భారీ ఎత్తున ఇనుప శస్త్రాలని సాధించిన మొట్టమొదటి సైన్యం అసీరియన్ సైన్యం. క్రీ.పూ. 900 నాటికే మరింత ఉన్నతమైన అస్త్రశస్త్రజాలం గల అసీరియన్లు ఓ మహాసమ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు.
గ్రీకు నాగరికత మహర్దశ చేరుకున్న నాటికే వాళ్లు రసాయనిక విద్యలలో ఆరితేరిపోయారు. ఈజిప్షియన్ నాగరికతలో కూడా రసాయనిక విద్యలలో అలాంటి సామర్థ్యమే కనిపిస్తుంది. ప్రాచీన ఈజిప్ట్ లో మరణానంతరం మృతదేహాలకి తగు లేపనాలు పూసి వాటిని దీర్ఘకాలం భద్రపరిచే ఆచారం ఒకటి ఉండేది. ఆ ప్రక్రియలో అధునాతనమైన రసాయనిక విజ్ఞానం అవసరమయ్యేది. లోహవిజ్ఞానంలో కూడా వారికి మంచి పాండిత్యం ఉండేది. ఆకుపసరుల నుండి, మొక్కల నుండి తీసే వివిధ రసాల నుండి, ఖనిజాల నుండి నానా రకాల అద్దకాలని తయారుచేయడంలో నైపుణ్యం ఉండేది.
ఖెమియా (khemeia) అన్న పదం ఈజిప్షియన్ ప్రాంతం అయిన ’ఖమ్’ (kham) నుండి వచ్చింది అని ఒక సిద్ధాంతం ఉంది. ఖెమియా అంటే “ఈజిప్షియన్ కళ” అని అర్థం కావచ్చు.
ఖెమియా అన్న పదం యొక్క వ్యుత్పత్తి విషయంలో మరో సిద్ధాంతం కూడా చలామణిలో ఉంది. మొదటి సిద్ధాంతం కన్నా దీనికి మరింత ఆదరణ ఉంది. ఖుమోస్ అన్న గ్రీకు పదానికి ఆకుపసరు అన్న అర్థం ఉంది. కనుక ఖెమియా అంటే “పసరు తీసే కళ” అని అనుకోవచ్చు. లేదా ఇక్కడ పసరు అంటే కరిగించిన లోహం కూడా కావచ్చు. అలా అనుకుంటే ఖెమియా అంటే “లోహవిజ్ఞానం” అన్న అర్థం వస్తుంది.
ఏదేమైనా ఈ ఖెమియా అన్న పదమే మన ఆధునిక chemistry అన్న పదానికి మూల శబ్దం అయ్యింది.
గ్రీకుల “మూల తత్వాలు”
క్రీ.పూ. 600 నాటికే సహజంగా ప్రతిభావంతులైన గ్రీకులు విశ్వం యొక్క తత్వం గురించి, పదార్థ లక్షణాల గురించి ఆలోచించసాగారు. గ్రీకు పండితుల, తాత్వికుల దృష్టి ఎక్కువగా విజ్ఞానం యొక్క లౌకిక ఫలితాల మీద ఉండేది కాదు. ప్రకృతి తీరు ఎందుకిలా ఉంది? విశ్వగతులు ఎందుకిలా ఉన్నాయి? ఈ “ఎందుకు?” అన్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలన్నదే వారి నిరంతర తపన. ఆధునిక పరిభాషలో “రసాయనిక సిద్ధాంతం”గా చెప్పుకుంటున్న దానికి తొలిరూపాన్ని ఇచ్చినవారు వీళ్లే.

అలాంటి సిద్ధాంతానికి మూలకర్త థేల్స్ (క్రీ.పూ. 640-546) అనే తాత్వికుడు. థేల్స్ కి ముందు పదార్థ లక్షణాల గురించి ఆలోచించిన గ్రీకులు ఉండి ఉండొచ్చు. అంతేకాదు. గ్రీకులకి ముందు ఇతర నాగరకతలకి చెందిన వారు కొందరు రసాయనిక విషయాలతో వ్యవహరించి ఉండొచ్చు. కాని వారి వివరాలు ప్రస్తుతం మనకి పెద్దగా తెలీదు. (ఉదాహరణకి ఇండియా, చైనా లకి చెందిన ప్రాచీన నాగరికతలలో కూడా రసాయన శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. కాని ఆధునిక రసాయన శాస్త్రానికి మొదటి బీజాలు ఈజిప్ట్ కి చెందినవి. ఈ పుస్తకంలో చర్చ ఆ సాంప్రదాయానికి మాత్రమే పరిమితమై ఉంటుంది.)
(సశేషం...)
ఈ కాంస్య యుగంలో సంభవించిన అతి ముఖ్యమైన సంఘటన ట్రోజన్ యుద్ధం (Trojan war). ఈ యుద్ధంలో కంచు కవచాలు ధరించిన సిపాయిలు కంచు మొనలు గల శూలాలని ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. లోహపు ఆయుధాలు లేని సేనలు ఈ కాంస్య యోధులని ఎదుర్కుని నిలవలేకపోయాయి. కనుక ఈ రోజుల్లో ఓ అణుశాస్త్రవేత్తకి ఉండే గౌరవ మర్యాదలు ఆ రోజుల్లో లోహకారులకి ఉండేవని ఊహించుకోవచ్చు. లోహకారుణ్ణి ఓ దేవుడిలా కొలిచేవారేమో. గ్రీకు పురాణాల్లో హెఫాయెస్టర్ అనేవాడు దేవతల లోహకారుడు. అందుకే నేటికీ యూరప్ లో ’స్మిత్’ (Smith) అనేది ఓ ప్రముఖమైన ఇంటిపేరు కావడంలో ఆశ్చర్యం లేదు.
కంచు యుగంలోనే మనుషులు కంచు కన్నా కఠినమైన మరో లోహం గురించి తెలుసుకున్నారు. అదే ఇనుము. అయితే భారీ ఎత్తున కవచాల్లో వాడేటంత విరివిగా అది లభ్యం అయ్యేది కాదు. తొలి దశల్లో అది నిజంగానే అరుదుగా దొరికేది. ఎక్కడైనా ఉల్కాపాతం జరిగినప్పుడు ఆ విరిగి పడ్డ ఉల్కముక్కల్లో కాస్తంత ఇనుము దొరికేది. రాతి నుండి రాగిని వెలికి తీసినట్టు ఇనుముని కూడా సహజ వస్తువుల నుండి వెలికి తీయడం ఎలాగో ఆరోజుల్లో ఎవరికీ తెలీదు.
ఇక్కడ సమస్య ఏంటంటే రాగి కన్నా ఇనుము ముడిఇనుములో బలంగా నాటుకుని ఉంటుంది. ముడి ఇనుము నుండీ ఇనుము వెలికి తియ్యడానికి, రాగిని వెలికి తియ్యడానికి అవసరమైన వేడిమి కన్నా మరింత తీక్షణమైన వేడిమి కావాలి. అందుకు కేవలం కట్టె నుండి పుట్టే వేడి సరిపోదు. బొగ్గు నుండి పుట్టే నిప్పు అంతకన్నా వేడిగా ఉంటుందని తరువాత కనుక్కున్నారు. అయితే బొగ్గు నుండి అంత వేడిని పుట్టించడానికి సరైన వాయు సంచారం (ventilation) కావాలని కనుక్కున్నారు.
ముడి ఇనుముని కరిగించి ఇనుమును తయారుచేసే రహస్యాన్ని బహుశ తూర్పు ఆసియా మైనర్ లో క్రీ.పూ. 1500 ప్రాంతాల్లో కనుక్కుని ఉంటారు. ఆశియా మైనర్ లో ఓ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన ఓ తెగ వారు హిటైట్లు (Hittites). ఇనుముని పనిముట్లుగా పరిపాటిగా వాడిని వారిలో వీళ్లు ప్రథములు. క్రీ.పూ. 1280 లో ఓ హిటైట్ రాజు ముడిఇనుము విరివిగా దొరికే ఓ పర్వత ప్రాంతానికి చెందిన తన సామంత రాజుకి రాసిన ఉత్తరంలో ఇనుము ఉత్పత్తికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.
శుద్ధ రూపంలో ఉండే ఇనుము (wrought iron) అంత బలంగా ఉండదు. అయితే ఇనుముని కాల్చుతున్నప్పుడు ఆ కాలుస్తున్న బొగ్గులోంచి కొంత కార్బన్ ఇనుము యొక్క ఉపరితలంలోకి ప్రవేశించి అక్కడ ఇనుము-కార్బన్ ల మిశ్రలోహం ఏర్పడవచ్చు. ఇనుము-కార్బన్ ల మిశ్రలోహాన్నే ప్రస్తుతం మనం స్టీల్ అంటాము. అలా కర్బన్, ఇనుము కలిసిన ఇనుప వస్తువు యొక్క పైపొర కంచు కన్నా చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి పైపూత కలిగిన కత్తి వాదర కూడా సామాన్యంగా కన్నా మరింత ఎక్కువ కాలం పదునుగా ఉంటుంది.
ఆ విధంగా హిటైట్ల కాలంలో కనుగొనబడ్డ స్టీల్ ఉత్పత్తి రహస్యం ఇనుము యొక్క చరిత్రలో ఓ ముఖ్యమైన మైలురాయి అనుకోవచ్చు. ఇనుప కవచాలు ధరించి, ఇనుప ఈటెలు చేతబట్టిన వీరుల చేతిలో కేవలం కంచు కవచాలు, కత్తులు కలిగిన సేనలకి ఓటమి తప్పదు. ఆ విధంగా ఇనుప యుగం ఆరంభం అయ్యింది.
క్రీ.పూ. 1100 ప్రాంతాల్లో గ్రీక్ డోరియన్లు అనబడే ఓ కిరాతక గ్రీకు తెగ ఉత్తర భాగం నుండి ద్వీపకల్పాన్ని ముట్టడించింది. ఆ కాలంలో గ్రీకు ప్రాంతంలో మరింత నాగరికులైన మైసినేయియన్ గ్రీకులు జీవించేవారు. అయితే వీరికి కేవలం కంచు ఆయుధాలు మాత్రమే ఉండేవి. వీరికి ఇనుము గురించి తెలీదు. అలా వారిని చుట్టుముట్టిన గ్రీకు తెగలలో కొందరు కనాన్ వరకు చొచ్చుకుపోయారు. వారితో తమ ఇనుప పరిముట్లని కూడా తీసుకుపోయి ఆయా ప్రాంతాల్లో ఆ పనిముట్లని పరిచయం చేశారు. అలా వచ్చిన వాళ్లే ఫిలిస్టయిన్లు. బైబిల్ కథలలో ఈ ఫిలిస్టయిన్లకి ముఖ్యమైన స్థానం ఉంటుంది. వీరి ధాటి ముందు ఇనుము వినియోగం తెలియని యూదులు నిలబడలేకపోయారు. తదనంతరం సాల్ మహారాజు నేతృత్వంలో యూదుల చేతికి ఇనుప శస్త్రాలు చిక్కాకనే వారి రాతలు మారాయి.
(సశేషం...)
అయితే ఆ అందమైన రాళ్లలో లేనిది, లోహాలలో ఉన్నది అయిన ఓ ముఖ్య లక్షణం ఒకటుంది. రాగి, బంగారాలకి “నమ్యత” (malleability) అనే గుణం ఒకటి ఉంది. లోహాలని వేడి చేసి, ఒత్తిడి చేసి వాటిని చదునుగా పలకల లాగా సాగదీయొచ్చు. (రాళ్లతో అలా వ్యవహరిస్తే పొడి అవుతాయి. చెక్కనిగాని, ఎముకని గాని అలా చేస్తే చిట్లి పోతాయి. మొదట్లో ఈ ఆవిష్కరణ కేవలం యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది. కాని త్వరలోనే ఈ లోహాన్ని అందమైన ఆకృతులుగా ఎలా మలిచి తనకి అలంకారంగా ఎలా వాడుకోవాలో నేర్చుకుని ఉంటాడు.
రాగితో పని చేసే వాళ్లకి త్వరలోకే రాగికి ఓ అద్భుతమైన లక్షణం ఉందని అర్థమయ్యింది. రాగిని కూసుగా మలచి దాన్నో ఆయుధంగా వాడుకోవచ్చు. రాతి పనిముట్లు మొద్దుబారే పరిస్థితుల్లో కూడా ఈ రాగిపనిముట్లు తమ పదునును కోల్పోవు. అంతే కాక రాగి అంచు ఒకసారి మొద్దుబడ్డా, రాతి పనిముట్ల కన్నా రాగిని మరింత సులభంగా పదును చెయ్యొచ్చు. అయితే రాగి కొంచెం అరుదుగా దొరుకుతుంది కనుక తొలిదశలలో దాన్ని అలంకారానికి తప్ప పనిముట్లుగా వాడడం జరగలేదు.
రాగి శూద్ధ రూపంలోనే కాక మిశ్రమ రూపాల్లో కూడా దొరుకుతుందని తెలిశాక దాని ఉత్పత్తి మరింత పెరిగింది. రాతిని నుండి కూడా దాన్ని వెలికి తియ్యొచ్చునని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మొట్టమొదట ఎవరు కనుక్కున్నారో మనకి తెలీదు.
బహుశ ఆ ఆవిష్కరణ ఇలా జరిగి ఉండొచ్చని మనం ఊహించవచ్చు. ఏ అడవిలోనో అకస్మాత్తుగా ఎండు కట్టె నిప్పు అంటుకుని ఉంటుంది. ఆ నిప్పు పుట్టిన నేలలో కొన్ని నీలి రంగు రాళ్లు ఉండి ఉండొచ్చు. నిప్పు చల్లారాక ఆ బూడిద అడుగున మెరిసే రాగి కణికలు కనిపించి ఉండొచ్చు. బహుశ ఇలా ఎన్నో సార్లు జరిగి ఉండొచ్చు. ఇలా పదే పదే జరగడం చుశాక ఒక రకమైన నీలి రాళ్లని కాల్చి రాగి తయారు చెయ్యొచ్చని మనుషులు గ్రహించి ఉంటారు. ఈ ఆవిష్కరణ ప్రధానంగా క్రీ.పూ. 4000 దరిదాపుల్లో జరిగి ఉండొచ్చు. ఈజిప్టు కి తూర్పున సీనాయ్ ద్వీపకల్పంలోనో, లేదా ఆధునిక ఇరాన్ లోని సుమేరియాలో తూర్పు భాగంలోన పర్వత ప్రాంతంలోనో జరిగి ఉండొచ్చు. బహుశ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా రెండు చోట్లా వేరు వేరుగా ఆ ఆవిష్కరణ జరిగి ఉండొచ్చు.

క్రీ.పూ. 8000 లో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది. అంత వరకు మనిషి రాతియుగంలోనే ఉన్నాడు. ఆ పరిణామం ఆహారోత్పత్తికి సంబంధించినది. ప్రస్తుతం మనం మిడిల్ ఈస్ట్ అని పిలుచుకునే ప్రాంతంలో జరిగిందది. అంతవరకు మనిషి కూడా జంతువుల లాగే ఇతర జంతువులని వేటాడి ఆహారాన్ని సంపాదించేవాడు. క్రీ,పూ. 8000 నుండి మనిషి జంతువులని పెంచి, పోషించి సకాలంలో వాటిని ఆహారంగా వాడుకోవడం నేర్చాడు. అలాగే కేవలం ప్రకృతిలో సహజంగా పెరిగే మొక్కల మీద ఆధారపడడం కాకుండా, తనే మొక్కలు పెంచి వాటి నుండి ఆహారాన్ని సంపాదించేవాడు. ఆ విధంగా పశుసంరక్షణ, సేద్యం వంటి సాంప్రదాయాలు మొదలయ్యాయి. ఈ కొత్త పద్ధతుల వల్ల ఆహారోత్పత్తి గణనీయంగా పెరిగింది. దాంతో జనాభా కూడా అమితంగా పెరిగింది. సేద్యం చేసే మ
నిషి దేశదిమ్మరిలా బతికితే కుదరదు. ఒక చోట స్థిరంగా జీవించాలి. దాంతో స్థిరనివాసాలు ఏర్పడ్డాయి. ఊళ్లు, వాడలు వెలిశాయి. ఆ పరిణామంతో నాగరికత అనేది మొదలయ్యింది. నగరాలు నిర్మించడంతో మొదలయ్యింది కనుకనే దాన్ని ’నాగరి’కత అంటాం.
మొదట కొన్ని వేల ఏళ్ల కాలం వరకు కూడా పనిముట్లు తయారుచేసుకోవడానికి ఎక్కువగా రాతినే వాడుతూ వచ్చారు. అయితే ఆ పనిముట్ల తయారీలో కొన్ని కొత్త పద్ధతులు రూపొందించుకున్నారు. ఈ ’కొత్త రాతి యుగాన్ని’ Neolithic (neo = కొత్త, lith = రాయి)’ యుగం అంటారు. రాతిని నునుపుగా చెక్కి, తీరుగా మలచగలగడం ఈ యుగం యొక్క ఒక ప్రత్యేక లక్షణం. ఈ దశలో కుమ్మరి వృత్తి కూడా బాగా వృద్ధి చెందింది. నెమ్మదిగా ఈ కొత్తరాతి యుగంలో మొదలైన సత్పరిణామాలు మిడిల్ ఈస్ట్ లో వాటి జన్మస్థానం నుండి నలు దిశలా విస్తరించడం మొదలెట్టాయి. క్రీ.పూ. 4000 కాలానికి మొట్టమొదటి నాగరికతా ఛాయలు పాశ్చాత్య యూరప్ మీద కనిపించసాగాయి. ఈ కాలానికల్లా మిడిల్ ఈస్ట్ కి చెందిన ఈజిప్ట్, సుమేరియా (ఈ ప్రాంతం ఆధునిక ఇరాన్ దేశంలో ఉంది) మొదలైన ప్రాంతాల్లో మరింత ఉన్నతమైన పరిణామాలు రంగప్రవేశం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి.
మానవజాతి మరి కొంచెం అరుదైన పదార్థాల వినియోగం గురించి తెలుసుకుంది.ఈ కొత్త పదార్థాలు ఇచ్చే సత్ప్రయోజనాల కోసం మనుషులు వాటి కోసం ఎంతో గాలించారు, వాటిని ఎలా వాడాలో తెలుసుకోడానికి విపరీతంగా శ్రమపడ్డారు. అలా కనుక్కోబడ్డ పదార్థాలే లోహాలు (metals). అన్వేషణ అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఈ metal అన్న పదం వచ్చింది.
(సశేషం...)
అధ్యాయం 1
ప్రాచీనులు
1. నిప్పు – రాయి
అప్పుడప్పుడే పనిముట్లని వాడడం నేర్చుకుంటున్న ఆదిమానవుడు, ప్రకృతిలో సహజంగా దొరికే వస్తువులనే వాడేవాడు. పెద్ద జంతువుల తుంటి ఎముకలు, చెట్ల కొమ్మలు, పదునైన రాళ్లు – ఇవే అతడి అస్త్రశస్త్రాలు. కాలక్రమేణా రాళ్లని చెక్కి, కోయడానికి పదునైన వాదర, పట్టుకోడానికి అనువైన పిడి కలిగేలా వాటిని మలచడం నేర్చుకున్నారు. మరి కొంత కాలం పోయాక ఆ రాళ్లని చెక్కతో చేసిన ఒరలో ఇమడ్చడం నేర్చుకున్నారు. ఇన్ని చేసినా ఆ రాయి రాయిగానే ఉండిపోయింది, చెక్క చెక్కగానే ఉండిపోయింది.

కాని కొన్ని సందర్భాల్లో వస్తువుల లక్షణాలు అనుకోకుండా మారుతాయి. అడవిలో పిడుగు పడి ఎండుచెట్లు భగ్గున నిప్పంటుకోవచ్చు. చెట్టు ధగ్ధం కాగా మిగిలిన నల్లని బూడిదకి, అంతకు ముందు ఉన్న చెట్టులోని కట్టెకి మధ్య పోలికే కనిపించకపోవచ్చు. అలాగే ఊరికే గాలికి వొదిలేసిన మాంసం కొంతకాలానికి కుళ్ళు కంపుకొడుతుంది. నిలవబెట్టిన పళ్లరసం పులిసిపోవచ్చు, లేదా మత్తెక్కించే పానీయంగా మారనూవచ్చు.
అలా పదార్థపు లక్షణాల్లో వచ్చే కొన్ని మౌలికమైన మార్పులు మనం రసాయనిక శాస్త్రం అనే ఈ శాస్త్రంలో ప్రధానాంశం. అలాంటి మార్పులు పదార్థంలోని సూక్షాంశాల స్థాయిలో జరుగుతాయని మనకిప్పుడు తెలుసు. పదార్థం యొక్క తత్త్వంలోను, సూక్ష్మ నిర్మాణం లోను వచ్చే ఈ మౌలికమైన మార్పునే రసాయనిక మార్పు అంటారు.
మానవుడు నిప్పుని కనుక్కున్న తరువాత అతడి జీవన పరిస్థితులు ఎంతగానో మారాయి. ముఖ్యంగా నిప్పుని కృత్రిమంగా రాజేసి, ఆ నిప్పును ఆరకుండా స్థిరంగా ఇంట్లో నిలుపుకోవడం నేర్చుకున్నాకనే రసాయనిక మార్పులని తన సొంత మేలుకు వాడుకోవడం మొదలయ్యింది. అగ్నితో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్న మనిషి రసాయన శాస్త్రంలో మొదటి పాఠాలు నేర్చుకున్నట్టే. ఎందుకంటే నిప్పు పుట్టించాలంటే కట్టెని ఎలా కాల్చాలో తెలియాలి. కట్టెను కాల్చి దాని నుండి వేడిమిని, ప్రకాశాన్ని పుట్టించాలంటే కట్టెకి గాలికి మధ్య సంపర్కం ఎంత గాఢంగా ఉండాలో తెలియాలి. కట్టెకి, గాలికి మధ్య సంపర్కంలోని గాఢతను బట్టి ప్రకాశం, వేడి పుడుతుందా, లేక బూడిద, పొగ, ఆవిరి పుడతాయా అన్న విషయం బాగా తెలియాలి. అంటే కట్టెను ముందు బాగా ఎండబెట్టాలి. అందులో కొంత భాగాన్ని పొడిచేసి సులభంగా నిప్పు అంటుకునే పొట్టుగా మార్చాలి. అప్పుడు రాళ్ల మధ్య రాపిడిని ఉపయోగించి ఆ పొట్టు యొక్క ఉష్ణోగ్రతని తగినంత మేరకు పెంచాలి. నిప్పు అలా రాజేయాలి.
అలా పుట్టించిన నిప్పుతో మరిన్ని రసాయన చర్యలు సాధించొచ్చు. నిప్పుతో అన్నం వండుకోవచ్చు. నిప్పు ప్రభావం వల్ల అన్న యొక్క రూపురేఖలు మారతాయి. అన్నం మెత్తబడుతుంది. రుచిగా మారుతుంది. నిప్పుని ఉపయోగించి బంకమట్టితో ఇటుకలు చెయ్యొచ్చు, కుండలు తయారు చెయ్యొచ్చు. తదనంతరం పింగాణీ, తదితర రకాల గాజులని తయారుచెయ్యడానికి వీలయ్యింది.
మనిషి తన దినచర్యలో వాడడం నేర్చుకున్న మొట్టమొదటి పదార్థాలు తన చుట్టూ రోజూ సహజంగా కనిపించే పదార్థాలే. అంటే చెక్క, ఎముకలు, చర్మం, రాళ్లు మొదలైనవి అన్నమాట. వీటన్నిట్లోకి అత్యధిక ఆయుర్దాయం ఉన్న పదార్థం రాయి. అందుకే ఆదిమానవుడు వాడిన రాతిపనిముట్లు ఇప్పటికీ తవ్వకాలలో చెక్కుచెదరకుండా దొరుకుతున్నాయి. అందుకే ఆ కాలాన్ని మనం రాతి యుగం అంటాం.
(సశేషం...)
ప్రియమైన బ్లాగర్లూ,
Isaac Asimov రాసిన A short history of Chemistry ని ఇప్పట్నుంచి సీరియల్ గా పోస్ట్ చేద్దామని ఉద్దేశం.
సామాన్యంగా స్కూళ్ళలో కెమిస్ట్రీ చెప్పే తీరు ఆ సబ్జెక్ట్ అంటే ఏవగింపు కలిగించేలా ఉంటుంది. మరి ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించే అవకాశం లేకుండా, విషయాలని తీరిగ్గా ఆలోచించి, ఆరగించుకునే వ్యవధి లేకుండా ఉన్నప్పుడు ఏ రంగమైనా బోరు కొడుతుంది, కంఫు కొడుతుంది.
ఏ రంగంలోనైనా ఆ రంగంలోని సత్యాలని మొట్టమొదట ఎలా కనుక్కున్నారు, ఎంత శ్రమపడి కనుక్కున్నారు, అంతకు ముందు ఆ రంగం గురించి మనుషుల అవగాహన ఎలా ఉండేది, ఎవరెవరు ఎంతెంత మేరకు ఆ రంగాన్ని పురోగమింపజేశారు మొదలైన విషయాలు – ఒక్కమాటలో చెప్పాలంటే విజ్ఞాన చరిత్ర – తెలిస్తే ఆ రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మనిషి ఇంకా చందమామ మీద కూడా పాదం మోపని రోజుల్లోనే, భవిష్యత్తులో కొన్ని వేళ ఏళ్ల తరువాత మనుషులు పాలపుంత గెలాక్సీ అంతా విస్తరించిన ఓ గెలాక్టిక్ మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపిస్తారో ఊహించిన రాసిన ప్రతిభాశాలి అసిమోవ్ కి, కొన్ని వేల ఏళ్ల క్రితం మనుషులు రసాయనిక విద్యని ఎలా రూపొందించారో వర్ణించడం పెద్ద కష్టం కాదు. ఈ పుస్తకంలో రాతియుగం, లోహపు యుగం మొదలైన ప్రాథమిక ఆరంభదశలతో మొదలుపెట్టి, ఆధునిక కేంద్రక విజ్ఞానం వరకు రసాయన శాస్త్రం ఎలా అభివృద్ధి చెందిందో తనదైన శైలిలో వర్ణించుకొస్తాడు అసిమోవ్.
పేరుకి short history అన్నాడు గాని ఇది 278 పేజీల పుస్తకం. వీలైనంత కాలం, వీలైనంత మేరకు దీన్ని సీరియల్ గా పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
సైన్స్ అనేది కేవలం “సైన్స్ గ్రాడ్యుయేట్ల”కి మాత్రమే కాదని. అది అందరికీ సంబంధించినది అని మేము నమ్ముతాం. అందుకే ఈ బ్లాగులోని అంశాలు అన్ని వర్గాల వారికి ఆసక్తి ఉండేలా ఎంచుకోవడం జరుగుతుంది. కాని ప్రత్యేకించి ఈ బ్లాగ్ లోని వ్యాసాలు హైస్కూల్ స్థాయిలో ఉన్న తెలుగు మీడియమ్ పిల్లలకి అందుబాటులో ఉంటే బావుంటుందని మా ఆశ. ఎందుకంటే సైన్స్ అంటే ఆసక్తి కలగాలంటే అదే మంచి వయసు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన పల్లె బడులలో కంప్యూటర్ వసతులు పెద్దగాలేవని మనకి తెలిసిందే. అయితే భవిష్యత్తులో (మరో రెండు మూడేళ్లలో) ఆ పరిస్థితులు మారొచ్చని, అప్పటికి ఇలాంటి బ్లాగ్ లు ఆ పిల్లలకి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఈ ’రసాయనిక చరిత్ర” కూడా ఆ వర్గం పిల్లలకి ఉపయోగపడే పుస్తకాల్లో ఒకటి.
వచ్చే పోస్ట్ నుండి సీరియల్ ప్రారంభం...
ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత వాతావరణంలో ఫిబ్రవరి 1633 లో గెలీలియో రోమ్ లోకి ప్రవేశించాడు. నగరంలోకి అడుగుపెట్టగానే రాజభటులు తనకి సంకెళ్ళు వేసి బరబర లాక్కెళతారని ఊహించాడు. కాని అలంటిదేం జరగలేదు. టస్కనీ ప్రాంతానికి చెందిన వాడు కనుక మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలో కొంత కాలం అతిథిగా ఉన్నాడు. ఇతర అతిథులతో సమానంగానే తనకీ మర్యాదలు జరిగాయి. అయితే ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజుల్లో చాలా బాధపడేవాడు. ఆర్త్ రైటిస్ వల్ల కీళ్లు బాగా నొప్పి పుట్టేవి. ఆ బాధకి రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. బాధ భరించలేక గట్టిగా రోదించేవాడు. ఇలా కొన్ని రోజులు సాగాయి.
ఏప్రిల్ నెలలో న్యాయవిచారణ మొదలయ్యింది. ఇంతకీ చేసిన నేరం ఏంటయ్యా అని చూస్తే న్యాయమూర్తులకి పెద్దగా ఏమీ దొరకలేదు. మొదటి తప్పు - తన భావాలు నలుగురికీ అర్థం కావాలని లాటిన్ కి బదులుగా ఇటాలియన్ లో పుస్తకాలు రాయడం. ’మతవిరోధి, పచ్చి తగవుల కోరు, కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేవాడు’ అయిన విలియమ్ గిల్బర్ట్ ని పొగుడుతూ గెలీలియో ఒక చోట రాశాడు. ఇది రెండవ తప్పు. అయితే ఇవి రెండూ కాస్త చిన్న విషయాలేనని కొట్టిపారేయొచ్చు. కాని కాస్త కీలకమైన సమస్య మరొకటి ఉంది. కోపర్నికస్ భావాలని బోధించకూడదు అన్న మతపరమైన నిషేధాన్ని ఉల్లంఘించడం – ఇది అసలు తప్పు. ఒకసారి న్యాయవిచారణ మొదలయ్యాక ఏదో ఒక నేరం కింద గెలీలియోని ఇరికించి, భవిష్యత్తులో ఆ తప్పు మరొకరు చెయ్యడానికి భయపడేలా శిక్షించాల్సిందే. ఎందుకంటే న్యాయవిచారణలో గెలీలియో నిరపరాధి అని తేలితే, న్యాయమూర్తులకే ముప్పు. అన్యాయంగా ఆరోపించినందుకు శిక్ష వాళ్లకి పడుతుంది! కనుక ఎలాగైనా గెలీలియోకి శిక్షపడేలా చెయ్యాలని కాథలిక్ చర్చి అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు.
ఈ సమయంలో గెలీలియో స్నేహితుడైన కార్డినల్ బర్బెరీనీ ఎంతో సహాయం చేశాడు. గెలీలియో శిక్ష తగ్గడానికి శతవిధాల ప్రయత్నించాడు. తప్పు చెయ్యకపోయినా తప్పు ఒప్పుకొమ్మని గెలీలియోని ప్రాధేయపడ్డాడు. లేకపోతే గెలీలియోకి చిత్రహింస తప్పదన్న వాస్తవాన్ని వివరించాడు. గెలీలియోకి తన దయనీయమైన పరిస్థితి స్పష్టంగా అర్థమయ్యింది. ఇకి విధిలేక రాజీకి ఒప్పుకున్నాడు. కోపర్నికస్ బోధనలని తన పుస్తకంలో వివరంగా వర్ణించడం తను చేసిన పెద్ద పొరబాటని ఒప్పుకున్నాడు. వైజ్ఞానిక భావాలని అందంగా, విపులంగా వ్యక్తం చెయ్యడంలో తన నైపుణ్యాన్నిప్రదర్శించుకోవాలన్న మితిమీరిన అహంకారంతోనే అలా రాశానన్నాడు. అందుకు మనస్పూర్తిగా పశ్చాత్తాప పడుతున్నానన్నాడు. ’నా తప్పిదాలను నేనే ఖండిస్తున్నాను, శపిస్తున్నాను, గర్హిస్తున్నాను’ అంటూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేయని తప్పుని పూర్తిగా ఒప్పుకున్నాడు. ఆధునిక భౌతికశాస్త్రానకి ఓనమాలు దిద్దించిన ఆ మొదటి గురువు, తను చేసిన ’తప్పు’కి అపరాధిలా తలవంచకుని నిలబడ్డాడు.
ఈ వృత్తాంతానికి చిన్న కొస మెరుపు ఒకటి ఉంది. మహాభారత యుద్ధంలో ధర్మరాజు “అశ్వత్థామ హత:” అని బిగ్గరగా అని, “కుంజర:” అని నెమ్మదిగా అన్నట్టు, ఈ సందర్భంలో గెలీలియో తన అపరాధాలని ఒప్పుకుంటూ బిగ్గరగా ఆ సుదీర్ఘమైన ప్రకటన చదివి, చివర్లో “ eppur, si muove (కాని అది కదులుతోందిగా...)” అని మెల్లగా, బయటికి వినిపించకుండా అనట్టు చెప్పుకుంటారు. అది గాని బయటికి వినిపించి ఉంటే శిర:ఖండన ఖాయం. అదీ కాకపోతే కట్టెకి కట్టి బహిరంగ దహనం చేసి ఉండేవారేమో. కాని గెలీలియో నిజంగా అలా అన్నాడా లేదా అన్న విషయం మీద కొంత వివాదం ఉంది.
గెలీలియో మీద విజయం సాధించినందుకు జెసూట్ లు సంబరపడిపోయారు. ఇక శిక్ష ప్రకటించడమే తరువాయి. గెలీలియోకి యావజ్జీవ కారాగార శిక్ష తప్పేలా లేదు. న్యాయవిచారణ జరిపిన పది మంది న్యాయమూర్తుల్లో ఏడుగురే శిక్షని ఆమోదించారు. మిగతా ముగ్గురూ ఆ పత్రం మీద సంతకం చెయ్యలేదు. ఆ ముగ్గురిలో చిరకాల స్నేహితుడైన బర్బరీనీ కూడా ఉన్నాడు. బర్బరీనీ ప్రమేయం వల్లనే మొదట్లో శిక్ష జారీ అయినా, అమలు చెయ్యడంలో దాన్ని బాగా బలహీన పరిచారు. మొదట్లో రోమ్ లోని టస్కనీ దౌత్యాలయంలోనే కొంత కాలం నిర్బంధించారు. 1634 నుండి మాత్రం ఆర్సెట్రీ నగరంలో ఉన్న గెలీలియో సొంత ఇంట్లోనే నిర్బంధిస్తూ శిక్షవిధించారు. ఇక జీవితాంతం ఆ ఇల్లు, పరిసర ప్రాంతాలు విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని నిర్బంధం. చివరికి వైద్య చికిత్స కోసం ఫ్లోరెన్స్ నగరానికి వెళ్లడానికి కూడా అనుమతి దొరకలేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా గెలీలియో తన పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. దూరదర్శిని వినియోగం మరీ ఎక్కువ కావడం వల్లనేమో, చివరి రోజుల్లో 1637 కల్లా పూర్తిగా గుడ్డివాడు అయిపోయాడు. అలా కొన్నేళ్లపాటు నరకయాతన అనుభవిస్తూ ఆ మహా మేధావి జనవరి 8, 1642, లో కన్నుమూశాడు.
References:
1. Simon Singh, Big Bang, Harper Perennial, 2004.
2. John Gribbin, Science: A history, Penguin, 2003.
3. http://www.vias.org/physics/bk1_05_01.html
4. http://cnx.org/content/m11932/latest/
5. http://cnx.org/content/m11932/latest/g_telescope.gif
6. http://galileo.rice.edu/lib/student_work/astronomy95/moon.html
7. https://ca-science7.wikispaces.com/file/view/Sun_spots.gif/34504237/Sun_spots.gif
8. http://upload.wikimedia.org/wikipedia/commons/8/87/Jupitermoon.jpg
9. http://www.scienceandyou.org/articles/ess_16.shtml
10. http://en.wikipedia.org/wiki/Giordano_Bruno
11. http://www.chrismadden.co.uk/meaning/galileo-pope-church.html
12. http://en.wikipedia.org/wiki/Dialogue_Concerning_the_Two_Chief_World_Systems
గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికి యూరప్ లో ’ముప్పై ఏళ్ల యుద్ధం’ ఉధృతంగా కొనసాగుతోంది. 1618 లో మొదలైన యుద్ధం మూడు దశాబ్దాల పాటు అంటే 1638 వరకు సాగింది. ఈ యుద్ధానికి ఒక ఏకైక కారణం ఆంటూ ఏమీ లేదు. అయితే కాథలిక్కులకి, ప్రొటెస్టంట్ లకి మధ్య మతకలహం ఈ యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. 1618 లో జరిగిన ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రాగ్ నగరంలో కొంతమంది ప్రొటెస్టంట్ లు రాజగృహంలోకి జొరబడి ఇద్దరు అధికారులని పై అంతస్థు కిటికీ లోంచి బయటికి విసిరేశారు. దీన్నే ప్రాగ్ నగరపు నిర్గవాక్షీకరణ (Defenestration of Prague, fenestra అంటే కిటికీ) అంటారు. ప్రొటెస్టంట్ల మీద పదే పదే జరుగుతున్న అత్యాచారాలకి నిరసనగా వాళ్లు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టారు. దాంతో రెండు మతవర్గాల మధ్య యుద్ధ జ్వాల భగ్గు మంది. ఈ యుద్ధంలో యూరప్ లో అపారమైన జన నష్టం, ధన నష్టం జరిగింది. క్షామం విలయతాండవం చేసింది.
గెలీలియో పుస్తకం ప్రచురితం అయిన నాటికే యుద్ధం పద్నాలుగేళ్లుగా నడుస్తోంది. అలాంటి నేపథ్యంలో కాథలిక్ వర్గం యొక్క అధిపత్యాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోప్ అర్బన్ VIII మీద పడింది. కాథలిక్కుల ప్రతినిధిగా తన పెత్తనం కొనసాగాలంటే ప్రొటెస్టంట్ల విప్లవాన్ని ఎలాగైనా అణచాలి. ముందుగా కాథలిక్ మతానికి విరుద్ధంగా మాట్లాడే గొంతికలని మూయించాలి. కనుక కాథలిక్ మతానికి విరుద్ధమైన ప్రచారాన్ని బహిష్కరిస్తూ, అలాంటి ప్రచారానికి తీవ్ర దండన ప్రకటించాడు. మతం సమర్ధించే పృథ్వీ కేంద్ర సిద్ధాంతానికి వ్యతిరేక ప్రచారం మీద వేటు వేయాల్సిన అవసరం కనిపించింది.
అయితే పోప్ అలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వ్యక్తిగతమైన కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. పెరుగుతున్న గెలీలియో పరపతికి ఓర్వలేని కొందరు ఆస్థాన ఖగోళశాస్త్రవేత్తలు గెలీలియో మీద లేని పోని చాడీలు చెప్పసాగారు. పోప్ తెలివితేటలని కించపరుస్తూ గెలీలియో తన పుస్తకంలో ఎన్నో విసుర్లు విసిరాడని చెప్పారు. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. సర్వశక్తివంతుడైన దేవుడు భౌతిక ధర్మాలకి అతీతంగా విశ్వాన్ని సృష్టించాడని పోప్ ఎన్నో చోట్ల చాటుతూ వచ్చాడు. ఈ విషయం గురించే గెలీలియో “సంవాదాల”లో ఒక చోట పండితుడైన సాల్వియాటీ, మూఢుడైన సింప్లీసియోతో హేళనగా ఇలా అంటాడు: “అవున్లే! దేవుడు తలచుకుంటే పక్షుల అస్తిపంజరాలలో ఎముకకి బదులు బంగారం ఉండేదేమో, వాటి రక్తనాళాలలో పాదరసం ప్రవహించేదేమో, వాటి మాంసం సీసం కన్నా బరువుగా ఉండేదేమో! చిట్టి చిట్టి రెక్కలతో ఆకాశంలో అంతెత్తున సునాయాసంగా ఎగిరేవేమో! కాని దేవుడు అలా చెయ్యలేదు. దీన్ని బట్టి నీకో విషయం అర్థం కావాలి. అది తెలుసుకోడానికి ప్రయత్నంచకుండా నీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ అడుగడుగునా దేవుడి పేరు ఎందుకు వాడుకుంటావు?” ఇవన్నీ చదివిన పోప్ కి నిజంగానే చిర్రెత్తి ఉంటుంది.
“సంవాదాలు” ప్రచురితం అయిన కొంతకాలం తరువాత మతధర్మకర్తల సదస్సు (Inquisition) గెలీలియోని న్యాయవిచారణ కోసం పిలిపించింది. మతవ్యతిరేక ప్రచారం చేస్తున్నాడన్న నింద మోపి రోమ్ కి రమ్మని సందేశం పంపింది. అలాంటి పరిస్థితుల్లో రోమ్ కి వెళ్తే ఏం జరుగుతుందో గెలీలియోకి బాగా తెలుసు. పైగా ఆ సమయంలో తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రోమ్ కి ప్రయాణం ఆ పరిస్థితుల్లో తన వల్లకాదని కబురు పెట్టాడు గెలీలియో. రానని మొండికేస్తే రెక్కలు కట్టి తిసుకురావలసి ఉంటుందని తీవ్రంగా వచ్చింది సమాధానం. ఇక గతిలేక ప్రయాణానికి సిద్ధం అయ్యాడు గెలీలియో.
(సశేషం...)
గెలీలియోకి చర్చికి మధ్య భావసంఘర్షణ కొనసాగుతూనే ఉంది. చర్చి అధికారులు వాళ్లు చెప్పేది చిలకల్లా వల్లెవేస్తూనే ఉంటారు గాని, గెలీలియో సేకరించిన పరిశీలనల మీద వ్యాఖ్యానించరు, ఆ సమాచారానికి స్పందించరు. గెలీలియో కూడా పట్టువదలకుండా ఓ కొత్త విశ్వదర్శన స్థాపన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా 1623 లో చర్చిలో పరిస్థితులు గెలీలియోకి అనుకూలంగా మరాయి. తన చిరకాల స్నేహితుడైన కార్డినల్ మాఫియో బర్బెరీనీ ఇప్పుడు కొత్త పోప్ అయ్యాడు. ఈ కొత్త పోప్ పేరు అర్బన్ VIII. గెలీలియో, ఈ బర్బెరీనీ చిన్నప్పుడు పీసా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు కనుక గేలిలీయోకి పోప్ ని స్వయంగా కలుసుకునే అవకాశం సులభంగా దొరికింది. ఆరుసార్లు పోప్ ని కలుసుకుని తన భావాలని వ్యక్తం చేసుకున్నాడు. ఎంతో కాలంగా తన మనసులో ఉన్న మాటని ఆ సందర్భంలో గెలీలియో పోప్ కి విన్నవించుకున్నాడు.
విశ్వం యొక్క తత్వం గురించి ప్రస్తుతం సమాజంలో రెండు విభిన్న భావజాలాలు చలామణిలో ఉన్నాయి. ఒకటి బైబిల్ చెప్పేది, దానికి ప్రతినిధులైన మతాధికారులు చెప్పేది. రెండవది ఇటీవలి కాలంలో దూరదర్శిని మొదలైన పరికరాల సహాయంతో చేసిన పరిశీలనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ రెండు భావజాలల మధ్య ఏది నిజం అన్నది తెగని సమస్యగా ఉంది. ఆ భావజాలాల మధ్య సంఘర్షణని, సంవాదాన్ని ఒక పుస్తరూపంలో రాయాలని గెలీలియో ఎంతో కాలంగా అనుకుంటున్నాడు. ఆ విషయమే పోప్ తో అన్నాడు. పుస్తక రచనకి పోప్ పూర్తిగా ఒప్పుకున్నాడు. పోప్ వద్ద సెలవు తీసుకున్న గెలీలియో ఇంటికి తిరిగి వెళ్లగానే పుస్తక రచనకి ఉపక్రమించాడు.
తొలిదశల్లో ఈ పుస్తకాన్ని ’తరంగాల మీద సంవాదం’ అని పిలుచుకునేవాడు గెలీలియో. వ్రాతప్రతి మాతాధికారుల చేతికి చిక్కింది. వాళ్లకి పుస్తకం పేరు ససేమిరా నచ్చలేదు. ఎందుకంటే తరంగాల పేరు చెప్పి పృథ్వీకేంద్ర సిద్ధాంతాన్ని గుంభనంగా సమర్థిస్తున్నాడు గెలీలియో అని వాళ్ళు పసిగట్టారు. తరంగాలు చందమామ యొక్క గురుత్వాకర్షణ మీద ఆధారపడతాయి. భూమి యొక్క ఆత్మభ్రమణం మీద ఆధారపడతాయి. అంటే తరంగాల గురించి గెలీలియో చెప్పింది ఒప్పుకుంటే, భూమి కదులుతోందని ఒప్పుకున్నట్టే. కనుక మతాధికారులు పుస్తకంలో తరంగాలకి సంబంధించిన విషయాలన్నీ తీసేయించారు. చివరికి వట్టి “సంవాదం” (Dialogue) అన్న పేరు మాత్రం మిగిలింది.
అయితే ఆధునిక రూపంలో ఈ పుస్తకాన్ని Dialogue Concerning the Two Chief World Systems (Dialogo sopra i due massimi sistemi del mondo) (రెండు ముఖ్యమైన విశ్వ విజ్ఞాన సాంప్రదాయాల మధ్య సంవాదం) అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు. ఈ పుస్తకం అంతా సంవాదాల రూపంలో ఉంటుంది. నాలుగు రోజుల పాటు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన సంవాదాలవి. వారిలో ఒకడి పేరు సింప్లీసియో (Simplicio). ఇతగాడు వట్టి అమాయకుడు. ఆ రోజుల్లో చలామణిలో ఉన్న అవైజ్ఞానిక భావాలకి, నమ్మకాలకి ఇతడు ప్రతిరూపం. రెండవ వ్యక్తి పేరు సాగ్రెడో (Sagredo). ఇతగాడు పామరుడే గాని తెలివైన వాడు. మొదట్లో తటస్థంగా ఉన్నా, సంవాదాలలో చివరి దశలో గెలీలియో భావాలని స్వీకరిస్తాడు. ఇక మూడవ వ్యక్తి పేరు సాల్వియాటీ. పండితుడైన సాల్వియాటీ, కోపర్నికస్, గెలీలియో మొదలైన ఆధునికుల భావాలకి మూర్తిరూపం. ఒక పక్క నిష్పక్షపాతంగా రెండు సిద్ధాంతాలని వర్ణిస్తున్నట్టు, వాటి మధ్య భేటీని విపులీకరిస్తున్నట్టు కనిపిస్తున్నా, ప్రచ్ఛన్నంగా సూర్యసిద్ధాంతానిదే పైచేయి అయినట్టుగా ఇందులో వివరిస్తాడు గెలీలియో. అయితే తలదిమ్మెక్కించే తాత్విక వివరణల రూపంలో కాకుండా అంతా సంభాషణల రూపంలో ఉంటుంది కనుక సామాన్యులకి కూడా అర్థమయ్యేలా ఉంటుంది. పైగా అప్పటికి అధికార భాష అయిన లాటిన్ లో కాక, జనరంజకంగ ఉండాలని కావాలని ఈ పుస్తకాన్ని పామర భాష అయిన ఇటాలియన్ లో రాశాడు గెలీలియో.
చివరికి పుస్తకం 1932 లో ప్రచురితం అయ్యింది. అంటే పోప్ ఆమోదం ఇచ్చాక ఇంచుమించు దశాబ్దం తరువాత అన్నమాట. కాని దురదృష్టవశాత్తు ఈ పదేళ్లలో రాజకీయపరిస్థితులు బాగా మారిపోయాయి. పుస్తకం రచన మొదలయినప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనసారా దీవించిన పోప్ ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎలా తగులబెట్టించాలా అన్న ఆలోచనలో ఉన్నాడు.
(సశేషం...)






