శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.




అయినా కాటన్ నిరుత్సాహం చెందలేదు. 1881 లో మడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక సదస్సులో తన భావాల గురించి మరొక్కసారి ప్రస్తావించాడు. ఆ ప్రసంగంలో భారతీయ నదులని కలిపేందుకు ఒక విస్తృత పథకాన్ని ఆ సదస్సు ముందు ఉంచాడు.

“కలకత్తా నుంచి [గుజరాత్ లో వున్న] కుర్రాచీ వరకు [ఒక శాఖ విస్తరిస్తుంది] – అది గంగా లోయ వెంట, జమునా, సట్లెజ్ నదుల ఉత్పత్తి స్థానాల మీదుగా, ఇండస్ లోయ వెంట కుర్రాచీ వరకు విస్తరిస్తుంది.



ఇందులో అతి కఠినమైన భాగం ఇప్పటికే నిర్మించబడింది. అదే శ్రీహింద్ కాలువ. ఇది సట్లెజ్ ని జమునతో కలుపుతుంది. అలాగే గోదావరిని పొడిగిస్తూ తపతిని గోదావరితో కలిపితే, కోకనాడ [కాకినాడ] నగరానికి సూరత్ కి మధ్య జలమార్గం ఏర్పడుతుంది. తుంగభద్ర, కాల నదీ లోయల వెంట సాగుతూ దార్వార్ వద్ద నదీ ఉత్పత్తి స్థానాన్ని దాటి (2000 అడుగుల ఎత్తున్న ఈ స్థానాన్ని జయించడం అతి కష్టం) కార్వార్ నగరం వద్ద సముద్రాన్ని చేరుకోవాలి. అలాగే నీలగిరులకి దక్షిణాన ఉన్న పాలఘాట్ నుండి బయల్దేరి, పొనాని లోయ మీదుగా సాగుతు, కోయమ్బత్తూర్ లో 1400 అడుగుల ఎత్తున్న నదీ ఉత్పత్తి స్థానాన్ని దాటాలి.



ఇక బెంగాల్ నుండి వచ్చే ‘తీర కాలువ’, కలకత్తా నుండి కేప్ కామొరిన్ (కన్యాకుమారి) వరకు (తూర్పు తీరం మీదుగా) విస్తరించి, అక్కణ్ణుంచి పశ్చిమ తీరం వెంట కార్వార్ వరకు విస్తరించాలి. ఈ కాలువ నిర్మాణం అతి తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం వుంది. అంతేకాక ద్వీపకల్పం (peninsula) ప్రాంతం అంతా విస్తరించబోయే కాలువలు – మద్రాస్ నుండి బయల్దేరి కర్నాటక ప్రాంతం ద్వారా సాగుతూ పొనాని వరకు విస్తరించేది, మద్రాస్ నుండి బయల్దేరి నెల్లూర్ మీదుగా సాగుతూ, సీడెడ్ జిల్లా ద్వారా కార్వార్ వరకు విస్తరించేది, గోదావరి, వార్దాల మీదుగా తపతి వెంట సూరత్ వరకు విస్తరించేది – వీటన్నిటినీ కూడా సులభంగా నిర్మించడానికి వీలవుతుంది. వాటి వల్ల దక్కబోయే ఫలితంతో పోల్చితే వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు అత్యల్పం.



ఈ కాలువల వల్ల వేల మైళ్ళ పొడవున్న జలమార్గాలు దేశంలో నలుమూలలని కలుపుతాయి.



ఇది కాకుండా ఓ చుట్టుగీతని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది శ్రీరంగపట్నంలో ఉండే కావేరి నుండి బయల్దేరి మైసూరు, సీడెడ్ జిల్లా మీదుగా, హైదరాబాద్ మీదుగా, గోదావరి మీదుగా ఎగువ ప్రాంతాల కేంద్రం వరకు విస్తరిస్తుంది. ఈ విధంగా తూర్పు-పడమర దిశలలో విస్తరించి వున్న కాలువలని, నదులని తీరం వెంట విస్తరించే కాలువలతో కలపడం వల్ల, దేశంలోని అంతరంగ ప్రాంతాలని ఇరు పక్కల తీర ప్రాంతాలతో కలపడానికి వీలవుతుంది. అలాగే (ఇటు తూర్పున ఉన్న) కలకత్తాని, గంగా తలాల మీదుగా (అటు పడమరన ఉన్న) పంజాబ్ తో కలపడానికి వీలవుతుంది.



లాహోర్ నుండి కార్వార్ వరకు, అంటే 3000 మైళ్ళ దూరం మీదుగా, ఒక టన్ను సరుకులని మోసుకుపోవడానికి 1/20 పెన్నీలు అవుతుంది. అంటే మైలుకి 6 రూపాయల చొప్పున ధాన్యం ఖర్చులో 10% మాత్రమే అవుతుంది.



ఈ రకమైన జల వ్యవస్థ వల్ల రవాణా రంగంలో ఈ ఉపయోగాలతో పాటు నీటి పారుదల లో కూడా అత్యుత్తమ సత్ఫలితాలు అందనున్నాయి.”

(ఇంకా వుంది)

http://www.mapsofindia.com/maps/india/india-river-map.htm

హెన్సోతో డార్విన్ సావాసం

Posted by V Srinivasa Chakravarthy Friday, April 27, 2012 0 comments


ఆయన [హెన్స్లో] మంచితనానికి, దయాగుణానికి హద్దుల్లేవని అనిపిస్తుంది. పేద వారి జీవితాలని మెరుగుపరచడానికి ఆయన రూపొందించిన పధకాలే దానికి తార్కాణం. ఆయన సావాసం నాకు ఎనలేని మేలు చేసింది. ఇలా అంటే నాకూ చిన్న సన్నివేశం గుర్తొస్తోంది. అవతలి వారి మనసుని గాయపరచకుండా నడుచుకునే ఆయన సున్నిత స్వభావానికి ఇది తార్కాణం. ఒకసారి ఓ చిత్తడి నేల మీద పుప్పొడి రేణువులని పరీక్షిస్తుంటే, వాటిలోంచి సన్నని నాళాలు పొడుచుకు రావటం చూశాను. నాకు ఆశ్చర్యం వేసి వెంటనే ఆయనకి చెప్దాం అని పరుగెత్తాను. ఆయన స్థానంలో మరే ఇతర వృక్ష శాస్త్రం ప్రొఫెసరు ఉన్నా అలాంటి కబురు చెప్పడానికి వచ్చిన నన్ను చూసి పకాలు మని నవ్వేవాడే. నేను చూసిన విషయం నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉందని ఒప్పుకుని, దాని గురించి వివరంగా వివరించి, చివరికి అది కొత్త విషయమేమీ కాదని, బాగా తెలిసిన విషయమే నని నాకు సున్నితంగా బోధపరిచారు. ఆయన చెప్పిన విధానం వల్ల కాబోలు నేనేమీ చిన్నబుచ్చుకోలేదు. పైగా అలాంటి ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకున్నందుకు సంతోషించాను. అయితే మళ్లీ ఇంకెప్పుడూ అలా తొందర పడి కనుక్కున్న విషయాలని వెంటనే అందరికీ చాటకూడదు అని నిర్ణయించకున్నాను.



డా||వెవెల్ తరచుగా హెన్స్లో ఇంటికి వస్తూ ఊండేవారు. ఎన్నో సార్లు ఆయన, నేను రాత్రిళ్లు కలిసి ఇంటికి వెళ్లడం జరిగింది. నేను చూసిన వారిలో సర్ మాకింటోష్ తరువాత అంతటి మాటకారి ఇతడే. ఎన్నో లోతైన అంశాల మీద గొప్పగా ప్రసంగించ గలడు. ప్రకృతి చరిత్ర మీద ఎన్నో అమూల్యమైన వ్యాసాలు వ్రాసిన లియొనార్డ్ జెనిన్స్ కూడా ఎన్నో సార్లు హెన్స్లో గారి ఇంట్లో బస చెయ్యడం జరిగింది. ఫెన్స్ సరిహద్దుల వద్ద ఉన్న ఆయన ఇంటికి ఎన్నో సార్లు వెళ్లాను. ఆయనతో ప్రకృతి చరిత్ర గురించి చర్చించే అవకాశం ఎన్నో సార్లు దొరికింది. హెన్స్లో స్నేహితులైన మరి కొందరు ప్రముఖులు, విజ్ఞానంతో సంబంధం లేని వారు, మరి కొందరితో కూడా పరిచయం కలిగింది. వారిలో ఒకడు సర్ అలెగ్సాండర్ రాంసే కి సోదరుడు. స్కాట్లాండ్ కి చెందిన ఇతడు జీసస్ కాలేజిలో లెక్చరర్ గా పని చేసేవాడు. అలాగే హియర్ఫోర్డ్ లో డీన్ గా పని చేసిన మిస్టర్ డాస్ తో కూడా పరిచయం అయ్యింది. పేదల చదువులో ఈయన సాధించిన విజయాల కారణంగా ఈయనకి పేరొచ్చింది. హిన్స్లో గారి ఈ మిత్ర బృందం అంతా కలిసి ఎన్నో సార్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి విహార యాత్రలకి వెళ్లేవారు. నేను ఎన్నో సార్లు ఆ యాత్రల్లో పాలు పంచుకున్నాను. ఆ యాత్రలు ఎంతో విజ్ఞాన దాయకంగా ఉండేవి.



ఆ రోజులని గుర్తు తెచ్చుకుంటుంటే అనిపిస్తుంది. నా ఈడు కుర్రాళ్లలో లేని ఏదో ప్రత్యేకత నాలో వారికి కనిపించి ఉంటుంది. లేకపోతే విద్యా విషయాలలో అంత ఎత్తుకి చేరుకున్న వారంతా, ఓనమాలు కూడా సరిగ్గా రాని నన్ను వాళ్ల బృందంలోకి ఎందుకు రానిస్తారు? నాకుగా నాకు అలాంటి ప్రత్యేకత ఏమీ నాలో కనిపించదు. కాని నాతో కలిసి ఆడుకునే నా స్నేహితుడు టర్నర్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కుమ్మరి పురుగులతో నేను చేసిన పరిశోధనలు చూసిన టర్నర్ ఏదో ఒకరోజు నేను "ఫెలో ఆఫ్ రాయల్ సొసయిటీ" అవుతాను అన్నాడు. నాకైతే అది అసంభవం అనిపించింది అప్పుడు.



కేంబ్రిడ్జ్ లో గడిపిన ఆఖరు సంవత్సరంలో హంబోల్ట్ రాసిన "వ్యక్తిగత ప్రసంగం" (Personal narrative ) పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చదివాను. ఇది కాకుండా సర్ జె. హెర్షెల్ రాసిన "ప్రకృతి తత్వ అధ్యయనాలకి పరిచయం" (An introduction to the study of natural philosophy ) పుస్తకం కూడా చదివాను. అది చదివాక జీవితంలో ఏదో ఒక చక్కని వైజ్ఞానిక సత్యాన్ని కనుక్కుని ప్రకృతి విద్యా దేవతకి చిరుకానుకగా సమర్పించుకోవాలన్న తపన నాలో బయలుదేరింది. ఏ రెండు పుస్తకాలు చేసినంతగా మరే ఇతర పుస్తకాలు నన్ను ప్రభావితం చెయ్యలేదు అనిపించింది. హంబోల్ట్ రచనలలో టెనెరిఫ్ Teneriffe) గురించిన సుదీర్ఘ వర్ణనలు కొన్ని వేరేగా రాసుకుని హెన్స్లో బృందంతో యాత్రలకి వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకెళ్ళాను. అంతకు ముందు ఒకసారి యాత్రకి వచ్చినప్పుడు టెనెరిఫ్ వైభవం గురించి హెన్స్లో, రాంసే, డాస్ తదితరులతో తెగ చెప్పాను. దాంతో వాళ్లు ఈ సారి టెనెరిఫ్ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు. కాని ఏదో ఊరికే నన్ను మెప్పించడానికి ఒప్పుకున్నారు అనిపించింది. కాని నాకు మాత్రం ఎలాగైనా అక్కడికి వెళ్లాలని పట్టుదలగా ఉండేది. ఒకసారి లండన్లో నౌకా యాత్రలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఓ ఓడల వ్యాపారి గురించి సమాచారం సేకరించాను కూడా. కాని "బీగిల్" యాత్రతో ఈ పధకాలన్నీ నీట కలిసిపోయాయి.



(ఇంకా వుంది)












(సర్ ఆర్థర్ కాటన్)

మన దేశంలోని నదులని అనుసంధానం చెయ్యాలన్న ఆలోచన నేటిది కాదు. ఒకటిన్నర శతాబ్దాల కాలం నాటిది. పందొమ్మిదవ శతాబ్దపు చివరి దశల్లో, ఇండియాలో రైల్వేలు
నిర్మించాలా, జల రవాణా వ్యవస్థని పెంపొందించాలా అని బ్రిటిష్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్న సమయంలో, జల రవాణా లోని లాభాలు వివరిస్తూ జల రవాణా వ్యవస్థని రూపొందిస్తే మేలని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞాపన సమర్పించిన వాడొకడు ఉన్నాడు. అతడే సర్ ఆర్థర్ కాటన్.

అదే దిశలో పురోగమిస్తూ నదీజలాల అనుసంధానాన్ని సమర్థించిన మరొక మేధావి ఆంధ్రుడైన కె. ఎల్. రావు.



గత ఏడాది వెలువడ్డ, డి.కె. హరి, డి.కె. హెమ హరి లు రాసిన, “యూ టర్న్ ఇండియా” అన్న పుస్తకంలో ఓ అధ్యాయంలో కాటన్-రావుల కృషి గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఆ అధ్యాయం నుండి కొన్ని అంశాలు.



కాటన్ దొర అని, కాటన్ దేవుడు అని గోదావరి జిల్లా ప్రజలు గౌరవంగా పిలుచుకునే సర్ ఆర్థర్ కాటన్ పేరు వినని తెలుగువాడు ఉండడు. విశాలమైన గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి గోదావరి ప్రజల అభిమానాన్ని దోచుకున్నాడు.



ఇండియాలో నీటి పారుదల వ్యవస్థకి మూలపురుషుడుగా కాటన్ పేరే చెప్పుకుంటారు. ఈయన ఇండియా అంతా విస్తృతంగా సంచరించి, నదీ ప్రాంతాలని క్షుణ్ణంగా సర్వే చేసి, దేశవ్యాప్తమైన జల జాలం (water grid) కి బ్లూ ప్రింట్ తయారు చేసి, 1881 లో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాడు.



జల సాంకేతిక రంగంలో ఇండియాలో ప్రాచీన కాలం నుండి వస్తున్న కొన్ని సాంప్రదాయాలే తన కృషికి స్ఫూర్తి అని చెప్పుకున్నాడు ఆర్థర్ కాటన్. ముఖ్యంగా తంజావూరులో కావేరి నది మీద నిర్మించబడ్డ ‘కల్లనై’ అనే ఆనకట్ట నిర్మించిన తీరు మీద ఆధారపడి తాను నీటిపారుదల వ్యవస్థలని సూత్రీకరించానని ప్రకటించుకున్నాడు. కావేరి నదిపై ‘కల్లనై’ అనే రాతి ఆనకట్టని క్రీ.శ. 100 లో కరికాల చోళుడు అనే తమిళ రాజు నిర్మించాడు. రెండు వేల ఏళ్ళుగా ఆ ఆనకట్ట మీద నీరు ప్రవహిస్తున్నా ఇప్పటికీ అది చెక్కుచెదర లేదు.



ఈ రంగంలో ప్రాచీన భారతీయ ఇంజినీర్ల ప్రతిభ గురించి కాటన్ ఇలా అంటున్నాడు :

“ఇండియాలో వివిధ ప్రాంతాల్లో లెక్కలేనన్ని ప్రాచీన నిర్మాణాలు ఉన్నాయి…

పూర్వకాలంలో ఇక్కడ ఉండే సాంకేతిక ప్రతిభకి తార్కాణాలైన ఘన నిర్మాణాలివి.

వాటిని చూస్తుంటే మన నాగరిక అనాగరికులం అనిపిస్తుంది. యుద్ధక్రీడలో మునిగి తేలుతాం గాని ఆ పూర్వీకుల కన్నా మనం ఎంతో అథములం. వారు నిర్మించిన వ్యవస్థలని అనుకరించి, విస్తరింపజేయ లేకపోయినా, వాటికి కనీసం మరమ్మత్తు చేయించి నిలుపుకోవడం కూడా చాతకాని అప్రయోజకులం.

లోతు తెలియని బురద నేలలో పునాదులు ఎలా వెయ్యాలో మనం ప్రాచీన భారతీయుల నుండి నేర్చుకున్నాం.

పునాదులు వెయ్యడంలో వారి నుండి పాఠాలు నేర్చుకుని మనం నేడు వంతెనలు, ఆనకట్టలు, కాలువలు నిర్మించగలుగుతున్నాం.

ఆ విధంగా ఆ ప్రాచీన ఇంజినీర్లకి మనం ఎంతో ఋణపడి వున్నాం.”



సరుకుల రవాణా కోసం రైల్వేలు స్థాపించకుండా, జల రవాణా వ్యవస్థని కల్పిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయంటూ 1878 లో ఆర్థర్ కాటన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించుకున్నాడు. ఆ నివేదిక నుండి కొన్ని ముఖ్యాంశాలు:



ఇండియాకి అవసరమైన రవాణా సౌకర్యాలని తగు మూల్యం వద్ద గాని, తగు మోతాదులో గాని రైల్వేలు అందించలేవు… రైల్వే బాట వెయ్యడానికి మైలుకి 9,000 పౌండ్లు అవుతుంది. ౩౦,౦౦౦ టన్నులు ఒక మైలు రవాణా చెయ్యడానికి 1 పెన్నీ పడుతుంది. అదే జల మార్గం వెంట అయితే ఒక మైలు పొడవున్న మార్గానికి 2,000-8,000 పౌండ్లు పడుతుంది. 1/20 పెన్నీల ఖర్చుతో రెండు మూడు మిలియన్ల టన్నులు రవాణా చెయ్యొచ్చు…



సర్ ఆర్థర్ కాటన్ ఆలోచన ప్రకారం భారీ సరుకులని రవాణా చెయ్యడానికి రైల్వే మార్గంలో కన్నా జల మార్గంలో మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతర్దేశీయ జల మార్గ వ్యవస్థాపనకి అయ్యే ఖర్చు కూడా రైల్వేలకి అయ్యే ఖర్చు కన్నా తక్కువే. రవాణాకి అయ్యే ఖర్చు కూడా రైల్వేలలో కన్నా జల మార్గాలలో అతి తక్కువ.

తన భావాలని విమర్శించిన సర్ జార్జ్ హామిల్టన్ కి సమాధానంగా కాటన్ 1878 లో ‘హౌస్ ఆఫ్ కామన్స్’ లో ఇలా అన్నాడు: “మిలార్డ్, పోటెక్కిన గోదావరి నదిలో ఒక్క రోజులో ప్రవహించే జలాలు ఏడాది పొడవునా లండన్ లో థేమ్స్ నదిలో ప్రవహించే జలాలతో సమానం.” ఆ విధంగా ఇండియాలోని జల సంపద ఎంత విస్తారమైనదో బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తూ, దేశంలో జల రవాణా వ్యవస్థల నిర్మాణం కోసం ఎంతో ప్రయత్నించాడు కాటన్. కాని బ్రిటిష్ ప్రభుత్వం తన ప్రతిపాదనకి సుముఖంగా లేదు.

(ఇంకా వుంది)


(కల్లనై ఆనకట్ట)

అవరోహణ మొదలయ్యింది

Posted by V Srinivasa Chakravarthy Wednesday, April 18, 2012 0 comments

కాని మర్నాడు ఆకాశం మేఘావృతమై వుంది. అయితే జూన్ 29 నాడు మాత్రం చంద్రుడి పక్షం మారడంతో పాటు, వాతావరణం కూడా మారింది. అగ్నిబిలం వాలు వెంట సూర్య తేజం వెల్లువలా ప్రవహించింది. ప్రతీ రాయి, ప్రతీ రప్ప, ప్రతీ కొండ, ప్రతీ బండ ఆ ఎండలో తడిసి బారైన నీడలు విసిరాయి. ముఖ్యంగా స్కార్టారిస్ పర్వత శిఖరం యొక్క పదునైన నీడ కూడా రవి గతికి వ్యతిరేక దిశలో నెమ్మదిగా కదలడం కనిపించింది.
మామయ్య దృష్టి ఆ నీడనే అనుసరించింది.

ఆ నీడ పగలంతా కదిలి కదిలి మధ్యాహ్నానికల్లా మధ్య సొరంగం నోటి వద్ద ఆగింది.
“అదుగో! మార్గం తెలిసిపోయింది!” అంటూ రంకె వేశాడు మామయ్య.
“పదండిక. భూమి కేంద్రానికి బయల్దేరదాం.” అన్నాడు మళ్లీ తనే డానిష్ లో.
ఏమంటాడో అని హన్స్ కేసి ఓ సారి ఆత్రంగా చూశాడు మామయ్య.
“Forut!” అన్నాడు హన్స్ నిర్లిప్తంగా.
“Forward” అన్నాడు మామయ్య అందుకు స్పందిస్తూ.




సమయం ఒంటగంట దాటి పదమూడు నిముషాలు అయ్యింది.




(పదహారవ అధ్యాయం సమాప్తం)

అధ్యాయం 17
అవరోహణ మొదలయ్యింది




నేటితో మా అసలు పయనం మొదలయ్యింది. ఇంతవరకు వచ్చిన ఇబ్బందులని ఎలాగో శ్రమపడి జయించాం. కాని ఇక నుండి అడుగడుగునా ఇక్కట్లు ఎదురై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.




(image: http://nashvillegrotto.org/july-18-brenmark-and-parachute-caves-excursion)




నా ఎదుట కనిపిస్తున్న చీకటి గుయ్యారం లోకి, ఆ పాతాళ బిలంలోకి తొంగి చూడడానికి ఇంకా ప్రయత్నించలేదు. దైవఘడియ రానే వచ్చింది. ఇక ముందుకు వెళ్లడమో మొరాయించడమో నిశ్చయించుకోవాలి. కాని మా గైడు వాలకం చూస్తే వెనకాడడానికి సిగ్గేస్తోంది. ఎంత నిశ్చింతగా, నిబ్బరంగా, పొంచి వున్న ప్రమాదాలకి ఏ మాత్రం కంగారు పడకుండా హన్స్ ఈ ప్రయత్నానికి పూనుకున్నాడంటే తన ముందు పిరికి వాడిలా కనిపించడానికి తలవంపులుగా అనిపించింది. హన్స్ లేకపోయి వుంటే మరొక్క సారి మామయ్యతో వాదనకి దిగేవాణ్ణి, ఆయన మనసు మార్చే ప్రయత్నం చేసేవాణ్ణి. కాని హన్స్ ముఖం చూసి నోరు మెదపలేదు. ఒక్కసారి నా ప్రేయసి తీపి జ్ఞాపకాలని మనసులో తలచుకుంటూ మధ్య సొరంగం దిశగా అడుగులు వేశాను.




నా ఎదుట ఉన్న సొరంగం వెడల్పు నూరు అడుగులు ఉంటుందని, చుట్టుకొలత సుమారు మూడొందల అడుగులు ఉంటుందని ఇందాక చెప్పాను. సొరంగం నోటి వద్ద ఉన్న రాతి మీద ఆనుకుంటూ ఓ సారి సొరంగంలోకి తొంగి చూశాను. ఎదుట కనిపించిన దృశ్యానికి వెన్నులోంచి చలిపుట్టుకొచ్చింది. తల తిరిగి మూర్చ వచ్చినంత పనయ్యింది. అంతులేని అగాధంలో ఉండే ఆకర్షణ కన్నా భయంకరమైనది మరేదీ లేదు. ఒక్క క్షణం ఉంటే జారి పడే వాణ్ణే. అంతలో ఏదో చెయ్యి నన్ను చటుక్కున పట్టుకుని ఆపింది. అది హన్స్ చెయ్యి.

ఆ గోతి లోకి ఒక్క క్షణమే చూసినా దాని రూపురేఖల గురించి కొంత అవగాహన కలిగింది. దాని గోడలు కచ్చితంగా నిలువుగా ఉన్నా ఆ గోడల లోంచి పదునైన రాళ్ళు పొడుచుకువస్తూ కనిపించాయి. ఆ రాళ్ల మీద పాదం మోపుతూ కిందకి దిగవచ్చు అనిపించింది. కనుక మెట్ల దారి లాంటి రాళ్లు ఎన్నో ఉన్నాయి కాని ఆ మెట్లకి పక్కన అడ్డుకట్టలా ఏమీ లేదు. పోనీ పైన ఏ బండకో ఓ త్రాడు కట్టుకుని కిందికి దిగినా, తీరా దిగాక ఆ త్రాడుని విప్పుకోవడం ఎలా?

ఈ సమస్యకి మామయ్య ఓ చక్కని పరిష్కారం ఆలోచించాడు. వేలెడు మందం కలిగి నాలుగొందల అడుగుల పొడవు ఉన్న ఓ తాడు తీసుకున్నాడు. మా ఎదురుగా ఓ లావా బండ పొడుచుకు వస్తోంది. దాని మీదుగా అటు ఇటుగా ఈ త్రాటిని వెయ్యాలి. త్రాడు యొక్క మధ్య బిందువు ఈ బండ మీదకి రావాలి. అప్పుడు త్రాడుకి చెరో వైపు మామయ్య, నేను దిగాలి. ఇద్దరం త్రాడు కొసలని చేరుకున్నాక ఒక పక్క త్రాడు కొసని విడిచిపెడితే అవతలి కొస నుండి మొత్తం త్రాడుని లాగేసుకోవచ్చు. ఇలా మళ్లీ మళ్లీ చేస్తూ ఎంత లోతుకైనా చేరుకోవచ్చు.




(ఇంకా వుంది)

కీటక సేకరణలో డార్విన్

Posted by V Srinivasa Chakravarthy Monday, April 16, 2012 0 comments

కుమ్మర పురుగు సేకరణలో మంచి నైపుణ్యం సంపాదించాను. రెండు కొత్త పద్ధతులు కూడా కనిపెట్టాను. పాత చెట్ల మీద పేరుకునే నాచు అంతా గోకి పెద్ద సంచీలోకి ఎక్కించడానికి ఓ పనివాణ్ణి పెట్టుకున్నాను. అలాగే బురద నేలల నుండె కట్టెలు తెచ్చే పడవల్లో అడుగున పేరుకునే నాచుని కూడా సేకరించే వాణ్ణి. ఆ విధంగా ఎన్నో అమూల్యమైన కుమ్మర పురుగు జాతులని సేకరించ గలిగాను. 'స్టెఫెన్స్ వారి బ్రిటిష్ కీటకాల చిత్రాలు’ అనే పుస్తకంలో సేకరణ - సి. డార్విణ్ అన్న పదాలని మొట్టమొదటి సారి చూసినప్పుడు నాలో గలిగినంత ఆనందం, ప్రపంచంలో ఏ కవీ తన కవితలని మొట్టమొదటి సారి అచ్చు రూపంలో చూసుకుని అనుభవించి ఉండడు. కీటక శాస్త్రంతో నాకు పరిచయం చేసినవాడు మా బావ డబల్యు. డార్విన్ ఫాక్స్. చాలా తెలివైన వాడు, మంచివాడు. ఇతగాడు క్రైస్ట్ కాలేజిలో ఉన్న రోజుల్లో మా ఇద్దరి మధ్య బాగా సఖ్యత పెరిగింది. ఈ సేకరణ వ్యవహారం బాగా అలవాటు అయ్యాక ట్రినిటీ కాలేజి కి చెందిన ఆల్బర్ట్ వే తో కలిసి వెళ్తుండేవాణ్ణి. ఆ ఆల్బర్ట్ వే తరువాత పురావస్తు పరిశోధకుడిగా మంచి పేరు పొందాడు. ఆ తరువాత హెచ్. థాంసన్ తో కూడా కొంత కాలం వెళ్ళాను. ఈ థాంసన్ తరువాత రైల్వేలకి చైర్మన్ గాను, పార్లమెంట్ సభ్యుడిగాను పని చేశాడు. కనుక కుమ్మరి పురుగు విషయంలో నా అభిరుచి భవిష్యత్తులో నేను పొందబోయే ఎన్నో విజయాలకి తొలిమెట్టు అయ్యింది.

కేంబ్రిడ్జ్ లో నేను సేకరించిన కుమ్మర పురుగులు నా మనసులో ఎంత గాఢమైన ముద్ర వేశాయో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా నా పంట బాగా పండిన కొన్ని ప్రత్యేక స్థలాలు, ముసలి చెట్లు, చెరువుగట్లు నాకు ఇంకా గుర్తు. ప్రత్యేకించి ‘పనాజియస్ క్రక్స్ – మేజర్’ జాతి పురుగు దొరకడం ఆ రోజుల్లో అపురూపంగా ఉండేది. ఒకసారి దారికి అడ్డుగా ఉరుకుతున్న ఓ కుమ్మర పురుగుని చటుక్కున అందుకుని చూశాను. మొదట పి. క్రక్స్-మేజర్ కి, దీనికి పోలిక ఉన్నట్టు కనిపించింది. కాని జాగ్రత్తగా గమనిస్తే అది పి. క్వాడ్రీ పంక్టాటస్ జాతి పురుగు అని తెలిసింది. రెండూ సన్నిహిత జాతులే. ఆకారంలో కొంత పోలిక ఉంది. ఆ రోజుల్లో ‘లిసినస్’ జాతి పురుగుని ఎప్పుడూ సజీవంగా పట్టుకోలేదు. తేడా తెలీని వాళ్ళు దాన్ని చూసి నల్లని కరాబిడస్ కుమ్మరి పురుగు అనుకుని పొరబడతారు. కాని మా ఇంటికి దగ్గర్లోనే మా పుత్రరత్నాలు ఓ పరుగుని పట్టుకున్నారు. అది నాకు తెలీని కొత్త జాతి అని చూడగానే గుర్తించాను. కాని గత ఇరవై ఏళ్లుగా బ్రిటిష్ కుమ్మర పురుగుని చూసి ఎరగను అంటే నమ్మండి!

నా వృత్తి జీవితం మీద గాఢమైన ముద్ర వేసిన ఓ ప్రభావం గురించి ఇంకా చెప్పలేదు. ఇది ప్రొఫెసర్ హెన్స్లో తో పరిచయం. కేంబ్రిడ్జ్ కి వచ్చే ముందు విజ్ఞానంలో ఆయనకి తెలీని రంగం అంటూ లేదని ఆయన గురించి మా అన్నయ్య చెప్పగా విన్నాను. కనుక ఆయన అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆయన వారానికి ఒకసారి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఈ సమావేశాలకి విద్యార్థులే కాక, విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగానికి చెందిన ఇతర సహోద్యోగులు కూడా కొందరు వచ్చేవారు. ఒకసారి మా బావ ఫాక్స్ ద్వారా ఈ సమావేశాలకి ఆహ్వానం దొరికింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా వెళ్లే వాణ్ణి. త్వరలోనే హెన్స్లో తో పరిచయం పెరిగింది. కేంబ్రిడ్జ్ లో ఉండే కాలంలో రెండవ దశలో ఆయనతో పాటు ఎన్నో సార్లు షికార్లకి వెళ్తూ ఉండేవాణ్ణి. దాంతో 'హెన్స్లో తో చెట్టాపట్టాలు వేసుకుని షికారు కెళ్లే పెద్దమనిషి’ అన్న బిరుదు కూడా దక్కింది. సాయంత్రాలు ఎన్నో సందర్భాలలో వాళ్ల ఇంటికి భోజనానికి రమ్మనేవారు. వృక్ష శాస్త్రంలో, కీటక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, ఖనిజ శాస్త్రంలో, భౌగోళిక శాస్త్రంలో ఆయన ప్రతిభ అపారం. దీర్ఘ కాలం ఎంతో క్షుణ్ణంగా, కూలంకషంగా చేసిన పరిశోధనల ఆధారంగా లోతైన నిర్ణయాలకి రావడంలో ఆయన ఘనుడు. ఆయన అంచనాలు చాలా కచ్చితంగా ఉండేవి. ఆయన ఆలోచనా ధోరణి చాలా సమంజసంగా ఉండేది. ఇంత పాండిత్యం ఉన్నా ఆయనని మహామేధావి అనలేమని అనిపిస్తుంది. ఆయనలో గాఢమైన దైవచింతన ఉండేది. ఇక మతం విషయంలో ఎంత ఛాందసుడు అంటే “Thirty-nine articles”*లో ఒక్క పదాన్ని మార్చినా తన మనసు విలవిలలాడి పోతుందని నాతో ఒకసారి చెప్పుకున్నాడు. కాని గొప్ప నీతిపరుడు. కోపం అంటే తెలీని శాంతస్వభావుడు. మంచి, మర్యాదలతో అవతలి వాళ్లని సులభంగా ఆకట్టుకునే స్వభావం ఆయనది. అలాంటి మనిషి కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఎంత వేగంగా స్పందించగలడో, ఎంత తీవ్రమైన చర్య తీసుకోగలడో చూసి ఆశ్చర్యపోయాను.

(*Thirty-nine articles అనేవి Church of England యొక్క మత సిద్ధాంతాలని నిర్వచించే మూల సూత్రాలు. – అనువాదకుడు.)

ఒక సారి ఆయన, నేను కేంబ్రిడ్జ్ వీధుల్లో నడుస్తుండగా ఓ దారుణమైన దృశ్యం కంట బడింది. అలాంటి దృశ్యాలు సామాన్యంగా ఏ ఫ్రెంచ్ విప్లవం కాలంలోనో కనిపించేవేమో. చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు దొంగల్ని పోలీసులు పట్టుకుని జైలుకి తరలిస్తున్నారు. అంతలో చుట్టూ ఉన్న జనం వాళ్ళని కానిస్టేబుల్ చేతినుండి విడిపించి, వాళ్ల కాళ్లు పట్టుకుని బురద నేల మీద ఈడుస్తూ పోయారు. వాళ్ల ఒళ్ళంతా బురదే. జనం కాళ్లతో తన్నటం వల్లనో, రోడ్డు మీద ఈడ్వటం వల్లనో మరి ఆ దొంగల తలల నుండీ రక్తం కారుతోంది. బలిష్టమైన శరీరాలు గల ఇద్దరూ శవాల్లా కనిపించారు. వాళ్ల చుట్టూ జనం ఎంతలా క్రమ్ముకున్నారంటే పాపం వారి దుస్థితిని చూడడానికి కూడా సాధ్యం కాలేదు. ఆ దారుణ దృశ్యాన్ని చూసిన హెన్లో ముఖం మీద రౌద్రం తాండవం చేసింది. ఒక మనిషి ముఖంలో అంత కోపం నేనెక్కడా చూళ్లేదు. జనం లోకి చొచ్చుకు పోవటానికి ఏన్నో సార్లు ప్రయత్నించారు. కాని వీలుపడలేదు. తను వెంటనే మేయర్ ఇంటికి బయలుదేరుతూ, నన్ను వెళ్ళి మరి కొందరు పోలీసులని వెంటపెట్టుకు రమ్మని పంపించారు. తరువాత ఏం జరిగిందో సరిగ్గా గుర్తులేదు గాని చివరికి ఆ ఇద్దరు దొంగలని ప్రాణాలతో రక్షించి జైల్లో పెట్టడం జరిగింది.

(ఇంకా వుంది)

పాటలతో డార్విన్ పాట్లు

Posted by V Srinivasa Chakravarthy Thursday, April 12, 2012 2 comments

విశ్వవిద్యాలయంలో ఎన్నో రంగాల్లో బహిరంగ ఉపన్యాసాలు ఉండేవి. కాని అప్పటికే ఎడిన్ బర్గ్ లో ఉపన్యాసాలు అంటే రోత పుట్టడం వల్ల, అత్యంత ఆసక్తికరమైన షెడ్జ్విక్ ఉపన్యాసాలకి కూడా హాజరు కాలేదు. ఆ ఉపన్యాసాలే విని ఉంటే భౌగోళిక శాస్త్రవేత్త అయ్యుండే వాణ్ణి. కాని హెన్స్లో వృక్ష శాస్త్రం మీద ఇచ్చిన ఉపన్యాసాలకి వెళ్లాను. ఆ ఉపన్యాసాలలోని అద్భుతమైన స్పష్టత, అందమైన చిత్రాలు నన్ను ఆకట్టుకున్నాయి.

అయితే నేను వృక్ష శాస్త్రం చదువుకోలేదు. హెన్స్లో తన విజ్ఞాన యాత్రలలో తనతో బాటు తన శిష్యులని, విశ్వవిద్యాలయంలో చదివిన సహోద్యోగులని తీసుకు వెళ్లేవాడు. బగ్గీల మీద గాని, నదిలో పడవల మీద గాని, కాలి నడకన గాని దూర ప్రాంతాలకి వెళ్లేవాడు. అక్కడ కనిపించే అరుదైన మొక్కల గురించి, జంతువుల గురించి ఉపన్యసించే వాడు. ఈ యాత్రలు మహా స్ఫూర్తి దాయకంగా ఉండేవి.


కేంబ్రిడ్జ్ లో నేను గడిపిన కాలంలో కొన్ని మంచి పరిణామాలు జరిగినా, మొత్తం మీద అక్కడ సమయం వృధా అయ్యిందనే చెప్పాలి. షూటింగ్, వేట, గుర్రపు స్వారీ మొదలైన క్రీడా కలాపాల మీదకి మనసు మళ్లింది. దాంతో పాటు కొన్ని అవాంచిత స్నేహాలు కూడా ఏర్పడ్డాయి. సాయంత్రాలు అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. వచ్చే వాళ్లందరూ మంచి కుటుంబాల వాళ్లే అయినా, ఆ విందులలో మద్యపానం కొంచెం మితిమీరేది. పేకాట, పాట వాటికి తోడయ్యేది. న్యాయంగా ఐతే అలాంటి కాలయాపనకి సిగ్గుపడాల్సిందే. అయినా అప్పుడప్పుడు అందరితో సరదాగా కడిపిన ఆ ఘడియలని తలచుకుంటూ ఉంటాను. నాకు వేరే రకం స్నేహితులు కూడా ఉండేవారు. విట్నీ [గౌరవనీయులైన సి. విట్నీ, సహజ తత్వం లో రీడర్, డర్హం విశ్వవిద్యాలయం] తో చాలా సన్నిహితంగా ఉండేవాణ్ణి. ఇద్దరం కలిసి ఎంతో దూరాలు షికార్లకి వెళ్తూ ఉండేవాళ్ళం. చిత్రకళ పట్ల, చెక్కడాల పట్ల నాలో అభిరుచి కలిగించింది ఆయనే. తరువాత కొన్ని మంచి చిత్రాలు కొనుక్కున్నాను కూడా. తరచు ఫిట్జ్ విలియం చిత్రకళా ప్రదర్శనశాలకి వెళ్తూ ఉండేవాణ్ణి. అక్కడి చిత్రాల గురించి ప్రదర్శనశాల అధికారితో కూడా చర్చించడం గుర్తు. సర్ జోషువా రేనాల్డ్స్ రాసిన పుస్తకం కూడా ఆసక్తిగా చదివాను. చిన్నప్పట్నుంచి లేకపోయినా, నాలో చిత్రకళ పట్ల ఈ కొత్త అభిరుచి ఎన్నో ఏళ్ల పాటు నిలిచింది. లండన్ లో జాతీయ ప్రదర్శన శాల లోని చిత్రాలు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా సెబాస్టియన్ దెల్ ప్లోంబో చిత్రాలు చూసి పరవశించిపోయాను.

క్రీడల నుండి మనసు మెల్లగా సంగీతం మీదకి మళ్లింది. సంగీతాన్ని నాకు పరిచయం చేసిన వాడు నా మిత్రుడు హెర్బర్ట్ (జాన్ మారిస్ హెర్బర్ట్, తాలూకా జడ్జి). ఇలాంటి నేస్తాలతో సావాసం వల్ల సంగీతం పట్ల కూడా గాఢమైన అభిరుచి కలిగింది. కింగ్స్ కాలేజి చాపెల్ లో జాతీయ సంగీతం వాయించే సమయంలో, ఆ గీతం వినాలని ఆ దారి వెంబడి షికారుకి వెళ్తుండేవాణ్ణి. అది వింటుంటే కొన్ని సార్లు ఒళ్లు పులకరించేది. సంగీతం పట్ల అనురక్తి తెచ్చిపెట్టుకున్నది మాత్రం కాదు. కొన్ని సార్లు కింగ్స్ కాలేజ్ లో పాడే కుర్రాళ్లకి డబ్బిచ్చి నా గదికి వచ్చి పాడమని బతిమాలుతూ ఉండేవాణ్ణి. అయితే సంగీతాన్ని ఓ పామరుడిలా విని ఆనందించడమే గాని, దాని లోతుపాతులు వివేచించగల పాండిత్యం అబ్బలేదు. పాటలో అపశృతులు పట్టుకోలేకపోయేవాణ్ణి. పాట విని రాగం తీయడం నా వల్ల అయ్యేది కాదు. మరి అలాంటి నేను సంగీతాన్ని ఎలా ఆస్వాదించగలిగే వాణ్ణో నాకే అంతుబట్టేది కాదు.

పాటలని అర్థం చేసుకోలేని నా పాట్ల గురించి నా మిత్రులకి త్వరలోనే తెలిసిపోయింది. కనుక సంగీతంలో నాకే గమ్మత్తయిన పరీక్ష పెట్టి ఆనందించేవారు. తెలిసిన పాటకి తాళం మార్చి, మామూలుగా కన్నా వేగంగానో, నెమ్మదిగానో వాయించి పాటని గుర్తుపట్టమనేవారు.
God save the king పాటని అలా వాయించినప్పుడూ మాత్రం పెద్ద చిక్కే వచ్చి పడేది. నాలాంటి దౌర్బల్యమే ఉన్న మరో పెద్ద పెద్దమనిషి కూడా ఉండేవాడు. ఆశ్చర్యం ఏంటంటే అతగాడికి కొంచెం వేణువు వాయించడం కూడా వచ్చు. మా సంగీత పరీక్షలో ఒకసారి ఇతగాణ్ణి ఓడించాను కూడా.

కేంబ్రిడ్జ్ లో ఉన్న కాలంలో ఇన్ని వ్యాపకాలు ఉన్నా కుమ్మర పురుగుల (beatles) సేకరణ ఇచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదు. ఊరికే సేకరించడంలో ఉన్న ఆనందం కోసం సేకరించేవాణ్ణి. వాటిని పరిచ్ఛేదించేవాణ్ణి కాడు. వాటి రూపురేఖలని పరిశీలించి, పుస్తకాల్లో ఇచ్చిన వివరణలతో సరిపోతున్నాయో లేదో కూడా చూసేవాణ్ణి కాను. ఈ విషయంలో ఒకసారి ఏం జరిగిందో చెప్తాను. ఓ రోజు ఓ చెట్టు బెరడును పెల్లగిస్తూ ఉంటే రెండు అరుదైన కుమ్మర పురుగులు కనిపించాయి. రెండిట్నీ గబుక్కున చెరో చేత్తో అందుకున్నాను. అంతలో మరో కుమ్మర పురుగు కనిపించింది. ఇది కూడా కొత్తరకమైనదే. దాన్ని వొదులుకోవాలని అనిపించలేదు. వెంటనే ఏం చెయ్యాలో తెలీక కుడి చేతిలో ఉన్న కుమ్మర పురుగుని చటుక్కున నోట్లో పెట్టుకున్నాను. అది నా నోట్లో ఏదో చేదైన ద్రవాన్ని కక్కింది! ఇక భరించలేక నోట్లోని పురుగుని ఉమ్మేశాను. ఇంతలో ఆ కొత్త, మూడో పురుగు కూడా తుర్రుమంది!
(ఇంకా వుంది)

దారే గోదారైతే...

Posted by V Srinivasa Chakravarthy Monday, April 9, 2012 0 comments



ప్రొఫెసర్ మావయ్య చూపించిన దృశ్యం చూసి ఆనందించ లేదు గాని అదిరిపోయాను. ఎదురుగా ఉన్న బండ యొక్క పశ్చిమ ముఖం మీద రహస్య ర్యూనిక్ అక్షరాలు చూసి ఆశ్యర్యపోయాను. కాలం ప్రభావం వల్ల చాలా మటుకు అక్షరాలు చెరిగిపోయాయి. వాటి మధ్యలో మా జీవితానికి శనిలా దాపురించిన ఓ పేరు చూసి అట్టుడికినట్టు ఉడికిపోయాను.



“ఆర్నే సాక్నుస్సేమ్!” మామయ్యే ఆ పేరుని పైకి చదివాడు. “ఇప్పటికైనా నీ సందేహం తీరిందా?”




నేనేం మాట్లాడలేదు. అంతకు ముందు నేను కూర్చున్న లావా వేదిక వద్దకి తిరిగి వెళ్లాను. కాసేపు ఆలోచనలు స్తంభించిపోయాయి. అక్కడ కనిపించిన సాక్ష్యాధారాలకి దిమ్మదిరిగిపోయింది.




కొంతసేపు మనసంతా ఏవేవో ఆలోచనలతో అలజడిగా అయిపోయింది. కాసేపయ్యాక నేను తలెత్తి చూసేసరికి ఎదురుగా మామయ్య, హన్స్ నిలబడి ఉండడం మాత్రం గుర్తు. మాకు తోడుగా అంతవరకు వచ్చిన ఐస్లాండ్ వాసుల బృందం అల్లంత దూరంలో వెనక్కు తిరిగి వెళ్లిపోతూ కనిపించారు. ఇక నాకైతే ఆ విచిత్ర దృశ్యానికి స్పందించే ఓపిక కూడా లేదు. రెప్పలు వాలిపోతున్నాయి.



హన్స్ ఓ పెద్ద బండ వద్ద, లావా వేదిక మీద పడుకున్నాడు. కాని మామయ్య మాత్రం అగ్నిబిలం అడుగున బోనులో పులిలా ఉద్రేకంగా అటు ఇటు ఒకటే తిరిగేస్తున్నాడు. ఈ పాతాళగృహంలో ఏ క్షణం ఏ అవాంతరం జరుగుతుందోనని ఒక పక్క బిక్కుబిక్కుమంటూనే వున్నా హన్స్ బాబునే ఆ క్షణం ఆదర్శంగా తీసుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాను.



ఆ విధంగా ఆ అగ్నిబిలంలో మొదటి రాత్రి సురక్షితంగా గడిపేశాం.



మర్నాడు ఉదయం లేచి చూస్తే ఆకాశం మేఘావృతమై వుంది. అలుసిస్తే లోపలికి చొచ్చుకు వచ్చేటంతగా మబ్బులు పర్వత ముఖం మీదుగా ముసిరి వున్నాయి.



ఈ విషయాన్ని నేను కేవలం ప్రకృతి విలాసాన్ని చూసి గ్రహించలేదు. మామయ్య ధుమధుమలాడుతుంటే చూసి తెలుసుకున్నాను.



కారణం ఏమిటో తెలిశాక హృదయంలో ఓమూల ఏదో చిన్న ఆశ చిగురించింది. అసలు విషయం ఇది.

ఇప్పుడు మా ఎదుట మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి సాక్నుస్సేం తీసుకున్న దారి. మహాపండితుడైన ఆ ఐస్లాండర్ రాసిన రహస్య సందేశంలో ఆ మార్గం సూచించబడింది. స్కార్టారిస్ పర్వతపు నీడ జూన్ నెల చివరి రోజుల్లో ఆ దారి మీదుగా పడుతుందట.



ఓ పెద్ద సౌరగడియారపు స్తంభంలా ఆ పర్వతపు నీడ భూమి కేంద్రానికి తీసుకుపోయే మార్గాన్ని సూచిస్తుందట.
కాని ఆ క్షణం మాకు సూరీడు లేడు, నీడా లేదు. దారి తెన్ను తెలియలేదు. ఆ రోజు తేదీ జూన్ 25. మరో ఆరు దినాలు ఇలాగే మేఘావృతమై ఉంటే మేం ఈసారికి ఇక ఇంటికెళ్లిపోయి మళ్లీ మరుసటేడు రావలసిందే.

ఆ క్షణం పట్టరాని కోపంతో ఊగిపోతూ మామయ్య చేస్తున్న తాండవాన్ని వర్ణించడానికి నాకైతే శబ్దజాలం సరిపోదు. గడియలు గడిచిపోతున్నాయి గాని పర్వతపు లోపలి గోడల మీద ఏ నీడా పడలేదు. హన్స్ ఉన్నచోటి నుండి కదల్లేదు. మేం ఎందుకోసం ఎదురుచూస్తున్నామో తనకి అర్థమై వుండదు. విషయాన్ని విశదీకరించడానికి మామయ్య కూడా నోరు మెదపలేదు. కన్నార్పకుండా కారుమబ్బుల కేసి గుర్రుమని చూస్తూ ఉండిపోయాడు.

26 వ తేదీ ఉదయం కూడా సూర్యుడి ఆచూకీ లేదు. రోజు పొడవునా వర్షం, మంచు కలిసి కురిశాయి. హన్స్ గట్టిపడ్డ లావా ముక్కలతో చిన్న గుట్టలాగా చేశాడు. అగ్నిపర్వతపు శంకువులోకి వస్తున్న చిట్టిపొట్టి జలపాతాలని చూస్తూ, వాటి గతికి అడ్డుపడే రాళ్లని అవి తన్నే తాపులకి పుట్టే భీభత్సమైన ఘోషని వింటూ ఒక విధమైన తుంటరి ఆనందాన్ని అనుభూతి చెందాను.

ఆదిలోనే హంసపాదు అన్నట్టున్న మా పరిస్థితికి మామయ్య కోపం కట్టలు తెంచుకుంది.
చెడుతో పాటూ మంచి కూడా దాని నీడలా వెంటే వస్తుందంటారు. ప్రస్తుతం ఎంత ఆందోళన చెందుతున్నాడో, అంతకు తగ్గ మోతాదులో ఆనందావకాశాలు కూడా ముందు ఉన్నాయని ఆ క్షణం ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ కి తెలీదు.

(ఇంకా వుంది)

కేంబ్రిడ్జ్ లో డార్విన్ (1828-1831)

Posted by V Srinivasa Chakravarthy Saturday, April 7, 2012 0 comments

రెండేళ్లు నేను ఎడింబర్గ్ లో గడిపాక మా నాన్నగార్కి ఒక విషయం తెలిసింది. మరి మా అక్కలు చెప్తే విన్నారో, లేక తనకే అనిపించిందో తెలీదు గాని నాకు డాక్టరు కావడం ఇష్టం లేదని గుర్తించారు. పోని చర్చ్ లో క్లర్జీ కావచ్చు కదా అని సూచించారు. ఊరికే క్రీడా కలాపాలతో జీవితం అంతా గడిపేస్తానేమో నని ఆయన భయం. ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలని అడిగాను. ఇంగ్లండ్ చర్చిల నియమావళికి తట్టుకోగలనో లేదో నన్న భయం ఒక పక్క ఉన్నా, చిన్న పల్లెటూరి చర్చిలో క్లర్జీగా ఉండడం బాగానే ఉంటుందని అనిపించింది. కనుక "Pearson on the Creed" (మత ధర్మం గురించి పియర్సన్) పుస్తకం తో బాటు, మత సాంప్రదాయం గురించి తదితర పుస్తకాలు కూడా చదివాను. ఆ రోజుల్లో బైబిల్ చెప్పింది అంతా అక్షరాల నిజమని నమ్మేవాణ్ణి. కనుక మత ధర్మానికి అందరూ కట్టుబడి ఉండాలనే అభిప్రాయమే ఉండేది.

కనుక మత ఛాందస వాదులు నా మీద ఈ రోజుల్లో ధ్వజం ఎత్తడం చూస్తుంటే, నేనేనా ఒకప్పుడు క్లర్జీ అవుదాం అనుకున్నది అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. కేంబ్రిడ్జ్ లో చదువు ముగించి, ప్రకృతి పరిశోధన మీద "బీగిల్" ఓడ మీద అడుగుపెట్టిన నాడే మత దీక్ష పుచ్చుకోవాలన్న నా సంకల్పం, మా నాన్నగారి అభీష్టం రేండూ భూస్థాపితం అయిపోయాయి. అయితే మతాధికారికి కావలసిన ఒక్క లక్షణం మాత్రం నాలో ఉంది. కొన్నేళ్ల క్రితం జర్మన్ మనస్తత్వ శాస్త్ర సమాజానికి చెందిన అధికారులు నా ఫోటో ఒకటి పంపమంటూ ఉత్తరం రాశారు. ఆ అరువాత ఆ సమాజం యొక్క సమావేశానికి చెందిన వ్యవహార పత్రిక (proceedings) కాపీ ఒకటి నాకు అందింది. ఆ పత్రికలో అచ్చయిన నా ఫోటోలో నా తల ఆకృతి గురించి ఆ సమాజంలో కొంత చర్చ జరిగిందట. ఉబికి వస్తున్న నా నుదుటిని బట్టి నాలో పది మంది మతాధికారులని కలబోసినంత సత్తా ఉందని ఎవరో అన్నార్ట!

ఇక ఎలాగూ మతాధికారి కావాలని అనుకున్నారు గనుక, విశ్వవిద్యాలయానికి వెళ్లి పట్టా పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కాని బడి చదువులు ముగిశాక సాంప్రదాయక గ్రంథాలేవీ తెరిచిన పాపాన పోలేదు. పైగా ఈ రెండేళ్ల వారడిలో, ముందు నేర్చుకున్న ఆ నాలుగు ముక్కలు కూడా మర్చిపోయాను. గ్రీకు అక్షరాలు కూడా ఇప్పుడు సరిగ్గా గుర్తులేవు. కనుక సెమిస్టర్ మొదలయ్యే సమయానికి , అంటే అక్టోబర్ లో, కేంబ్రిడ్జ్ లో చేరలేదు. ష్రూ బరీ లోనే ప్రైవేటుగా కొంత కాలం చదువుకున్నాను. తరువాత, అంటే క్రిస్టమస్ సెలవల తరువాత 1828 సంవత్సరాది తరువాత కేంబ్రిడ్జ్ లో చేరాను. త్వరలోనే వెనకటి రోజుల్లో బళ్ళీ చదువుకునే రోజుల్లో ఉండే భాషా సామర్థ్యాన్ని తిరిగి సాధించాను. హోమర్ రచనలు, గ్రీకులో రాసిన టెస్టమెంట్ మొదలైన పుస్తకాలు సులభంగా సమకాలీన ఇంగ్లీష్ భాషలో తర్జుమా చెయ్యగలిగేవాణ్ణి.

ఇక చదువు విషయానికి వచ్చేసరికి కేంబ్రిడ్జ్ లో గడిపిన మూడేళ్లూ వృథా అయ్యాయనే చెప్పాలి. ఏడినబర్గ్ లో బళ్లో జరిగిందే ఇక్కడా జరిగింది. 1828 వేసవిలో ఓ ప్రైవేటు మాస్టరు (వట్టి మొద్దు మనిషి) దగ్గర లెక్కలు నేర్చుకోవడం మొదలెట్టాను. ఆ చదువు మందకొడిగానే సాగింది. బీజగణితం పుస్తకంలో అన్నీ గజిబిజి చిహ్నాలే కనిపించి రోత పుట్టేది. కాని ఇప్పుడు ఆలోచిస్తే నా పద్ధతి తప్పని అనిపిస్తుంది. గణిత శాస్త్రానికి పునాది రాళ్లలాంటి ఆ భావ బీజాలని జీర్ణం చేసుకోకుండా నేను పెద్ద పొరబాటే చేశాను. ఎందుకంటే గణిత భావాలతో ప్రకృతిని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చని తరువాత తెలుసుకున్నాను. కనుక ఆ రంగంలో బొటాబొటి మార్కులతోనే పాసు అయ్యుంటాను. ఇక సాంప్రదాయ చదువులకి వచ్చేసరికి తప్పనిసరిగా హాజరు కావలసిన క్లాసులకి మాత్రం వెళ్లేవాణ్ణి. రెండవ ఏడు “Little-Go” పరీక్ష పాసు కావుడానికి ఒకటి, రెండు నెలలు చదవాల్సి వచ్చింది. ఇక బీ.ఏ. చివరి సంవత్సరం కనుక ఫైనలు పరీక్ష కోసం కొంచెం శ్రద్ధగా చదువుదాం అనుకున్నాను. బీ.ఏ. పరీక్ష పాసు కావడానికి ప్రొఫెసర్ పార్లే రాసిన "క్రైస్తవ మతానికి ఆధారాలు" , "నీతి శాస్త్రం" పుస్తకాలు చదవాలి. ఈ రెండు పుస్తకాలు బాగా చదివాను అనుకుంటా. ముఖ్యంగా "క్రైస్తవ మతానికి ఆధారాలు" పుస్తకం సాంతం అక్షరం పొల్లుపోకుండా రాయగలిగే వాణ్ణి. ఈ పుస్తకంలో తర్కం చదువుతుంటే యూక్లిడ్ జ్యామితి చదువుతున్న ఉత్సాహంగా ఉండేది. ఆ పుస్తకాలని పరీక్షల కోసం బట్టీ వేయకుండా, లోతుగా క్షుణ్ణంగా చదవడం నా మానసిక వికాసానికి ఎంతో ఉపకరించింది. పార్లీ రచనలలోని పూర్వసిద్ధాంతాల (premises) గురించి నేను పట్టీంచుకోలేదు. వాటిని సందేహించలేదు. నాకు అన్నిటికన్నా నచ్చింది అందులోని సుదీర్ఘమైన వాదనా క్రమం. సంవత్సరాంతం పరీక్షల్లో పార్లీ మీద పరీక్షలోను, యూక్లిడ్ మీద పరీక్షలోను బాగా రాయడం వల్ల, సాంప్రదాయక అధ్యయనాల లో కూడా నిలదొక్కుకోవడం వల్ల, 'హానర్సు స్థాయికి చేరకపోయినా, ఆ స్థాయి కన్నా కింద నుండే బడుగు వర్గం వారిలో ఉన్నత స్థానాన్నే పొందాను. సరిగ్గా జ్ఞాపకం లేదు గాని వాళ్లలో నా స్థానం ఐదో, పదో, పన్నెండో ఉన్నట్టు గుర్తు.

(ఇంకా వుంది)

కాంతి కణ సిద్ధాంతం

Posted by V Srinivasa Chakravarthy Wednesday, April 4, 2012 3 comments


కాంతి కణ సిద్ధాంతం
“పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలు” పుస్తకంలో,
“యూనిట్ 7, కాంతి, కాంతి స్వభావం – కాంతి జనకాలు” అన్న పాఠం నుండి.

భౌతిక శాస్త్ర చరిత్రలో ఒక దశలో ఎన్నో రాశులని స్థూల పదార్థాలుగా ఊహించుకునేవారు. ఉదాహరణకి ఉష్ణం ఒక శక్తి రూపం అని మనకి ఇప్పుడు తెలుసు. కాని తొలిదశలలో ఉష్ణం ఒక ద్రవం అని భావించేవారు. ఓ వేడి వస్తువు నుండి ఓ చల్లని వస్తువులోకి ఉష్ణం ప్రవహిస్తున్నప్పుడు నిజంగా ఏదో ద్రవం ఒక వస్తువు నుండి మరో వస్తువు లోకి ప్రవహిస్తోంది అని తప్పుగా అనుకునేవారు. అదే విధంగా అంతరిక్షం అంతా వట్టి శూన్యం కాదని, అందులో ఏదో ద్రవం వ్యాపించి వుందని అనుకునేవారు. ఆ ద్రవాన్ని ‘ఈథర్’ అనేవారు.

అదే విధంగా వెనకటి రోజుల్లో కాంతి కూడా ఒక రకమైన పదార్థం అనుకునేవారు. కాంతిలో చిన్న చిన్న కణాలు ఉంటాయని, ఆ కణాలు వేగంగా ప్రయాణిస్తుంటాయని, ఆ కణాల ప్రవాహమే కాంతి అని న్యూటన్ బోధించాడు. ఆ సిద్ధాంతాన్నే ‘కాంతి కణ సిద్ధాంతం’ అంటారు. ఆ సిద్ధాంతం ప్రకారం –

1. కాంతి తేలికైన, అతి చిన్న పరిపూర్ణ స్థితిస్థాపక (perfectly elastic) కణాలతో కూడుకున్న ప్రవాహం.
ఈ ‘స్థితి స్థాపకత’ అంటే ఏంటి? కాంతి కణాలు స్థితిస్థాపక కణాలు అని ఎందుకు అనుకోవలసి వచ్చింది?
ఒక వస్తువు మీద మనం బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు రూపురేఖలు మారుతాయి. ఉదాహరణకి ఒక టెన్నిస్ బంతిని వత్తితే దాని రూపురేఖలు మారిపోతాయి. తరువాత బలాన్ని తొలగించినప్పుడు వస్తువు యొక్క రూపురేఖలు మునుపటి స్థితికి వస్తే ఆ వస్తువుకి ‘స్థితిస్థాపక’ లక్షణం ఉందన్నమాట. అంటే దాని ‘స్థితి’ని తిరిగి ‘స్థాపించుకునే’ లక్షణం అన్నమాట. అన్ని వస్తువులూ స్థితి స్థాపకాలు కావు. ఉదాహరణకి ఒక బంకమట్టి ముద్దని నొక్కి వదిలితే దాని మారిని రూపురేఖలు అలాగే ఉండిపోతాయి. మొదటి స్థితికి రావు.

స్థితిస్థాపక లక్షణం గల ఒక బంతిని ఒక ఎత్తు నుండి స్థితిస్థాపక లక్షణం గల నేల మీదకి వదిలితే, బంతి ఎంత ఎత్తు నుండి పడిందో మళ్ళీ అంతే ఎత్తుకి లేస్తుంది. అలాగే ఆ బంతిని నేల మీదకి వాలుగా విసిరితే, అభిలంబం నుండి ఎంత కోణంలో పడుతుందో, అంతే కోణంలో పైకి లేస్తుంది. ఈ లక్షణమే కాంతి యొక్క పరావర్తన లక్షణాన్ని వివరించడానికి పనికొస్తుంది. ఈ ఉద్దేశంతోనే కాంతి కణాలు స్థితిస్థాపక లక్షణం గలవని న్యూటని ప్రతిపాదించాడు. ఆ వివరాలు ముందు ముందు చూస్తాం.

2. ఈ కణాలు కాంతిని వెలువరించే కాంతి జనకాల నుండి వెలువడతాయి.
3. ఆ కణాలు అన్ని దిశలలో ఋజుమార్గాలలో ప్రయాణిస్తాయి.
4. ఆ కణాల వేగం వేరు వేరు విక్షేపక యానకాలలో (refractive media) వేరు వేరుగా ఉంటుంది.
5. ఆ కణాలు కంటిలో రెటినాని తాకినప్పుడు దృశ్య జ్ఞానం కలుగుతుంది.
కంట్లో రెటీనాలోని ‘ఫోటోరిసెప్టార్ల’ మీద కాంతి కణాలు పడినప్పుడు, ఆ కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఆ విద్యుత్ సంకేతాలు నాడుల ద్వారా మెదడుని చేరినప్పుడు చూసిన అనుభూతి కలుగుతుంది.
6. ఆ కణాలు వేరు వేరు పరిమాణాలలో ఉంటాయి. దీని వలన కాంతికి వేరు వేరు రంగులు ఏర్పడుతాయి.

కాంతి పరావర్తనం

కణ సిద్ధాంతంతో కాంతి పరావర్తనాన్ని ఏ విధంగా వివరించొచ్చు?
ఓ రబ్బరు బంతిని ఒక ఎత్తు నుండి కింద పడేస్తే అది నేల మీద అభిలంబంగా పడి, తిరిగి తిన్నగా పైకి లేస్తుంది. అదే వాలుగా పడేస్తే అదే వాలుతో పైకి లేస్తుంది. పరావర్తనం చెందుతున్న కాంతి కూడా ఇదే పరావర్తన నియమాన్ని అనుసరించడం విశేషం.

కాంతి పరావర్తనాన్ని పరిశీలించడానికి ఓ చిన్న ప్రయోగం.
ప్రయోగానికి కావలసిన సరంజామా:
- ఓ లేజర్ పాయింటర్
- ఓ చిన్న అద్దం
- మూత ఉన్న, పారదర్శకమైన గోడలున్న ఓ ప్లాస్టిక్ డబ్బా
- ఓ అగర్బత్తి, అగ్గిపెట్టె

అగర్బత్తి వెలిగించి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి. కాసేపట్లో డబ్బా అంతా పొగతో నిండిపోతుంది. అప్పుడు డబ్బా అడుగులో అద్దం ఉంచి డబ్బా మూత మూసేయాలి. ఇప్పుడు బయటి నుంచి లేజర్ పాయింటర్ యొక్క కాంతి రేఖ అద్దం మీద పడేలా వేయాలి. డబ్బాలో పొగ ఉంటుంది కనుక, ఆ పొగలో కాంతి రేఖని స్పష్టంగా చూడొచ్చు. కాంతి రేఖ కింద అద్దం మీద పడి, పరావర్తనం చెంది డబ్బా అవతలి పక్క నుండి బయటికి రావడం స్పష్టంగా చూడొచ్చు. కాంతి అద్దం మీద పడే కోణాన్ని పతన కోణం (i, angle of incidence) అంటారు. ఇది అద్దానికి లంబంగా ఉండే రేఖకి, పతన కాంతి రేఖకి మధ్య కోణం. అలాగే పరావర్తనం చెందిన కాంతి రేఖకి అద్దం యొక్క లంబానికి మధ్య కోణం ‘పరావర్తన కోణం’ (r, angle of reflection). ఈ రెండు కోణాలు సమానమని స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ ప్రయోగంలో i, r ల విలువలని కొలవడం లేదు. కనుక ఈ ప్రయోగంలో ఊరికే కంటితో చూసి ఉజ్జాయింపుగా ఈ రెండు కోణాలు ఒక్కటే నని చెప్పడానికి మాత్రమే వీలవుతుంది. కోణాలని కొలిచి వాటి సమానతని నిర్ధరించడానికి వేరే పద్ధతులు ఉన్నాయి.


కాంతి వక్రీభవనం

న్యూటన్ తన ‘కాంతి కణ సిద్ధాంతం’తో కాంతి వక్రీభవనాన్ని ఈ విధంగా వివరించాడు. కాంతి కణ ప్రవాహం విరళ యానకం నుండి సాంద్రతర యానకం లోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సాంద్రత యానకంలో పదార్థం (విరళయానకంలో కన్నా) ఎక్కువగా ఉంటుంది కనుక దానికి గురుత్వం ఎక్కువగా ఉంటుంది. ఆ గురుత్వం చేత ఆకర్షించబడి కణాలు వేగం పుంజుకుంటాయి. సాంద్రతర యానకంలోకి ప్రవేశించాక నిలువు దిశలో వేగం పెరగడం వల్ల కాంతి దిశ కూడా మారుతుంది. కింది చిత్రంలో సాంద్రతర యానకం కాంతి ప్రవాహాన్ని కిందికి లాగుతోంది. కనుక కాంతి దిశ కూడా ఋజురేఖకి కాస్త కుడిపక్కకి తిరుగుతుంది. ఈ విధంగా న్యూటన్ తన కాంతి కణ సిద్ధాంతంతో కాంతి వక్రీభవనాన్ని కూడా వివరించాడు.

అయితే పై వివరణ తప్పని ఇప్పుడు మనకి తెలుసు. ముందుగా సాంద్రతర యానకంలో కాంతి వేగం పెరగదు, తగ్గుతుంది. ఇంత చిన్నమోతాదు పదార్థానికి కాంతి రేఖ మీద గురుత్వ ప్రభావం అత్యంత అల్పంగా ఉంటుంది. (అతి భారీ వస్తువు అయిన సూర్యుడి యొక్క గురుత్వం కూడా కాంతి రేఖని కాస్తంత మాత్రమే మళ్ళించగలుగుతుంది. ఇక మన చుట్టూ కనిపించే వస్తువుల గురుత్వం ఎంత తక్కువగా ఉంటుందంటే కాంతి మీద వాటి గురుత్వ ప్రభావం లేనట్టే. కనుక కాంతి వక్రీభవనం చెందిందంటే అది యానకం యొక్క గురుత్వం వల్ల కాదు.)

కాంతి వక్రీభవనాన్ని పరిశీలించడానికి ఓ చిన్న ప్రయోగం.
ప్రయోగానికి కావలసిన సరంజామా:
- ఓ లేజర్ పాయింటర్
- మూత ఉన్న, పారదర్శకమైన గోడలున్న ఓ ప్లాస్టిక్ డబ్బా
- ఓ అగర్బత్తి, అగ్గిపెట్టె
- కొంచెం నీరు
- కాస్త కుంకుమ

ప్లాస్టిక్ డబ్బా లో సగం వరకు నీరు నింపాలి. ఆ నీళ్లలో కుంకుమ కలపాలి. నీళ్ల పైభాగంలో ఉండే గాలిలో కాసేపు అగర్బత్తి పెట్టి అక్కడ పొగ నిండేట్టు చెయ్యాలి. ఇందాకట్లాగే లేజర్ పాయింటర్ కాంతిని ప్రసరిస్తే ఆ కాంతి ముందు పొగ లోంచి ప్రయాణించి, నీట్లోకి ప్రవేశిస్తుంది. ఎర్రబారిన నీటిలో లేజర్ పాయింటర్ నుండి వచ్చే కాంతి ప్రసారం అయినప్పుడు ఆ కాంతి రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. పొగ లోంచి కుంకుమ నీట్లోకి కాంతి ప్రవేశించినప్పుడు కాంతి రేఖ వంగడం స్పష్టంగా కనిపిస్తుంది.

(ఇంకా వుంది)

ఎడిన్బర్గ్ లో డార్విన్ జీవితం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, April 3, 2012 3 comments

ఎడింబర్గ్ లో రెండవ సంవత్సరం భౌగోళిక శాస్త్రం మీద, జంతు శాస్త్రం మీద ఉపన్యాసాలు విన్నాను. ఆ ఉపన్యాసాలు నాకు నిస్సారంగా అనిపించాయి. ఆ ఉపన్యాసాల వల్ల నేను నేర్చుకుంది ఒక్కటే. ఇక జన్మలో మళ్లీ భౌగోళిక శాస్త్రం మీద పుస్తకం ముట్టుకోకూడదని నిశ్చయించుకున్నాను. అయితే ఆ రంగం గురించి అప్పటికే నా మనసులో ఒక విధమైన తాత్వికమైన అవగాహన ఏర్పడింది. అప్పటికి రెండు, మూడేళ్ల క్రితమే ష్రాఫ్ షైర్ కి చెందిన కాటన్ అనే ఓ పెద్దాయన, రాళ్ల గురించి బాగా తెలిసిన ఆయన, ష్రూస్ బరీ కి దగ్గర్లో ఉన్న ఓ విచిత్రమైన పెద్దరాయి గురించి చెప్పాడు. కంబర్లాండ్, స్కాట్లాండ్ వరకు గాలించినా అలాంటి రాయి కనిపించదని అనేవాడు. అసలా ఆ రాయి అక్కడికి ఎలా వచ్చిందో ఎవరైనా చెప్పగలిగే లోపు యుగాంతం వచ్చేస్తుందని ధీమాగా చెప్పేవాడు. ఈ కథ నా మనసులో గాఢంగా ముద్ర పడిపోయింది. ఆ కథ గురించి ఎన్నో సార్లు ఆలోచించేవాణ్ణి. తరువాత ఒక సారి హిమశకలాలు (iceberg)లు ఇలాంటి బండలని ఒక చోటి నుండి మరో చోటికి ఎలా రవాణా చేస్తాయో చదివి, భౌగోళిక శాస్త్రం ఎంత అర్థవంతమైన, అందమైన శాస్త్రమో తెలుసుకుని అబ్బురపడ్డాను.

కాని ఇటీవలి కాలంలో, అంటే నాకు అరవై ఏడు ఏళ్ల వయసులో, అదే ప్రొఫెసర్ ఓ ఉపన్యాసం ఇవ్వగా విన్నాను. సాలిస్బరీ క్రెయిగ్స్ లో ఇచ్చిన ఆ ఉపన్యాసంలో ‘డైక్’ ల గురించి మాట్లాడాడు. ఆ డైక్ లకి అమిగ్డలాయిడ్ రాతి (గట్టిపడ్డ లావాలో గాలి బుడగలు చిక్కుకున్న రాయి) అంచులు ఉన్నాయి, లావా గట్టిపడగా మరింత కఠినంగా మారిన (indurated) స్తరాలు ఇరుపక్కలా ఉన్నాయి. నలుదిశలా అగ్నిపర్వత శిలలు (volcanic rocks) ఉన్నాయి. అలాంటి రాతిని పట్టుకుని అది పైనుండి దిగివచ్చి చీలికల్లో (fissures) కూరుకున్న అవక్షేపక (sediment) పదార్థం వల్ల ఏర్పడ్డ రాయి అంటాడే?! పైగా అంటాడూ… “ఇలాంటి రాయి భూగర్భంలోంచి కరిగిన దశలో పైకి తన్నుకొచ్చిన పదార్థం వల్ల ఏర్పడింది అని కొందరు అపోహపడుతుంటారు, పాపం!” అని విషయం సరిగ్గా తెలిసిన వారిని ఎత్తిపొడుస్తాడు.* ఇలాంటి ఉపన్యాసాలు విన్నప్పుడే భౌగోళిక శాస్త్రం జోలికి పోకూడదన్న నా సంకల్పం బలపడుతుంది.

(* చిన్న మాట – ఈ వాక్యం మూలంలో మొదట చదివినప్పుడు ఏమీ అర్థం కాలేదు. డా. రవికాంత్ అని ఐసర్ (కొల్కతా) లో పనిచేసే ఓ జియాలజిస్ట్ ని అడిగి సందేహనివారణ చేసుకున్నాక కొంచెం అర్థమయ్యింది. మూలంలోని వాక్యం ఇక్కడ ఇస్తున్నాను. బ్లాగర్లలో జియాలజీ గురించి పరిచయం ఉన్నవారికి దీని గురించి బాగా తెలియొచ్చు.
“Equally striking is the fact that I, though now only sixty-seven years old, heard the Professor, in a field lecture at Salisbury Craigs, discoursing on a trapdyke, with amygdaloidal margins and the strata indurated on each side, with volcanic rocks all around us, say that it was a fissure filled with sediment from above, adding with a sneer that there were men who maintained that it had been injected from beneath in a molten condition.”
- అనువాదకుడు)

ఈ ఉపన్యాసాలకి వెళ్లే రోజుల్లోనే మ్యూజియం క్యురేటర్ తో పరిచయం ఏర్పడింది. ఈ మక్ గిలివ్రే తదనంతరం స్కాట్లండ్ పక్షుల మీద ఓ అద్భుతమైన పుస్తకం రాశాడు. ఇతడితో ప్రకృతి చరిత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన చర్చలు జరిపాను. ఈయన నాకు కొన్ని అరుదైన గవ్వలు ఇచ్చాడు. ఆ రోజుల్లో నేను, మరీ అంత ఇదిగా కాకపోయినా, సముద్రపు గవ్వలు సేకరించేవాణ్ణి.

ఈ రెండేళ్లూ వేసం కాలం సెలవలు విలాసాలలోనే గడచిపోయాయి. అయితే ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం ఉండేది. దాన్ని ఆసక్తిగా చదువుతూ ఉండేవాణ్ణి. 1826 లో నేను మరిద్దరు స్నేహితులతో ఉత్తర వేల్స్ ప్రాంతం అంతా కాలినడకన ప్రయాణం చేశాం. సగటున రోజుకి ముప్పై మైళ్ల దాకా నడిచేవాళ్లం. అప్పుడే ఒక రోజు స్నోడన్ కొండ కూడా ఎక్కాం. మరో సారి ఉత్తర వేల్స్ అంతా మా చెల్లెలి తో పాటు గుర్రం మీద యాత్ర చేశాం. మాతో పాటు ఒక పని వాడు బట్టలు మోస్తూ కూడా వచ్చాడు. ఇక శరత్ ఋతువు అంతా షూటింగ్ ఆటల్లోనే గడచిపోయింది. వుడ్ హౌస్ లో ష్రీ ఓవెన్ గారి ఇల్లు, అలాగే మాయర్ లో మా జోస్ మావయ్య ఇల్లు ఈ ఆటలకి నెలవు అయ్యాయి. షూటింగ్ అంటే నాకు ఎంత పిచ్చి ఉండేదంటే రాత్రి పడుకునే ముందు షూటీంగ్ బూట్లు నా తల పక్కనే పెట్టుకుని పడుకునే వాణ్ణి. ఉదయం లేవగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా ఆ బూట్లు వేసుకుని, తుపాకీ పట్టుకుని పరుగెత్తేవాణ్ణి.

ఆ కాలంలో కొట్టిన ప్రతీ పిట్ట గురించి వివరంగా నా డైరీలో రాసుకున్నాను. ఒక రోజు వుడ్ హౌస్ లో ఓవెన్ పరివారంలో పెద్ద కొడుకైన కాప్టెన్ ఓవెన్, అతడి బావ మేజర్ హిల్ (ఇతడే తదనంతరం లార్డ్ బెర్విక్ అయ్యాడు) షూటింగ్ చేస్తున్నారు. వాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆ రోజు మాత్రం ఇద్దరూ నన్ను భలే బోల్తా కొట్టించారు. నేనో పిట్టని కొట్టిన ప్రతీ సందర్భంలోను ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అప్పుడే వాళ్ల తుపాకిలో తూటా ఎక్కిస్తున్నట్టు నటిస్తూ, " ఆ పిట్ట నువ్వు కొట్టింది కాడు, నేనూ అదే సమయంలో కాల్చాను," అనడం మొదలెట్టారు. ఆటని చూడ్డానికి వచ్చిన మధ్యవర్తి కూడా వాళ్లనే సమర్ధించసాగాడు. అలా కొన్ని గంటల తరువాత చేసిన మోసం ఏమిటో చల్లగా చెప్పారు. నేను చాలా పిట్టలే కొట్టాను. కొట్టిన ప్రతీసారి నా చొక్కా కి తగిలించుకున్న ఒక దారంలో ఒక ముడి వేస్తూ వచ్చాను. కాని నా నేస్తాల మోసం వల్ల ఆ లెక్కలన్నీ గల్లంతు అయ్యాయి.

షూటింగ్ అంటే నాకు తెగ ఇష్టం ఉండేది! ఇలాంటి వ్యాపకం అంటే ఇష్టం ఉండడం గురించి మనసులో ఏదో మూల కొంచెం అపరాధ భావం ఉండేదేమో. షూటింగ్ బుద్ధి కుశలతకి, ఏకాగ్రతకి మంచి పరీక్ష అని నాకు నేనే సంజాయిషీ చెప్పుకునేవాణ్ణి. జంతువులని వేటాడాలంటే ఎంతో నైపుణ్యం కావాలి.

1826 లో శరత్తులో ఒక సారి మాయర్ కి వెళ్లినప్పుడు అక్కడ సర్ జె. మాకింటాష్ తో పరిచయం ఏర్పడింది. ఆయన గొప్ప మాటకారి. అలాంటి మాటకారిని నేను మరెక్కడా చూడలేదు. ఒక సారి ఎవరితోనో నా గురించి "ఆ కుర్రవాడిలో ఏదో ప్రత్యేకత ఉంది," అన్నాట్ట. బహుశ ఆయన అన్న ప్రతీ మాటని చెవులు రిక్కించి వింటాను గనుక అలా అని వుంటాడు. చరిత్ర, రాజకీయం, నైతికత మొదలుగా ఆయన మాట్లాడిన అంశాల గురించి అంత వరకు నాకు అసలేమీ తెలీదు. ప్రముఖుల పొగడ్త వల్ల కొంచెం గర్వం పెరిగే ప్రమాదం లేకపోలేదు. కాని యవ్వనంలో ఉన్న వ్యక్తి కి అలాంటి మెచ్చుకోలు మంచి చేస్తుందని, సన్మార్గంలో నడిచే స్ఫూర్తి నిస్తుందని అనిపిస్తుంది.

ఈ శరత్కాల షూటింగ్ విలాసాలని పక్కన పెట్టినా, మాయర్ లో నేను ఉన్న రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. ఏ బాదర బందీలు లేని జీవితం. పగలంతా షికార్లలో, స్వారీలలో సాగిపోయేది. ఇక సాయంత్రాలు ఆసక్తికరమైన సంవాదాలలో, సంభాషణలలో, కమ్మని సంగీతం జోడైన విందుల్లో, విలాసాలలో గడచిపోయేవి. ఇక వేసవిలో అయితే సాయంత్రాలు ఇంటిల్లిపాదీ పాత పోర్టికో మెట్ల మీద కూర్చునేవాళ్లం.

ఎదురుగా పూలతోట. అల్లంత దూరంలోని చెరువులో, ఏటికి అవతల గట్టున ఉన్న అడవి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఉండుండి ఓ చేప నీటి బయటికి తలెత్తి ఆకాశం కేసి చూసి మళ్లీ బుడుంగున మునుగిపోతుంది. లేదా ఓ బాతు తన వెడల్పైన పాదాలతో నీళ్లు తోసుకుంటూ పరధ్యానంగా నీటి మీద విహరిస్తూ ఉంటుంది. మాయర్ లో గడిపిన ప్రశాంత సాయం సమయాలు నా మనసులో ఎంత గాఢమైన ముద్ర వేశాయో చెప్పలేను.

మా జోస్ మామయ్య అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆయన మితభాషి అయినా నాతో కొన్ని సార్లు మనసు విప్పి మాట్లాడేవారు. చాలా ముక్కుసూటి మనిషి. ఫలానా పద్ధతి సరైన పద్ధతి అని ఒకసారి ఆయనకి నమ్మకం కుదిరింది అంటే ఇక ప్రపంచంలో ఏ శక్తీ ఆయన మార్గాన్ని మళ్లించలేదు. ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు గాని "హోరేస్ ప్రశంస" లో "nec vultus tyranni etc." మొదలైన వర్ణన ఆయనకి చక్కగా సరిపోతుందని ఎన్నో సార్లు అనుకున్నాను. (Justum et tenacem propositi virum Non civium ardor prava jubentium Non vultus instantis tyranni Mente quatit solida.)

(అధ్యాయం సమాప్తం)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts