి గడగడ ఒప్పచెప్పేస్తారు (“’ఒక బుడగలో గాలిని పూరించినచో...”), గాని ఆ చెప్తున్నదానికి, చూపిస్తున్న దానికి సంబంధం ఉందో లేదో గమనించరు. ఒకసారి అలగే ఒక హాస్యాస్పదమైన సంఘటన జరిగింది.””
““ఒక టీచరు ఒక ప్రయోగం చేసి చూపిస్తోంది. ఒక గల్లాని (గరాటు) నోట్లో పెట్టుకుని, వెడల్పుగా ఉండే గల్లా అవతలివైపు కిందికి తిరిగి ఉండేలా పట్టుకుని, దాని లోపల ఒక టీటీ బంతిని పట్టుకుని, ఇప్పుడు గల్లాలోకి గట్టిగా ఊదితే బంతి కిందపడకుండా గల్లాలోనే నిలిచిపోతుంది. ఒక టీచరు పై వివరణ చక్కగా ఇస్తూ, ఈ ప్రయోగం చేస్తుండగా బంతి కిందపడిపోయింది! ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆవిడ గడగడా చెప్పుకుపోయింది!”
“దీని వల్ల మళ్లీ మళ్ళీ మనకి కనిపించేది ఒక్కటే. వైజ్ఞానిక నియమాలు కేవలం టెక్స్ట్ పుస్తకాలకి, సైన్స్ టీచర్లకి పరిమితమైనవి కావు. దానిని ఎవరైనా స్వయంగా చేసి నిర్ధారించుకోవచ్చు. టిచర్లకి, పిల్లలకి ఈ విషయాన్ని బోధపరచడం చాలా కష్టం అని మాకు అర్థమయ్యింది.””
“సైన్స్ భావనలని బోధపరచడం, దాన్ని వివరించగలగడం ఇవీ అసలు సమస్యలు అనుకుంటే, వీటి అడుగున మరింత ప్రాథమికమైన సమస్య ఒకటుందని అర్థమయ్యింది. సైన్సు కన్నా ముందు అసలు భాష రావాలి. పుస్తకంలో ఉన్న సైన్సు విషయాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే అసలు ముందు చదవడం రావాలి. కొన్నేళ్ల క్రితం ’ప్రథమ్’ అనే ఎన్.జీ.ఓ. దేశవ్యాప్తంగా చేసిన సర్వే బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసొచ్చింది. ఐదో క్లాసు స్థాయిలో 50% పిల్లలకి మాతృభాషలో ఓ చిన్న వాక్యం కూడా చదవడం రాదని ఆ సర్వే సారాంశం. ఇక అలాంటి పిల్లలకి సైన్సు తెలిపేదెలా?”
అంత మాత్రం కూడా రాని పిల్లలని ఆ క్లాసు వరకు ఎలా రానిచ్చారు అని అడిగాడు శ్రోతల్లోని ఒక విద్యార్థి. దానికి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది –
“ఐదో క్లాసు వరకు పిల్లలని ఫెయిల్ చెయ్యకూడదు అన్న నియమం ఒకటి ఉంది. అంతకు ముందు సరిగ్గా చదవని పిల్లలని ఫెయిల్ చేసేసేవారు. ఆ విషయమై ఎంతో మంది తల్లిదండ్రులే కాక, విద్యావేత్తలు కూడా వ్యతిరేకించారు. ఒకటో క్లాసులోనే పిల్లవాణ్ణి ఫెయిల్ చెయ్యడంలో అర్థం ఏంటి? అని ప్రశ్నించారు. పిల్లవాడు ఓడిపోయాడు అని బడి వేసిన ముద్ర పిల్లవాణ్ణి చాలా క్రుంగదీస్తుంది. బడికి వచ్చి అలాంటి ముద్రతో బయటికి పోయే కన్నా, అసలు బళ్లో చేరకపోవడమే మేలు. ఈ దృష్టితో ఐదో క్లాసు దాకా పిల్లలని ఫెయిల్ చెయ్యకుండా ఉండే పద్ధతి మొదలయ్యింది.”
“ఈ ఒరవడి అలగే కొనసాగి హైస్కూల్ దశలో పిల్లల సామర్థ్యం ఎంత అధ్వానంగా ఉందో ఒక్కసారిగా బయటపడుతుంది. ముఖ్యంగా గణిత రంగంలో ఈ వెలితి బాగా కనిపిస్తుంది. ప్రథమ్ చేసిన సర్వేలో హై స్కూలు పిల్లలు కూడా చిన్న గణిత సమస్యలు కూడా చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారని తేలింది. ఉదాహరణకి ’దశాంశ స్థానం’ (ఒకట్ల స్థానం, పదుల స్థానం,...) అన్న భావన చాలా మంది పిల్లలకి అర్థం కాదు. ఉదాహరణకి,
34
+
28
=512
అని రాశారు చాలా మంది పిల్లలు. దానికి వారి తర్కం ఇలా ఉంటుంది: 4 + 8 = 12, 3+ 2 = 5. రెండిటినీ పక్కపక్కన పెడితే = 512.”
“పిల్లలకి 3 అన్న భావనని నేర్పించడానికి మూడు కుక్కలనో, పిల్లుల్నో చూపించొచ్చు. అలాగే 4 ని నాలుగు వస్తువులతో సూచించొచ్చు. కాని 34 వస్తువులని చూపిస్తే అందులో 3 ని, 4 ని చూపించడం కష్టం. దీనికీ కొన్ని ఆటలు, పద్ధతులు ఉన్నాయి...”
ఆ విధంగా సైన్సు, భాష, గణిత రంగాల్లో చిన్న పిల్లలు ఎదుర్కునే సమస్యలని వర్ణిస్తూ వచ్చారు. ఆ సమస్యల పరిష్కారంలో ఎయిడ్-ఇండియా చేస్తున్న కృషి గురించి కూడా కొంత వివరించారు.
ఇలాంటి వాళ్ల మాటలు వింటుంటే స్కూలు చదువు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఈ మధ్యనే ఇండియా గురించి ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ అన్న మాటలతో ఈ పోస్ట్ ని ముగిస్తున్నాను.
“Whereas in India [compared to China], all that is really needed, and I know this sounds terribly simplistic, is improving primary and secondary education for a majority of people and improving infrastructure. And then let the markets rip. Indians are very entrepreneurial. Everywhere you go, people are selling stuff, even if it is only a pile of spices. I think unlocking the entrepreneurial energy of India will lift a large number of people out of poverty.” Niall Ferguson (పూర్తి వ్యాసం కోసం- http://economictimes.indiatimes.com/opinion/interviews/India-holds-the-keys-to-success-Niall-Ferguson/articleshow/5496582.cms)
ప్రసంగం గురించి చెప్పే ముందు వక్త గురించి నాలుగు ముక్కలు.
ఐ.ఐ.టి చెన్నై లో బీటెక్ పూర్తి చేసిన డా. రవిశంకర్ అమెరికాలో కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పిహెచ్ డి పూర్తి చేసి, కొంత కాలం ఐబిఎమ్ లో పని చేసి 2003 లో ఇండియాకి తిరిగి వచ్చి తను చదువుకున్న ఐఐటి చెన్నైలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా ఎయిడ్ – ఇండియాలో సభ్యుడిగా పని చేస్తూ, ఇండియా వచ్చాక కూడా ఆ పనులు ముమ్మరంగా కొనసాగిస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం ఐఐటి ఉద్యోగాన్ని వొదిలిపెట్టి పూర్తిగా ఎయిడ్-ఇండియాలోనే చేరిపోయారు. విద్యారంగంలో ముఖ్యంగా గ్రామీణ విద్యాలయాలలో సైన్సు చదువులని మెరుగుపరచడంలో మంచి కృషి చేస్తున్నారు.
ప్రసంగంలోముఖ్యాంశాలు:
మన విద్యావ్యవస్థలో ముఖ్య సమస్యలు ఏమిటి? అన్న ప్రశ్నతో ప్రసంగం మొదలయ్యింది. శ్రోతలు అంతా మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులే కనుక ఉత్సాహంగా స్పందించి రకరకాల సమాధానాలు ఇచ్చారు – బట్టీ చదువు, టీచర్ల కొరత, పేదరికం, చదివిన చదువుకి ఉద్యోగాలు రాకపోవడం, చదివిన చదువుకు జీవితానికి సంబంధం లేకపోవడం ...మొదలైనవి.
దానికి స్పందనగా వక్త –
“ఉన్న ప్రభుత్వ స్కూళ్లు అన్నీ భర్తీ కావడం లేదు. ఈ మధ్య చెన్నైలో ఉన్న 335 ప్రభుత్వ స్కూళ్లలో 30 పైగా ముసేశారు, తగినంత ఎన్రోల్మెంట్ లేదని. పెద్దగా ఆర్థిక స్తోమత లేని వారు కూడా, తమ శక్తికి మించి ఖర్చు పెట్టి, పిల్లలని ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తున్నారు. (అలాగని ప్రైవేటు స్కూళ్లు అన్నిట్లో ప్రభుత్వ స్కూళ్లలో కన్నా చదువు మెరుగ్గా ఉంటుందని కూడా కాదు.) ప్రస్తుతం తమిళనాడులో ప్రాథమిక విద్యావ్యవస్థలో పిల్లల enrolment శాతం నమ్మలేనంత ఎక్కువ .... 98%. కాని హైస్కూల్ స్థాయికి వచ్చేసరికి ఆ శాతం సుమారు 60% కి పడిపోతుంది. అలా పడిపోవడానికి, తల్లిదండ్రులు తమ పిల్లలని బడి లోంచి బయటికి తీసేయడానికి ముఖ్య కారణం, పిల్లలకి బడులలో లభిస్తున్న చదువు మీద తల్లిదండ్రులకి నమ్మకం లేకపోవడమే. కనుక ప్రస్తుతం జరగాల్సినది స్కూళ్ల సంఖ్య పెంచడం, వసతులని పెంచడం మొ కాదు, చదువుని మరింత అర్థవంతంగా చెయ్యడం, పిల్లలకి మరింత అర్థమయ్యేలా చెయ్యడం!”
సైన్సు చదువులో సమస్యలు:
“సైన్సు చదువులో సైన్సు ప్రయోగాలు చాలా ముఖ్యం అని అందరికీ తెలిసిందే. కాని సైన్సు ప్రయోగాలు అనగానే పిల్లల్లకే కాక టీచర్లకి కూడా ప్రధానంగా ’వెర్నియర్ కాలిపర్స్’ లాంటి ప్రత్యేక వైజ్ఞానిక సామగ్రి గుర్తుకువస్తాయి. సరదాగా బుడగలతో, కాగితాలతో, సబ్బునీటితో, అద్దాలతో, అగ్గిపెట్టెలతో ఆడే ఆటలు సైన్సే కాదని వాళ్ల అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి మేం చాలా శ్రమపడాల్సి వచ్చింది”
(సశేషం...)





