శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

బోస్ - ఇండియాకి తిరిగి రాక

Posted by V Srinivasa Chakravarthy Sunday, January 3, 2010
బోస్ - ఇండియాకి తిరిగి రాక

తన ప్రతిభా పాటవాల గురించి ఫాసెట్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చిన సిఫారసు పత్రాన్ని పట్టుకుని ఇండియాకి తిరిగి వచ్చిన బోస్ అప్పటికి వైస్రాయ్ గా ఉన్న లార్డ్ రిప్పన్ ని కలుసుకున్నాడు. రిప్పన్ గారి అభ్యర్థన మీదట, ప్రజా బోధనా రంగానికి అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆల్ఫ్రెడ్ క్రాఫ్ట్, బోస్ ని కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజిలో భౌతిక శాస్త్రపు ప్రొఫెసర్ గా నియమించాడు. కాలేజి ప్రిన్సిపాలు గా ఉన్న సి.హెచ్. టానీ ఆ సంగతి నచ్చక కొంచెం నిరసన చూపించినా, పై అధికార్ల ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు.

నియామకం అయితే జరిగిపోయింది గాని, బోస్ కి కాలేజిలో జాత్యహంకార వేధింపు మొదలయ్యింది. పరిశోధనలకి అవసరమైన వసతులు అందలేదు. జీతంలో కూడా వివక్ష చూపించేవారు. ఆ రోజుల్లో ప్రొఫెసర్ హోదాలో ఉన్నవాడు భరతీయుడైతే జీతం Rs. 200 Rs. ఉండేది, యూరొపియన్ అయితే Rs. 300 ఉండేది. బయటి నుండి సిఫారసుతో వచ్చాడన్న కోపంతో బోస్ కి Rs. 100 మాత్ర్రమే అందేది. ఆత్మగౌరవాన్ని, జాతి గౌరవాన్ని దెబ్బ కొట్టే ఈ ఏర్పాటుని బోస్ సహించలేకపోయాడు. అసలు జీతమే పుచ్చుకోవడం మానేశాడు. అలా జీతం లేకుండా మూడేళ్లు పని చేశాడు. చివరికి ప్రజా బోధనా రంగానికి అధ్యక్షుడే కాక, కాలేజి ప్రిన్సిపాలు కూడా బోస్ ప్రతిభని, వ్యక్తిత్వాన్ని గుర్తించి తమ తప్పు దిద్దుకుంటూ, మూడేళ్ల జీతాన్ని ఒక్కసారిగా ఇచ్చారు. అదే ఊపులో బోస్ నియామకాన్ని ’పర్మనెంటు’ కూడా చేశారు!

ఈ కొత్తగా వచ్చిన నెలసరి జీతం తప్ప వేరే ఆదాయం లేని పరిస్థితిలో, ఇరవై ఐదు చదరపు అడుగుల గదినే ప్రయోగశాలగా చేసుకుని, ఓ చదువు రాని కంసాలికి తన వద్ద మెకానిక్ గా పనిచెయ్యడానికి శిక్షణనిచ్చి, 1894 లో తన ప్రయోగాలలో మునిగిపోయాడు బోస్. ఆ సమయంలో బోస్ ఎదుర్కుంటున్న సమస్యలని వర్ణిస్తూ, స్వామి వివేకానందుడి శిష్యురాలైన సిస్టర్ నివేదిత ఇలా అంటారు: “అర్థం లేని వేధింపులకి, కుటిల సమస్యలకి గురవుతున్న ఆ మహామేధావి పరిస్థితి చూసి అదిరిపోయాను... ఇక పరిశోధనలకి సమయం మిగలకుండా ఉండేట్టుగా అతడి కాలేజి దినచర్య వీలైనంత దుర్భరం గావించబడింది.” ఈ చికాకులన్నిటిని భరిస్తూ ఏకాగ్రచిత్తంతో పనిలో మునిగిపోయాడు బోస్.

అప్పటికి కొన్నేళ్ల క్రితమే జర్మనీలో హైన్రిక్ హెర్జ్ గాలిలో ప్రసారం కాగల రేడియో తరంగాలని (లేదా ’హెర్జియన్’ తరంగాలు) సృష్టించాడు. దాంతో ఇరవై ఏళ్ల క్రితం జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ సైద్ధాంతికంగా ప్రతిపాదించిన “ఈథర్ లో ప్రసరించే విద్యుదయస్కాంత ఆటుపోట్ల”కి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కొత్త విద్యుదయస్కాంత తరంగాలు కూడా కాంతి లాంటివేనని, (అసలు కాంతి కూడా ఒక విద్యుదయస్కాంత తరంగమేనని), కాంతికి మల్లె వీటికి కూడా పరావర్తనం (reflection), వక్రీభవనం (refraction), ధృవీకరణం (polarisation) మొదలైన లక్షణాలు ఉంటాయని నిరూపించబడింది. హెర్జ్ పయనించిన దిశలో ఇంకా ముందుకి సాగిపోవాలని అనుకున్నాడు బోస్.

అదే సమయంలో బొలోనాలో మార్కోనీ తంతిరహితంగా విద్యుదయస్కాంత తరంగాలని ప్రసారం చెయ్యడానికి తిప్పలు పడుతున్నాడు. ఆ పోటీలో మరి నలుగురు ఉన్నారు – ఇంగ్లండ్ కి చెందిన లాడ్జ్, అమెరికాకి చెందిన ముయిర్హెడ్, రష్యాకి చెందిన పోపోవ్, భారతీయుడు బోస్. విజయం బోస్ ని వరించింది.

1895 లో ఓ బహిరంగ ప్రదర్శనలో, కలకత్తా టౌన్ హాల్ లో, అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ అలెగ్జాండర్ మకెన్జీ అధ్యక్షత వహించిన సమావేశంలో, బోస్ ఉన్న చోటి నుండి విద్యుదయస్కాంత సంకేతాన్ని పంపించి మూడు గోడల కవతల, 25 అడుగుల దూరంలో ఉన్న తుపానికి పేల్చగలిగాదు. ప్రపంచంలో ’రిమోట్ కంట్రోల్’ యొక్క మొట్టమొదటి ప్రదర్శన అదేనేమో.

బోస్ ఆ విష్కరణలు బ్రిటిష్ రాయల్ సొసయిటీ దృష్టిని ఆకట్టుకున్నాయి. లార్డ్ రాలీ సిఫారసు మీద ఆ సొసైటీ బోస్ ని తమ సొసైటీ ప్రచురణలో “విద్యుత్ కిరణాల తరంగదైర్ఘ్య మూల్యాంకనం” అన్న పేరుతో ఓ పత్రాన్ని ప్రచురించమని ఆహ్వానించింది. ప్రచురణకయ్యే వ్యయంలో సబ్సిడీ కూడా ఇచ్చింది. ఇది జరిగిన కొంత కాలానికి లండన్ యూనివర్సిటీ బోస్ కి డాక్టరేట్ నిచ్చి గౌరవించింది.

బోస్ కృషిని ఆధారంగా చేసుకుని లైట్ హౌస్ లలో కాంతికి బదులు విద్యుదయస్కాంత తరంగాలని వాడొచ్చని ’ఎలక్ట్రీషియన్’ అనే పత్రిక సూచించింది. ఈ కొత్త సాధనం నావికుల పాలిటి “త్రినేత్రం” అవుతుంది అందా పత్రిక.

ఇంగ్లండ్ లో, లివర్ పూల్ నగరంలో British Association for Advancement of Science సమావేశంలో బోస్ తన విద్యుదయస్కాంత పరికరాల గురించి ప్రసంగించాడు. ఆ ప్రసంగం విని మురిసిపోయిన లార్డ్ కెల్విన్, స్త్రీల విభాగంలో కూర్చున్న అందాల రాశి అయిన శ్రీమతి అబలా బోస్ వద్దకి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్లి ఆమెకి అభినందనలు చెప్తూ, ఆమె భర్త సాధించిన విజయాలు సామాన్యమైనవి కావని మెచ్చుకున్నాడు. ఆ తరువాత జనవరి 1897 లో Royal Institution లో మాట్లాడాడు బోస్. వైజ్ఞానిక రంగంలో అసామాన్యమైన, సరికొత్త ఆవిష్కరణలు ఆ సదస్సులో ప్రస్తావించడం జరుగుతుంటుంది. ఆ సదస్సులో బోస్ ప్రసంగం గురించి ’టైమ్స్’ పత్రిక ఇలా రాసింది: “ఒక పక్క ఉక్కిరిబిక్కిరి చేసే కాలేజి బాధ్యతలని నిర్వహిస్తూ, ఈ దేశపు ప్రమాణాల బట్టి చాలీచాలని వసతులతో, పరికరాలతో బోస్ సాధించిన విజయాలు, ఆయన ఆవిష్కరణల ప్రతిభని మరింతగా ఇనుమడింపజేస్తున్నాయి.”

ఆ విధంగా విద్యుదయస్కాంత తరంగ రంగంలో తను సాధించిన విజయాలకు యూరొపియన్ నిపుణుల గౌరవాదరాలు పొందిన బోస్ విజేయుడై ఇండియాకి తిరిగి వచ్చాడు.
(సశేషం...)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts